యెాగరేఖలు - మంజు యనమదల

యెాగరేఖలు " అద్వైతంలో ఆత్మానందం ఈ యెాగరేఖలు " రాయడం అనేది ఓ ప్రత్యేకమైన కళ. అదీ సాహిత్యంలో విభిన్న ప్రక్రియలలో పలు అంశాలను చదువరులు మెచ్చే విధంగా రాయగలగడం పూర్వజన్మ సుకృతం. చదువులో డాక్టరేట్ పట్టా పొందిన డా. పి విజయలక్ష్మి పండిట్ గారిది తెలుగు సాహితీ రంగంలో ఓ ప్రత్యేకమైన శైలి. కథలు, కవితలు, దీర్ఘ కవితలు, అనువాద రచనలే కాకుండా తెలుగులో గజళ్లు రాయడంలో కూడా పలువురి ప్రశంసలు అందుకున్నారు. దానికి సాక్ష్యంగా వీరు వెలువరించిన " యెాగరేఖలు " విశ్వపుత్రిక గజళ్లుగా మన ముందున్నాయి. " విశ్వపుత్రికకు సుఖదుఃఖాలు ఎన్ని ఎదురైనా నా ఆత్మజ్ఞానాన్ని ఇలలో పండించుకుంటాను!! " అన్న ఈ రెండు పాదాలలో ఈ " యెాగరేఖలు " పుస్తకంలో ఏముందో మనకు అర్థమైపోతుంది. భక్తునికి, భగవంతునికి మధ్యన అనుసంధానం భగవంతుని ధ్యానంలో తాదాత్మ్యమైన మనస్సు. మనసు నిశ్చలమై భగవధ్యానంలో ఉన్నప్పుడు కలిగే ప్రతి అనుభూతి మనకు ఈ పుస్తకంలో కనిపిస్తుంది. అది ప్రేమ, విరహం, నిరీక్షణ, నివేదన, బాధ, సంతోషం, మైమరపు, కోరిక ఇలా ఏదైనా కావచ్చు. పరమాత్మలో ఆత్మను దర్శించే అపురూప భావాలను అక్షర రూపంలో అందంగా, హృద్యంగా అందించారు. మేఘాల మెరుపులను, చినుకుల సవ్వడిని, ధనుర్మాసపు దైవ కార్యాలను, విరహపు తాపాలను, అంతులేని ఆరాధనను ప్రేమగా అక్షరాలకు పంచేసి, తనతో పాటుగా మనల్ని కూడా ఆ ప్రేమ పారవశ్యములో ముంచేసారు. " నన్ను నేను కోల్పోయి నీ చైతన్యమైన వేళ అద్వైత సిద్ధి అనుభవమై తరించాను ప్రభు!! " అంటూ తనలోని తాత్వికను సంతృప్తి పరుచుకుంటారు. " పరమాత్మా నీవే విశ్వపుత్రిక అంతిమ మజిలీవి నన్ను కోల్పోయి నీవయిపోవడం నాకానందం!! " అని తన ఆత్మానందాన్ని పంచుకున్నా " నాలో నిండిన ప్రకృతి శక్తి నీవే కదా ఏమివ్వగలను ఆ పరాశక్తికి కానుకగా!! " అన్న భావనను తనలోని భక్తికి పరాకాష్టగా మనం చూడవచ్చు. ఇలాంటి భక్తి పారవశ్యపు భావాలు గల గజళ్లు ఈ పుస్తకంలో కోకొల్లలు. " నీకై తపించే సత్యాన్వేషణే కదా నా నిజమైన విద్య నిను తెలియని విశ్వపుత్రిక జ్ఞానమెందులకు ప్రభూ!! " ఎంత పరిణితి కలిగిన భావనలో చూడండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన భావనలు ఈ యెాగరేఖలు మనకు అందిస్తాయి. చక్కని తెలుగు పదాలతో, ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ పై భక్తిని, అనురక్తిని, అపారమైన ప్రేమామృతాన్ని, అలౌకికానుబంధాన్ని తెలపడంలో మీరాబాయిని తలపించారు. రవీంద్రనాథ్ టాగోర్ గీతాంజలిని " అపూర్వగానం " పేరుతో తెలుగులోనికి అనువదించారు. యెాగరేఖలు పై ఆ ప్రభావం చాలా ఉంది. ఈ పుస్తకం ఆసాంతం చదివిన మనకు ఓ అవ్యక్తానుభూతి కలుగుతుందని మాత్రం చెప్పగలను. అందమైన ఆధ్యాత్మిక భావాలను " యెాగరేఖలు " గా అందించిన డా పి విజయలక్ష్మి పండిట్ గారికి హృదయపూర్వక అభినందనలు.

మరిన్ని వ్యాసాలు

Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు