అది 2026.అక్టోబర్ నెల.
మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఆగటం లేదు. ప్రపంచం ఇంధన సంక్షోభంలో కూరుకొని పోయింది. అంతటా ఆయిల్ కొరత. గ్యాస్ కొరత. దాని వలన ధరల పెరుగుదల. భారతదేశంలోని పూణేలోని ఒక ఆధునిక పరిశోధనా కేంద్రం. శాస్త్రవేత్తలంతా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వారిలో దీప్తి కూడా ఉంది. మహారాష్ట్రలోని షోలాపూర్ దగ్గర ఉండే ' గిరిడీ ' అనే గ్రామం ఆమెది. ఇంధన కొరతతో గ్రామస్తులు ఇక్కట్లు పడుతున్నారు. కట్టెల పొయ్యితో వంట. పూర్వకాలపు రోజులను గుర్తుకు తెస్తున్నాయి. ఆ రోజు శాస్త్రవేత్తల పరిశోధనలు విజయవంతమయ్యాయి. ఈ పరిశోధనల్లో దీప్తి 'కీ రోల్ 'పోషించిందని సీనియర్ శాస్త్రవేత్తలు మెచ్చుకున్నారు. అణుశక్తితో విద్యుత్ అవసరాలే కాదు వంట సమస్య కూడా తీరుతుంది. అయితే ఈ అణుశక్తిని మొదట ఎక్కడ ప్రయోగించాలని ఆలోచిస్తున్నారు.దీప్తి తన గ్రామం పేరు చెప్పింది.
అయితే అణుశక్తి అనంగానే గ్రామస్తులు భయపడ్డారు. దీప్తి గ్రామస్తులను అందరినీ రచ్చబండ దగ్గరికి రమ్మంది.
" అణుశక్తి అంటే రేడియేషన్ సమస్య వస్తుంది. అసలు దాని వలన విధ్వంసం తప్ప ఇంకోటి లేదని విన్నాము!"అన్నారు కొందరు పెద్దవాళ్ళు.
"కాకా!అదేమీ కాదు. అణు వినశనానికే కాదు!వికాసానికి కూడా పనికివస్తుంది. ఏమీ భయం లేదు!నా మాట నమ్మండి!"అని వాళ్లందరికీ సర్ది చెప్పింది.
వాళ్ళు ఒప్పుకోలేదు.
"రేడియేషన్ వల్ల క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తే ఏం చేస్తాం!అణుశక్తి అంటేనే భయం వేస్తోంది!"అంటూ గ్రామంలోకి వీళ్ళను రానివ్వటానికి ఒప్పుకోలేదు గ్రామస్తులు. నిరాశపడింది దీప్తి.
ఆ రాత్రి నిద్రపట్టలేదామెకు.
ఇంతలో ఆమె తండ్రి గోపాల్ కూతురు దగ్గరికి వచ్చాడు.
దిగులుగా ఉంది దీప్తికి.
"బాధపడకు బేటా!కొంత కాలానికి ఊళ్ళో వాళ్ళు ఒప్పుకుంటారు. అణుశక్తి అంటే కేవలం బాంబులు తయారు చేయటానికే అనే అభిప్రాయం ప్రజల్లో వేళ్లూనుకొని ఉంది!అయితే మెల్లగా చెబుతూ ఉంటే వాళ్ళల్లో మార్పు వస్తుంది!"అని ధైర్యం చెప్పాడు గోపాల్.
దీప్తి మళ్ళీ పూణేకు వచ్చి పనిలో పడింది.
గిరిడీ గ్రామంలో గ్యాస్ కష్టాలు ఎక్కువవుతున్నాయి. ఎండు కట్టెలు దొరకటం కష్టం అవుతోంది. గ్రామస్తులలో కొందరు యువకులు మాత్రం దీప్తిని పిలిపిద్దామనుకొన్నారు. తప్పలేదు. ఇంకో మార్గం ఏముంది? అధికారులు ఏమీ భయం లేదని చెబుతున్నారు కదా!ఊరిలో ఎన్నో తర్జన భర్జనలు జరిగాయి. మొత్తానికి దీప్తికి కబురు వెళ్ళింది.
అధికారులతో కలిసి వచ్చి
, గ్రామస్తులకు వివరించి చెప్పి వాళ్ళల్లో ఉండే భయాన్ని పోగొట్టింది దీప్తి. మొత్తానికి దీప్తి మీద నమ్మకంతో ఒప్పుకున్నారు గ్రామస్తులు.
చకచకా పనులు జరిగాయి.
ఇప్పుడు ఆ గ్రామంలో విద్యుద్దీపాలు వెలుగుతున్నాయి. ఆడవాళ్లు వంటలను కూడా అణుశక్తితో చేస్తున్నారు.
గ్రామస్తులు సంతోషించారు. దీప్తిని అందరూ అభినందించారు. భారతదేశంలోని చాలా గ్రామాలు నేడు అణుశక్తితో ప్రగతిని సాధిస్తున్నాయి.
(సమాప్తం )

