జ్యోతి ది ఒక అందమైన కుటుంబం... అర్థం చేసుకునే భర్త శేఖర్, చిన్నచిన్న అల్లరి పనులు చేసినా, ముద్దుగా మాట వినే కూతురు.. ముగ్గురు కలిసి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
పౌర్ణమి రాత్రి సముద్రపు అలలు చూడటం, నెలకు ఒకసారైనా అలా బయటకు వెళ్లి తిని రావడం, ఏడాది కి ఒకసారి ఒక్క ట్రిప్.. ఇవి వారి జీవితాల ఆటవిడుపు...
ప్రతిరోజు రాత్రి 15 నిమిషాలు వారు ముగ్గురు కబుర్లు చెప్పుకొని పడుకోవాలి, అని భర్తకు గట్టిగా చెప్పేది . ఆ "ఫ్యామిలీ టైమ్" ని తప్పకూడదని, అది ఒక మంచి బంధం ఏర్పడటానికి దోహదపడుతుంది అని చెప్పి, దాన్ని అలవాటుగా వారి జీవితాల్లోకి తీసుకువచ్చింది జ్యోతి.
అసలు అల్లరి ఆపని టైం లో కూడా, ఆరోజు "ఫ్యామిలీ టైం" ఉండదు అంటే అల్లరి మొత్తం ఆపేస్తుంది లాస్య.. అంత ఇష్టం అమ్మ నాన్న తను ఆడే ఆటలు, పాటలు కబుర్లు నవ్వులతో ఉండే ఆ సమయం అంటే ఆ పాపకి..
అలా ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో అనుకోకుండా ఒక సమస్య శేఖర్ వాళ్ళ ఆఫీసులో... దానితో శేఖర్ రాత్రి పగలు ఆఫీస్ వర్క్ లో నిమగ్నం అయిపోయి ఉండేవాడు.. ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ పని చేస్తూ ఇదివరకు లాగా జ్యోతితో, లాస్యతో సమయం గడిపేవాడు కాదు..
శేఖర్ తనతో గడిపే సమయం తగ్గడం వల్ల, తనకి బాధ కలుగుతున్నా, ఆ పని ప్రాముఖ్యత తెలిసిన జ్యోతి
భర్తకు ఇబ్బంది కలగకూడదని, తన పని తను చూసుకుంటూ ఉండేది ..
అలా రోజులు గడిచే కొద్దీ, తన ఒంటరితనంగా అనిపించడాన్ని తగ్గించుకోవడం కోసం మొబైల్ లో రీల్స్ చూడడం మొదలు పెట్టింది.. మొదటిలో కాలక్షేపానికి చూడటానికి మొదలుపెట్టినా, కాలక్రమేణ దాని సమయం ఎక్కువ అవుతూ వస్తుంది రోజుకి 1 గంటనుంచి 2, 3, 4 గంటలుగా మారిపోయింది...
జ్యోతి తో పాటు స్కూల్ నుంచి వచ్చాక లాస్య కూడా అమ్మతో రీల్స్ చూడడం మొదలుపెట్టింది..
ఒకరోజు రీల్స్ చూస్తున్న జ్యోతి కి ఆ రీల్స్ చూడటం వల్ల మెదడుకి కలిగే ప్రమాదం ఎంత భయంకరమైనదో చెప్పే వీడియో కనబడింది.. వెంటనే నిర్ణయించుకుంది మొబైల్ వాడకం తగ్గిద్దామని..
తన కూతురి ఆరోగ్యం గురించి కూడా బెంగ పడింది.. ముందుగా తను మారి తన కూతుర్ని మార్చాలి అనుకుంది..
ఆ రోజు గట్టిగా నిర్ణయించుకుంది, రోజుకు 12 గంటలు డిజిటల్ ఫాస్టింగ్.. మొదలుపెట్టాలని..
ఆరోజు డిజిటల్ ఫాస్టింగ్ మొదలైతే పెట్టింది గాని, మొబైల్ చూడడం అలవాటు అయిన జ్యోతి కి ఆ రీల్స్ చూడకుండా పడుకోవడం చాలా కష్టమైంది... నిద్ర పట్టక చాలాసేపు పక్క పైన కాలక్షేపం చేసి, చివరికి ఏదైనా కథ రాద్దామనుకొని లేచి కూర్చొని పేపర్ పై పెన్ను పెట్టి మొదలు పెట్టింది.... అలా మొదలుపెట్టిన ఆ కథ రెండు పేజీలు రాయగలిగింది..
జ్యోతి ఆనందానికి అవధులు లేవు తను కూడా రాయగలదు అని తనకి ఆరోజు తెలిసింది.. మరుసటి రోజు కూడా కూర్చొని ఆ కథని పూర్తి చేసింది తన కథని పత్రికలకు వాళ్ళకి పంపింది వాళ్లు దాన్ని అచ్చు వేస్తారు..
అప్పుడు తెలిసింది జ్యోతికి కాలక్షేపం కోసం మనం ఎన్నుకునే మార్గం అనేది ఎప్పుడు మనలోని మంచి మార్పులు తీసుకొచ్చేదై ఉండాలి..అని..
ఆ ఉత్సాహంతోని, జ్యోతి మరో కథ రాయడం కూడా మొదలు పెట్టింది...తల్లిని చూసి పాప కూడా ఖాళీ వున్నప్పుడు, మొబైల్ వదిలేసి ఏదో ఒక పుస్తకాన్ని చదవటం మొదలుపెట్టింది..
ఒక రోజు రాత్రి కూతురు పుస్తకం చదువుతూ ఉంటే భర్త తన ఆఫీసు పని చేసుకుంటూ ఉంటే, జ్యోతి తన రెండవ పుస్తకానికి చివరి వాక్యాలు ఈ విధంగా రాస్తుంది
ఏ అలవాటుని దురలవాటుగా మారనీయకూడదు.
ఎంత దూరం వెళ్లినా ఆ దారి నుంచి వెనక్కి తిరిగి రావడం అనేది తెలిసి ఉండాలి....అంటూ..

