కవిత, విజిత మంచి స్నేహితులు. వారు ఏడవ తరగతి చదువుతున్నారు. వారు ఎప్పుడు చూసినా తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఉల్లాసంగా ఉండేవారు. కానీ ఎవరైనా ఇతరులు వారిరువురిలో ఏ ఒక్కరి జోలికి వచ్చినా, ఆ రెండవ వ్యక్తి వారిపైన విరుచుకుపడేది. ఎక్కడ చూసినా ఇద్దరూ కలిసే ఉండేవారు. చదువు విషయానికి వచ్చేసరికి విజితకు ఎప్పుడూ మొదటి స్థానం వచ్చేది. కవితకు మాత్రం రెండవ స్థానం వచ్చేది. అలా జరిగిన ప్రతిసారీ కవితకు, "విజిత ఈ బడి మానేస్తే నాదే కదా మొదటి స్థానం!" అని అనిపించేది. ఆ ఆలోచన ఆలోచనగానే ఉంచుకునేది కవిత. కానీ సంవత్సరం ఆఖర్లో జరిగిన బడి వార్షికోత్సవ వేడుకల్లో కేవలం మొదటి స్థానం వచ్చినవాళ్లకు మాత్రమే స్టేజీపైకి పిలిచి కలక్టరుగారి చేతులమీదుగా బహుమతులు ఇప్పించారు. ఆ రోజు విజితకు బహుమతి ఇస్తున్నప్పుడు అందరూ చప్పట్లు కొడుతుంటే కవితకు ఎంతో వికారంగా అనిపించింది. రెండు రోజుల తరువాత విజితకు కలిసిన కవిత, "నేను ఈ సంవత్సరం వేరే బడికి మారిపోదామనుకుంటున్నాను" అని చెప్పింది. కవిత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, "ఏ బడిలో చేరుతావో చెప్పు నేను కూడా అక్కడికే వచ్చేస్తా!" అని విజిత నవ్వుకుంటూ చెప్పింది స్నేహితురాలి కోసం. బడికి సెలవులిచ్చారు. విజిత నిజంగానే తన స్నేహితురాలు చెప్పిన బడిలోకి మారిపోయింది. కవిత తాను వేసిన పథకం ఫలించినందుకు ఎంతో సంతోషించింది. కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. ఎనిమిదవ తరగతిలో కొత్త పిల్లలు ఇద్దరు చేరారు. అందులో శ్యాం కుమార్ అనే అబ్బాయి చాలా చురుకైన విద్యార్థి. రోజులు గడిచాయి. కవితకు చాలా ఒంటరిగా అనిపించేది. కానీ ఆ విషయం బయటపెట్టేది కాదు. మొదటి టర్మ్ పరీక్షలు రానే వచ్చాయి. అందరూ బాగా చదివి పరీక్షలు రాసారు. అందరూ ఖచ్ఛితంగా కవితకే మొదటి స్థానం వస్తుందని అనుకున్నారు. కానీ శ్యాం కుమార్ కి వచ్చింది. కవిత ఎప్పటిలాగానే రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. తనకు తగిన గుణపాఠం జరిగిందని అప్పటికి తెలిసొచ్చింది కవితకు. తన పొరపాటుకు ర్యాంకు రాలేదు సరికదా, మంచి స్నేహితురాలికి కూడా కోల్పోయింది కవిత. నీతి: పోటీతత్వాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప తప్పుడు మార్గాలను ఆశ్రయించకూడదు. అలా తప్పు చేసిన నాడు నీవు మరింత బలహీనుడువి అవుతావు తప్ప బలపడవు