కోహినూర్ . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

కోహినూర్ .

కోహినూర్ .

(కో-ఇ-నూర్; ఉర్దూ లో "కాంతిపర్వతం") ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాలలో ఒకటి. పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతం (కోహ్=పర్వతం, నూర్=కాంతి) "కాంతి పర్వతం".

దీని బరువు 105.6 క్యారట్లు (21.12 గ్రా.) ఇది బ్రిటిష్ క్రౌన్ ఆభరణాలలో భాగం.

కాకతీయ రాజవంశం కాలంలో భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పూర్వపు గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం కోళ్లూరు గనులలో తవ్వినట్లు భావించబడుతున్నా, దాని మూల బరువు గురించి రికార్డులు లేవు. తొలిసారిగా ధృవీకరించబడిన బరువు 186 పాత క్యారెట్లు (191 మెట్రిక్ క్యారెట్లు లేదా 38.2 గ్రా). దీనిని ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖల్జీ స్వాధీనం చేసుకున్నాడు. వజ్రం మొఘల్ నెమలి సింహాసనం లో ఒక భాగం. ఇది దక్షిణ, పశ్చిమ ఆసియాలో చాలా చేతులు మారి, చివరికి పదకొండు ఏళ్ల చక్రవర్తి మహారాజా దులీప్ సింగ్ పరిపాలనలో వున్న పంజాబ్ బ్రిటిష్ ఆక్రమణ తర్వాత బ్రిటన్ రాణి క్వీన్ విక్టోరియా స్వాధీనంలోకి వచ్చింది. అంతకు ముందు జమ్మూ కాశ్మీర్ ఒకటవ వ మహారాజు గులాబ్ సింగ్ స్వాధీనంలో వుండేది.

వాస్తవానికి, ఈ రాయి ఇతర మొఘల్-యుగపు వజ్రాలైన ప్రస్తుతం ఇరాన్ క్రౌన్ ఆభరణాలలో భాగమైన దర్యా-ఇ-నూర్ కు సమానమైన కోతతో వుండేది. 1851లో, ఇది లండన్‌లోని గ్రేట్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు, కాని పేలవమైన కోతతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. క్వీన్ విక్టోరియా భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ దీనిని కోస్టర్ డైమండ్స్ చేత అండాకారపు కాంతివెలుగుతో తిరిగి కత్తిరించాలని ఆదేశించాడు. ఆధునిక ప్రమాణాల ప్రకారం, క్యూలెట్ (రత్నం దిగువన ఉన్న స్థానం) అసాధారణంగా విస్తృతంగా ఉంటుంది, రాయిని పైనుండి చూసినప్పుడు ఇది అగాధమైన చీకటిగా వుంటుంది. అయినప్పటికీ దీనిని రత్న శాస్త్రవేత్తలు "జీవితంతో నిండినది" గా భావిస్తారు.

చరిత్రలో కో-ఇ-నూర్ ధరించిన ఏ పురుషులకైనా దురదృష్టం తెచ్చిపెట్టినందున బ్రిటిష్ రాజ కుటుంబంలోని మహిళలు మాత్రమే ధరిస్తారు. విక్టోరియా రాణి దీనిని బ్రూచ్, సర్క్ లెట్ లో భాగంగా ధరించింది. 1901 లో ఆమె మరణించిన తరువాత, ఇది ఎడ్వర్డ్ VII భార్య అలెగ్జాండ్రా రాణి కిరీటంలో ఉంచబడింది. ఇది 1911 లో మేరీ రాణి కిరీటానికి, 1937 లో పట్టాభిషేకం జరిగిన ఎలిజబెత్ రాణి కిరీటానికి బదిలీ చేయబడింది.

ప్రస్తుతం ఈ వజ్రం లండన్ టవర్ వద్ద ఉన్న జ్యువెల్ హౌస్ లో బహిరంగ ప్రదర్శనలో ఉంది. దీనిని ప్రతి సంవత్సరం లక్షల సందర్శకులు సందర్శిస్తారు. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, భారతదేశం, పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాలు కో-ఇ-నూర్ తమకే చెందుతుందని ప్రకటించాయి, తమకు తిరిగి ఇవ్వాలని కోరాయి .లాహోర్ చివరి ఒప్పందం నిబంధనల ప్రకారం రత్నాన్ని చట్టబద్ధంగా పొందినందున బ్రిటిష్ ప్రభుత్వం వాదనలను తిరస్కరించింది.

భారతదేశానికి చెందిన ఓ అసాధారణ వజ్రం కోహినూరు చాలామంది చరిత్రకారుల ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీ. శ. 1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్తో సంధిచేసుకొని అపారమైన సంపదతో బాటు, కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడు. ఢిల్లీ సుల్తానుల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోఢి మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబరు చేతిలో ఓటమిపాలై, చివరకు మరణించారు. ఇబ్రహీం లోఢీ మరణానంతరం కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా బాబర్ వశమయ్యింది. హుమాయున్‌కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి బాబర్‌తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్యవస్తువులు దానం చేయాల్సిందిగా సలహాఇచ్చారు. తనవద్దనున్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికీ ఇచ్చేందుకు సిద్ధపడలేదని, ఆపైన కొద్దిరోజుల్లో తన ప్రాణమే కొడుకు ప్రాణం నిలబెట్టేందుకు భగవదర్పణం చేసినా వజ్రాన్ని నిలపుకున్నారని అక్బరునామాలో వ్రాశారు. ఈ కారణంగా 1530లో మొఘలుల వద్ద ఈ వజ్రం ఉండేదన్న విషయం స్పష్టమైంది.

బాబర్ తన కుమారుడు, సామ్రాజ్యవారసుడూ అయిన హుమాయున్‌కి ఇచ్చారు. హుమాయున్ దానిని అంత్యంత ప్రాణప్రదంగా చూసుకున్నారు. 1530లో రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరాల్లో హుమాయున్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షేర్షా తిరుగుబాటు వల్ల 1539-40 నవంబరు నెలలో రెండుమార్లు యుద్ధం చేసినా హుమాయున్ అతనిపై ఓటమిచెందారు. హుమాయున్ రాజ్యాన్ని పరిమితం చేసుకని, ఢిల్లీని వదిలి రాజస్థానంలో కాలం గడిపారు. అప్పట్లో ఈ వజ్రాన్ని చేజిక్కించుకునేందుకు మార్వాడ్ రాజు రాజా మాల్దేవు రాజ్యం దగ్గరలో హుమయూన్ ఉన్నప్పుడు ఎలాగైనా దీన్ని సాధించాలని ప్రయత్నించారు. అందుకోసం

బాబర్‌ నామాలో మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ కోహినూర్‌ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ "ఇది ఎంత విలువైనదంటే దీని వెల యావత్‌ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది' అన్నాడు. తర్వాత మాల్వాను జయించిన ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్‌ ఖిల్జీ దీన్ని సొంతం చేసుకున్నాడు. 1626వ సంవత్సరంలో కాంతులీనే ఈ అపురూప వజ్రం బాబర్‌ వశమై 'బాబర్‌ వజ్రం'గా పేరు పొందింది. మొఘల్‌ సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన నాదిర్ షా ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే దాని ఆచూకీ తెలుసుకోలేకపోయాడు. మొఘల్‌ చక్రవర్తి మహమ్మద్‌ షా ఎల్లవేళలా వజ్రాన్ని తన తలపాగాలో దాచుకుంటాడని కొంతకాలం తర్వాత ఒక మహిళా పరిచారిక ద్వారా తెలుసుకుంటాడు. మహమ్మద్‌ షాను తెలివిగా విందుకు ఆహ్వానించి, తలపాగాలు ఇచ్చి పుచ్చుకుందామన్న ప్రతిపాదన పెడతాడు. అలా గత్యంతరం లేని పరిస్థితులలో మహమ్మద్‌ షా విలువైన ఈ వజ్రాన్ని నాదిర్‌షాకు ధారాదత్తం చేస్తాడు. నాదిర్‌షా దాన్ని చూడగానే కోహ్‌ - ఇ- నూర్‌ (కాంతి శిఖరం) అని అభివర్ణించాడు. దానికి ఆ పేరే స్థిరపడిపోయింది.

భారతదేశం నుంచి ఇంగ్లాండ్‌కు.

క్రీ. శ. 1913 (1813?) వ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్‌ రాజుల నుంచి పంజాబ్‌పాలకుడు మహారాజా రంజిత్‌ సింగ్‌దీ న్ని సొంతం చేసుకున్నాడు. చివరికి చిన్నవయసులో పట్టాభిషిక్తుడైన దులీప్‌సింగ్‌ ద్వారా బ్రిటిష్‌ గవర్నర్‌ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు. రాణి దానికి మళ్లీ సాన బెట్టించింది. సానపెడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత నూటా ఎనభై ఆరు క్యారెట్ల నుంచి నూటా తొమ్మిది క్యారెట్లకు తగ్గింది. దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది.

తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్‌ రాణులు దీన్ని ధరించారు. దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు. రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపజేశారు. ఈ కారణంగా కోహినూర్‌ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా 1947, 1953వ సంవత్సరంలలో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు.

వెలుగులకొండ విశేషాలు.

బ్రిటిష్‌రాణి కిరీటంలో రెండువేల ఎనిమిదివందల వజ్రాల మధ్య రారాజులా వెలిగిపోతున్న కోహినూర్‌ వజ్రాన్ని, సుల్తాన్‌గంజ్‌ బుద్ధ విగ్రహాన్ని ఇవ్వాలంటూ భారత్‌ చేసిన ప్రతిపాదనను బ్రిటన్‌ తోసిపుచ్చింది. కోహినూరు వజ్రమే పురాణాల్లోని శమంతకమణి అని నమ్మేవారు ఉన్నారు. బ్రిటిష్‌ రాజకుటుంబం కోహినూరు వజ్రాన్ని ఆ ఇంటి పెద్దకోడలికి వారసత్వ కానుకగా ఇస్తోంది. బాబర్‌ చక్రవర్తి నూట ఎనభైఆరు క్యారెట్ల బరువైన ఆ వజ్రం ఖరీదు 'ప్రపంచానికంతా రెండున్నర రోజులు భోజనం పెట్టినంత' అన్నాడట. ఆల్బర్ట్‌ యువరాజు దానిని సానబట్టిస్తే రెండువేల వజ్రాలు అరిగిపోయాయి. బరువు నూటఅయిదు క్యారెట్లకు పడిపోయింది . సేకరణ: