జీవిత పోరాటం - కందర్ప మూర్తి

Jeevitha poratam

" అమ్మా , ఈటర్మ్ ఫీజు కడితే నా యంబిఎ పూర్తవుతుంది. తర్వాత ఎక్కడైనా ఉధ్యోగం సంపాదించి ఇంటి భాద్యత చూస్తానే" అనగానే కొడుకు సుధాకర్ మాట విని కమలమ్మ " నేనూ అదే ప్రయత్నంలో ఉన్నారా, పెట్టు బడి లేక వ్యాపారం సరిగ్గా నడవడం లేదు. ఎక్కడైనా బదులు తీసుకుని నీకు ఫీజు కడతాను. రెండుమూడు రోజులు ఆగు " అని సముదాయిస్తోంది. ఊళ్లో వారికి పాత పెంకుటిల్లు వ్యాపారం తప్ప మరో ఆదాయ మార్గం లేదు. తను చిన్నగా ఉన్నప్పుడే నాన్న కేన్సర్ తో చనిపోవడం, తర్వాత అమ్మ తనను , చెల్లిని పెంచే భాద్యత భూజాల మీద వేసుకుని అప్పడాలు వడియాలు ఊరగాయలు పచ్చళ్లు అమ్ముతూ పెంచి పెద్ద చేసింది. తను డిగ్రీ పూర్తి చేసి యంబిఎ లో జాయినయి చివరి సెమిస్టర్ కి వచ్చాడు. చెల్లి భారతి టెన్తులో కొచ్చింది. తను యంబిఎ పూర్తవగానే మంచి జాబు సంపాదించి చెల్లిని కాలేజీ చదువులు అమ్మకి బిజినెస్ లో ఆర్థికంగా సహాయ పడాలని ఊహాలోకంలో విహరిస్తున్నాడు సుధాకర్. అనుకున్నట్టుగానే కమలమ్మ ఎక్కడో ఫీజు డబ్బు సర్దుబాటు చేసి కొడుక్కి ఇచ్చింది. సుధాకర్ పార్టుటైం జాబ్ చేస్తు పొదుపుగా ఉన్నప్పటికీ అన్ని అవసరాలు తీరడం లేదు.అమ్మని బాధ పెట్టడం తప్పడం లేదని మనసులో ఆవేదన పడుతుంటాడు. యంబిఎ రిజల్ట్స్ వచ్చాయి. సుధాకర్ మెరిట్ మార్కులతో పాసయాడు. తనకి ఉధ్యోగ అర్హత సర్టిఫికేట్ దొరికిందని ఆనంద పడ్డాడు. ఉధ్యోగ ప్రయత్నంలో కార్పొరేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా సెలక్ట్ అయాడు. సిటీలో జాబ్. ఆ కంపెనీలోనే మార్కెటింగ్ చేస్తున్న ఆనంద్ తో రెంట్ హౌస్ షేరింగు చేసుకున్నాడు. ఆనంద్ బేచిలర్ . పైలా పచ్చీస్ మనిషి. భాద్యతలేం లేవు. క్లబ్బులు పబ్ లంటు డబ్బు దూబరా చేస్తుంటాడు. తల్లిదండ్రులు కారు యాక్సిడెంట్లో చనిపోతే మేనమామ దగ్గర పెరిగాడు. తండ్రి ప్రోపర్టీ చాలానే మేనమామ ట్రస్టీగా ఉంది. చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదివి ఫ్రెండ్స్ సినిమాలు జల్షాలతో పెరిగాడు. అమ్మానాన్నల ప్రేమ ఎలాగుంటుందో తెలియదు.ఆనంద్ కి జాబ్ చెయ్యాల్సిన అవుసరం లేదు.ఏదో టైంపాస్ కోసం చేస్తున్నాడు.సిగరెట్లు, మందు , అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటాడు.ఖరీదైన ఫేషన్ డ్రెస్సులు ఫారిన్ పెర్ఫ్యూమ్స్ స్టైల్ మైంటైన్ చేస్తుంటాడు. మార్కెటింగ్ జాబ్ లో ఉండటం వల్ల చాల మందితో పరిచయాలు పెంచుకున్నాడు. క్లబ్బులు పబ్బుల్లో పరిచయమైన అమ్మాయిలతో జల్షా చేస్తుంటాడు.అప్పుడప్పుడు గోవా ఊటీ డార్జిలింగ్ జాలీ ట్రిప్పులతో ఎంజాయ్ చేస్తుంటాడు.కంపెనీ మానేజ్మెంటు కూడా ఆనంద్ కు ఉన్న పరపతిని దృష్టిలో పెట్టుకుని ఏమీ ప్రెజర్ చెయ్యరు. ఆనంద్ కి అమ్మాయిల ఫోన్ కాల్స్ తరచువస్తుంటాయి. వాళ్లంతా హైక్లాస్ కుటుంబాల అమ్మాయిలు, సెలబ్రెటీలు. అప్పుడప్పుడు సుధాకర్ ఉండే రెంట్ హౌస్ కి ఆనంద్ కోసం వస్తుంటారు. సుధాకర్ సపరేట్ గా ఒక బెడ్రూమ్ లో ఉంటున్నాడు కనక వారితో మాట్లాడే పని లేకపోయింది. తోడు కోసం ఆనంద్ సుధాకర్ ని వెంట ఉంచుకున్నాడు తప్ప డబ్బు కోసం కాదు. వద్దంటున్నా సుధాకర్ తన వంతు రెంటు ఆనంద్ చేతుల్లో ఉంచుతాడు. ఆనంద్ హేబిట్సు తెలిసినా గత్యంతరం లేని పరిస్థితిలో అక్కడ ఉండవల్సి వస్తోంది. సుధాకర్ వీలున్నప్పుడల్లా ఊరికి వెళ్లి అమ్మని చెల్లినీ చూసి వస్తున్నాడు. కొడుకు కష్టపడి చదివి మంచి కొలువు సంపాదించుకున్నాడని కమలమ్మ సంతోష పడింది. ఇంక కూతురి చదువు పెళ్లి భాద్యత కొడుకే చూసు కుంటాడని నమ్మకం వచ్చింది. ఒక శలవురోజున ఆనంద్ కోసం ఒక అమ్మాయి ఇంటికి వచ్చింది. అప్పుడు ఆనందు మరో పని మీద బయట ఉన్నాడు. ఎక్కడికి వెల్లాడని సుధాకర్ ని అడిగితే తెలియదు అన్నాడు. మర్యాద కోసం ఆ అమ్మాయిని కూర్చోండని కుర్చీ చూపించాడు. ఆ అమ్మాయి మొహమాటంగా కూర్చుంది. గ్లాసుతో మంచి నీళ్లు ఇచ్చాడు. ఆ అమ్మాయిని తన కంపెనీలో చూసినట్టు లేదు. చూడటానికి మద్య తరగతి కుటుంబం అమ్మాయిలా అనిపిస్తోంది. తన చెల్లి భారతి కళ్ల ముందు ఉన్నట్టు అనిపించింది సుధాకర్ కి. ఉండబట్టక ఆనంద్ ఎలా పరిచయం అని అమాయకంగా అడిగాడు. ఆ అమ్మాయి తటపటాయిస్తునే చెప్పడమా వద్దా అనే మీమాంసలో పడింది. "నా పేరు సావిత్రి. ఆనందు గారు నాకు డబ్బు సాయం చేస్తుంటారు.మాది శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడిన గ్రామం. నాన్న మగ్గం మీద బట్టలు నేస్తాడు. ఇప్పుడు నాన్న పక్షవాతం వచ్చి మంచం మీదున్నాడు.అమ్మకి ఆస్తమా జబ్బు. కష్టపడి పనిచెయ్య లేదు. కుటుంబంలో నేను పెద్ద దాన్ని. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్లు చదువు కుంటున్నారు. నేను హాస్టల్లో ఉండి డిగ్రీ పూర్తి చేసాను. ఇంట్లో సంపాదన లేక ఆర్థిక అవసరాల కోసం నేను ఉధ్యోగం కోసం పట్నం రావల్సి వచ్చింది. పట్నంలో తెలిసిన స్నేహితురాలితో ఉంటూఉధ్యోగ ప్రయత్నం మొదలెట్టాను. ఒంటరి వయసొచ్చిన ఆడపిల్లలు పట్నంలో ఉధ్యోగం చెయ్యాలన్నా బతకాలన్నా ఎన్నెన్ని కష్టాలు ఎదుర్కోవాలో ఇక్కడకు వచ్చినాక తెల్సింది. డిగ్రీ తప్ప మరే విద్యార్హతలు లేని నాలాంటి వారి సంగతి వేరే చెప్ప నవుసరం లేదు. ఉధ్యోగ ప్రయత్నంలో రోజులు గడుస్తున్నప్పటికీ పురోగతి కనబడ లేదు.నేను పట్నం వచ్చాను కనక ఉధ్యోగం చేసి డబ్బులు పంపుతానని ఇంటి దగ్గర వాళ్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నా స్నేహితురాలు కూడా నాలాగే భాద్యతల భారంతో కుములుతోంది.ఏదో ప్రైవేటు కంపెనీలో పేకింగ్ డిపార్ట్మెంట్లో రోజువారీ జీతం మీద పనిచేస్తోంది. అక్కడ పని చేసే ఎందరో మహిళలు లైంగికంగా ఎదుర్కొనే బాధలు చెప్పేది. కొందరు మహిళలు గత్యంతరం లేక అడ్డదారులు తొక్కేవారట. నాతో కలిసుండే స్నేహితురాలు కూడా అప్పుడప్పుడు గదికి రాకుండా ఎక్కడో గడిపి మర్నాడు ఉదయం వచ్చేది.కారణం తను చెప్పేదు కాదు. నేనూ అడిగేదాన్ని కాదు. నేను కూడా ఉధ్యోగ ప్రయత్నంలో విసుగెత్తి ఇంటికి పోయి నాన్న మగ్గం పని నేర్చుకుని బతకాలనుకున్నాను. ఒకరోజు నా స్నేహితురాలు తమ కంపెనీ ఎడ్మినిస్ట్రేట్ ఆఫీసులో ఆఫీస్ ఎటెండెంట్ ఉధ్యోగం కాళీ ఉందని చెప్పి ప్రయత్నించమంది. అప్పుడు అక్కడ ఆనంద్ గారు కంపెనీ శెక్రెటరీ గారితో మాట్లాడుతూ నన్ను పరిచయం చేసుకున్నారు. వారి ప్రోద్బలంతో నాకు ఆఫీసులో ఉధ్యోగం దొరికింది. నెల జీతం ఎక్కువే రికమండ్ చేసారు. ఆనంద్ గారి సహాయంతో నెలజీతం వచ్చి ఇంటికి డబ్బులు పంప గలుగు తున్నాను.అలా వారితో చనువు పెరిగింది. రెండు మూడు సార్లు రెస్టారెంట్ కి కూడా తీసుకెళ్లి డిన్నర్ చేయించారు. ఒకసారి హోటల్ కి తీసుకెళ్లి డిన్నర్ చేయించి నన్ను శారీరకంగా అనుభ వించారు. నాకు కష్ట కాలంలో ఆపద్భాంధవుడిగా ఆదుకున్న ఆనంద్ గారిని ఆపలేకపోయాను.అప్పుడప్పుడు వారి కోరికను కాదనలేక పోయేదాన్ని.నాకు ఎప్పుడు డబ్బు అవుసరమైనా సహాయ పడేవారు.ఇప్పుడు నాకు అర్థమైంది నా స్నేహితురాలు ఒక్కొక్కసారి ఎందుకు రాత్రికి గదిలో ఉండేది కాదో. ఈ సమయంలో నేను గర్భవతిని. ఆనంద్ గారితో విషయం మాట్లాడు దామని వచ్చాను."అని మనసులోని బాధ చెప్పింది ఏడుస్తూ. సుధాకర్ మనసు చివుక్కుమంది. మద్యతరగతి కుటుంబాల్లో వివాహం కాకుండా గర్భవతి ఐతే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా గుంటుందో ఊహించి బాధ పడ్డాడు. ఇప్పటి వరకు చదువు కుటుంబ సంగతులు తప్ప ఇతర విషయాల మీద ద్యాస పెట్టని సుధాకర్ సిటీకి వచ్చి కార్పొరేట్ సంస్థలో ఉధ్యోగంలో చేరాక బయటి ప్రపంచమంటే ఏమిటో అవగాహన జరుగుతోంది. కొన్ని సార్లు పార్కుకి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు చీకటిలో రోడ్డు పక్కన కొందరు మహిళలు అందంగా అలంకరించుకుని దారంట పోయే మగవారిని ఆకర్షించడానికి చేసే చేస్టలు గమనించాడు సుధాకర్. ఎలాగైనా ఆనంద్ ని ఒప్పించి ఈ అమ్మాయికి న్యాయం చెయ్యాలను కున్నాడు. వాస్తవానికి తనకు ఆనంద్ కి దగ్గరి స్నేహం లేకపోయినా తన మాటకు విలువిస్తాడన్న నమ్మకముంది. మధ్యాహ్నం వరకు ఎదురు చూసినా ఆనంద్ రాకపోవడంతోఆ అమ్మాయి వెళిపోయింది. రాత్రికి ఆనంద్ గదికి వచ్చాడు.ఒంటరిగానే కన్పించడంతో ఆయన గదికి వెళ్లి విష్ చేసాడు సుధాకర్. ఎప్పుడూ తన గదికి రాని సుధాకర్ ఇలా రాత్రి సమయంలో రావడం చూసి ఆశ్చర్య పోయాడు ఆనంద్. ఆఫీసు కబుర్లు అవీ ఇవీ మాట్లాడిన తర్వాత ఉదయం సావిత్రి రావడం వారి మద్య ఏర్పడిన పరిచయం తెలియచేసి ఇప్పుడు ఆ అమ్మాయి ప్రిగనెంట్ అని మద్య తరగతి కుటుంబాల్లో పెళ్లి కాకుండా గర్భం దాలిస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో వివరించాడు. ఇలా జల్షాలు తిరుగుళ్లు మాని పెళ్లి చేసుకుని కుటుంబాన్ని ఏర్పరుచుకుని పిల్లలతో ఆనందంగా గడపమని సలహా ఇచ్చాడు సుధాకర్. కొన్ని సంఘటనల మూలంగా తన డబ్బుకే తప్ప ఎవరికీ నిజమైన ప్రేమలేదని అర్థమైంది ఆనంద్ కు. సుధాకర్ చెప్పినట్టు సామాన్య కుటుంబ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నిజమైన ప్రేమ ఆప్యాయత లభిస్తాయని తెలుసుకున్నాడు. తనకి కొంత సమయమిస్తే ఆలోచించి ఒక నిర్ణయాని కొస్తానని చెప్పడంతో, సుధాకర్ తిరిగి తన గదికి వచ్చేసాడు. వారం తర్వాత ఒక శలవురోజున ఆనంద్ సుధాకర్ రూముకి వచ్చాడు. తన గదిలా సిగరెట్ ముక్కలు టిఫిన్ డొక్కులు ఇతర చెత్తతో చిందర వందరగా కాకుండా బెడ్ నీట్ గా గదంతా శుభ్రంగా టేబుల్ మీద వెంకటేశ్వర స్వామి పటం ఊదొత్తులు వెలుగుతు గోడలకు గౌతమ బుద్ధుడి ధ్యాన ముద్ర ఫోటో దాని పక్కన అబ్దుల్ కాలాం గారి చిరునవ్వులతో మరో ఫ్రేమ్ ఫోటో కనబడ్డాయి. అనుకోకుండా ఆనంద్ తన గదికి రావడం కొంచం ఆశ్చర్యమే అనిపించింది సుధాకర్ కి. చేతిలోని ఆధ్యాత్మిక పుస్తకం టేబుల్ మీద పెట్టి విష్ చేసి కుర్చీ చూపించాడు. ఎప్పటి కన్న నీటుగా షేవ్ చేసుకుని తెల్లని షర్టు పైజామాతో కనిపించాడు.స్టవ్ మీద వేడివేడిగా కాఫీ చేసి ఇద్దరికీ కప్పుల్లో తెచ్చాడు సుధాకర్. కాఫీ తాగిన తర్వాత అవీఇవీ మాట్లాడుతూ తను సావిత్రిని రిజిస్టర్డు మేరేజ్ చేసుకోదలిచానని మనసులో మాట చెప్పాడు. సుధాకర్ ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆనంద్ తన మాటకు ఇంత విలువ ఇస్తాడనుకో లేదు. చెల్లెలు లాంటి సావిత్రికి న్యాయం జరుగు తున్నందుకు సంతోషమైంది.ఈ విధంగానైన జల్షాలతో జులాయిగా తిరిగే ఆనంద్ ఒక ఇంటి వాడై జీవితంలో స్థిరపడటమే కావల్సింది అనుకున్నాడు మనసులో. తర్వాత సుధాకర్ కు సావిత్రి , ఆనంద్ లతో పరిచయం పెరిగింది. ఒక శుభముహూర్తాన కొందరు ఆత్మీయ మిత్రుల మద్య ఆనంద్-సావిత్రి ల పెళ్లి రిజిస్టర్డు ఆఫీసులో జరిగింది. సావిత్రి కుటుంబ సబ్యులకు ఆత్మీయ మిత్రులకు పెద్ద విందు ఏర్పాటు చేసాడు. తన చెల్లి లాంటి సావిత్రికి న్యాయం జరిగి జులాయిగా తిరిగే ఆనంద్ ఒక ఇంటివాడయి నందుకు ఎంతో సంబర పడ్డాడు సుధాకర్. * * * ప్రగతి పధంలో మహిళలు అన్ని రంగాలలో ఎంత ఉన్నతమైన చదువులు పదవులు హోదాలు అనుభవిస్తున్నప్పటికీ లైంగిక దాడులు జీవనపోరాటం తప్పడం లేదు. కొన్ని బయటకు వస్తున్నాయి. మరికొన్ని పరిస్థితులకు లొంగి సర్దుబాటు చేసుకుని చీకటి కోణంలో మరుగున ఉండి పోతున్నాయి. తాగుబోతులు జూదరులు రోగిష్టి భర్తల వల్ల ఆదాయం లేక పిల్లల కుటుంబ పోషణ కోసం కొంతమంది గత్యంతరం లేక శరీరాలను అమ్ముకుంటున్నారు. వేశ్యావాటికలు బహిరంగ పార్కు ప్రదేశాలు రిసార్టులు హోటళ్లు జాతీయ రహదారుల్లో మహిళలు డబ్బు కోసం తమ శరీర వ్యాపారంకొనసాగిస్తున్నారు. మద్య దిగువ తరగతి అమ్మాయిలు మహిళలు బ్రతుకు తెరువు కోసం పట్నాలు నగరాలకు వచ్చి కుటుంబ పోషణకు ఎన్నెన్నో లైంగిక వేధింపులు బాధలు ఎదుర్కొంటున్నారు. సమాప్తం

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి