అమ్మమ్మ ఇంటికి దారి. 2వ భాగం. - రాము కోలా.దెందుకూరు.

Ammamma intiki daari.2

(1982) మరికాస్త ముందుకు సాగుతుంటే ముక్కుకు సూటిగా తాకుతుంది ఒక రకమైన వాసన. అనుకుంటే మరియొకటి కూడాను. ఒకటి పొన్నాయి పూల సువాస మత్తుగా ఉంటుంది, మరొకటి జంగం భద్రయ్య గారు తయారు చేసే కస్తూరి మాత్రల పరిమళాలు వాసన. ఆ రోజుల్లో చిన్న పిల్లలకు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వీరిచ్చే మాత్రలే దివ్య ఔషదం. గ్రామ ప్రజలకు అంత నమ్మకం.వీరిపైన. వీరి చేతి చేరువలో లేక ఇచ్చే ముందు మహత్యమో ప్రతి ఒక్కరి అనారోగ్య సమస్య పాటు వైద్యంతో తొలిగిపోయేది. మరో నాలుగు అడుగుల వేయగానే కుడి వైపు ,మరో ఉమ్మడి కుటుంబం.ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అద్దంకి వెంకటప్పయ్య గారి ఇల్లు. వీరి పిల్లలు రామారావు,నాగేశ్వరరావు, కాళేశ్వరరావు. రామారావుగారి రెండవ అబ్బాయి రవి నా చిన్నతనం స్నేహితుడు,కొన్ని సంవత్సరాలు నాతో కలిసి చదువుకొనసాగించాడు. ఇదే ఇంటికి ఎదురుగా చిన్ని మట్టి రోడ్డు ఉండేది,కాస్త లోపలకు వెళ్లితే,మగినం వెంకయ్య(అందరూ బుడ్డెంకయ్య అని ముద్దుగా పిలుచుకునే వారు )ఇల్లు. వీరి అమ్మాయి బీబీ నాంచారి మా సహవిధ్యార్థిని. వీరి ఇంటికి దగ్గరల్లో ఒక మంచినీళ్ళ బావి ఉండేది. ఊరులోనుండి ,ఎందరో ఇక్కడకు మంచి నీళ్ళ కోసం వచ్చేవారు.చాలా సంవత్సరాలు. అద్దంకి వెంకటప్పయ్య గారి ఇంటి తరువాత ,బాగా గుర్తుపెట్టుకోవాలి అనుకునే ఇల్లు,అద్దంకి లక్ష్మయ్య గారిది.వీరు పెద్దబాలశిక్ష చదివి వినిపిస్తూ,పిల్లలు చేత కంఠస్థం చేయించే వారు.దండన కూడా అలాగే ఉండేది. పిల్లలు విద్య నేర్చుకోవాలి అంతే అనేవారు. వీరి ఇంటికి ఎదురుగా అపర రామభక్తుడు అద్దంకి రామయ్యగారు ఉండే వారు. నిత్యం భజనలు చేస్తూ,రామనామ స్మరణతో గ్రామంలో తిరుగుతుండే వారు. ఆదే భక్తి పారవశ్యంతో రైలుకు ఎదురుగా నిలబడి యాక్సిడెంట్ లో చనిపోయారు. అద్దంకి లక్ష్మయ్య గారి ఇంటి తరువాత ,చుంచు కోటేశ్వరరావు గారి ఇల్లు,వీరు అప్పటిలో , గృహ నిర్మాణ కార్యక్రమాల పనులు చేపిస్తు ఉండే వారు. వీరి పెద్ద అబ్బాయ్ వేణు మా తమ్ముడు సహవిధ్యార్ది. తరువాత ముస్లింలు ఎంతో గణంగా జరుపుకునే పీర్ల పండుగను నిష్టతో జరిపే పఠాన్ ఖాన్ లోగిళ్ళు. తొమ్మిది రోజులు పీర్లు ఉంచే చిన్న చావిడి ఉండేది. ఇక్కడ జరిగే పీర్ల పండుగ ఉత్సవాలను,పఠాన్ లు, షేక్ లు ఇంటి పేర్లు కల వారు నిర్వహించే వారు.వీరిలో జాన్ అనే వారి పెద్దమ్మాయి(మీరా) తొలి పీరీ ఎత్తుకుని ఊరు మొత్తం దించకుండా తిరిగేది. పీర్ల పండుగ దైవప్రవక్త ముహమ్మదు గారి మనమళ్ళు హసన్, హుసేన్ ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు. నిప్పుల గుండం తొక్కుతారు. పీరుల్ని పీర్లచావడిలో ఉంచుతారు. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ అయినా హిందువులు కూడా విరివిగా భాగస్వాములు అయ్యె వారు. ఇందులో హిందువులు సాంబ్రాణి వేసి నీళ్ళు పోసి పిల్లలు లేని వారు పవిట చెంగు పట్టి తమ మోక్కులను తీర్చమని వేడుకునే వారు.పీర్లు ముందు. ఉత్సహ వంతులు విచిత్ర వేషాలు తో అలరించే వారు,ముఖ్యంగా పెద్ద పెద్ద కత్తులతో విన్యాసాలు చేసేవారు.పండుగ అనంతరం నిప్పుల గుండం మట్టితో కప్పెసేవారు,ఎందరో తమ పిల్లలను ఆ గుండం పైన పొర్లించే వారు,పిల్లలకు ఎటు వంటి చికాకులు చింతలుకలగ కూడదని. చావిడికి ఎదురుగా అసలు పేరు తెలియదు కానీ గాజుల బూబు అని పిలుచుకునే ఆమె ఉండే వారు.గ్రామంలో జరిగే ఆడపిల్లలు ప్రతి శుభ కార్యానికి ఈవిడే గాజులు అందిస్తుండేది. చాలా సరదాగా కలుపుగోలుగా ఉండే మనిషి. చావిడి తరువాత పిల్లలందరు తాతయ్యా అని పిలుచుకునే షేక్ మస్తాన్ తాత ఇల్లు. తాతయ్యా బడికి పోవాలంటే ఒకటే వర్షం పుస్తకాలు తడుస్తాయా కదా అనగానే ఇంటికి వెళ్ళి యూరియా బస్తాతెచ్చుకోమని,వెంటనే కత్తిరించి మంచి సంచి కుట్టి ఇచ్చే వాడు మస్తాన్ తాతయ్య. పిల్లలంటే అంత ప్రేమ తాతయ్యకు.... (ముగింపు తదుపరి భాగం లో)

మరిన్ని కథలు

Manasupaddaanu kaanee
మనసు పడ్డాను కానీ!
- మీ రాము కోలా
Nenu mallee podupu chestaa
నేను మళ్ళీ పొదుపు చేస్తా...!
- బొందల నాగేశ్వరరావు
Rakthaksharaalu
రక్తాక్షరాలు
- డా:సి.హెచ్.ప్రతాప్
Pakshi premikudu
పక్షి ప్రేమికుడు (బాలల కథ)
- చెన్నూరి సుదర్శన్
Panimanishi nmerpina gunapatham
పని మనిషి నేర్పిన గుణపాఠం
- కామేశ్వర రావు రాపాక
Sravanthi
స్రవంతి
- మండా. సూర్యనారాయణ
kala nijamayega
kalanijamayega
- ప్రభావతి పూసపాటి
Sahaayam
సహాయం
- డా:సి.హెచ్.ప్రతాప్