మనుషుల్లో ఋషులు - వారణాసి భానుమూర్తి రావు

Manushullo rushulu

" రఘు కథలు వ్రాస్తాడంట. ఇటీవల వాడి కథకు ఏదో వార పత్రిక పోటీల్లో మొదటి బహుమతి వచ్చిందట. " నిజంగా నేను ఆశ్చ్యర్య పొయ్యాను. వాడేంటి? వాడు కథలు వ్రాయడం ఏమిటి? నాకు ఈ మిస్టరీ అంతు బట్టడం లేదు. రఘుకి నాకు ఎన్నో ఏళ్ళ నుండి పరిచయం వుంది. ఇద్దరమూ ఒకే ఆఫీసులో పని చెయ్యడం గాకుండా , ఒకే చోట పుట్టి పెరిగి చదువు కొన్న వాళ్ళం. తెలుగు పద్యం గూడా స్పష్టంగా చదవ లేని వెధవ , వాడు తెలుగులో కథలు వ్రాయడం ఏమిటి? వాడికింత భాషా పరిజ్ణానం వుందా? నా మటుకు నాకు వాడికంత తెలివి లేదనే నా అభిప్రాయం. కథలు వ్రాయడ మంటే మాటలా? కథలో శిల్పం , వస్తువు గావాలి. కథనం వుండాలి. సమ కాలీన పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని , ఆ సమస్యలను అందులో వుంచి , ఒక పరిష్కార మార్గాన్ని సూచించే విధంగా రచయిత మార్గ దర్శకంగా సమాజానికి దారి చూపాలి. అలాంటి కథా నైపుణ్యం వాడికుందంటే నాకు నమ్మ బుద్ధి కాలేదు. అయినా ఇంత టాలెంట్ పెట్టుకొని‌ , నాకు ఒక్క సారైనా ఎందుకు చెప్ప లేదు? వాడి కథ ఒక ప్రముఖ వార పత్రికలో పడి , మొదటి బహుమతి గెలుచు కొందంటే నాలో ఎక్కడో కొంచెం ఈర్ష్య జనించింది.ఎందుకంటే నాకు తెలుగులో మార్కులు వాడి కంటే నాకే ఎక్కువ వచ్చేవి. నాకు వందకు తొంబై వస్తే , వాడికి నలభై , యాభై మార్కులు వచ్చేవి. జర జర మని లుంగీ వూడ దీసి , పాంటు తగిలించుకొని రఘు వాళ్ళింటికి బయలు దేరాను. రఘు వాళ్ళ ఇంటికి వెడుతున్నానని శ్రీమతి తో చెప్పి తలుపు గడియ పెట్టుకొమ్మని చెప్పాను. నాకు మదిలో ఆరాటం ఎక్కువయింది.వాడ్ని అడిగి వాస్తవాలను కనుక్కోవాలి. కనీసం ఫోన్ అయినా చేసి చెప్పొచ్చు గదా? వాడి ఆనందం నాతో ఎందుకు పంచు కోవాలని అనుకోవడం లేదు. ఈ చిన నాటి స్నేహితుడ్ని మరచి పొయ్యాడేమో కాబోలు. నేను సనత్ నగర్ లో వుంటాను. వాడు ఎర్ర మంజిల్ కాలనీ లో ఉంటాడు. డబుల్ డెక్కర్ బస్సు ఎక్కి కూర్చొన్నా! దానికన్నా ఎద్దుల బండి నయమనిపిస్తోంది. దాదాపు నలభై నిముషాలు పైగా పట్టింది. బస్సంతా జనంతో కిట కిట లాడి పోతోంది. " ఎర్రమంజిల్ కాలనీ " అని కండక్టర్ గట్టిగా అరచాడు. పై బస్ నుండి మెట్లు దిగి ఒక్క సారిగా బస్సు నుండి కిందకు దిగాను. కండక్టర్ బెల్లు ఠంగ్ ఠంగ్ మని రెండు సార్లు లాగాడు. డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణం అంటే అదొక్క సరదా! రోడ్డు క్రాసు చేసి ఎర్రమంజిల్ కాలనీ లోని ప్రభుత్వ క్వార్టర్స్ లో నెంబరు పట్టుకొని ఎక్కడో ఓ మూల ఉన్న వాడి ఇల్లు చేరినాను. ఇల్లు బాగుంది. విశాలంగా ఉంది.ఎప్పుడో కట్టిన ఇళ్ళు , ప్రభుత్వ వుద్యోగులకు కేటాయిస్తారు. " ఠక్..ఠక్.."తలుపు తట్టాను. ఎదురుగా వాడి శ్రీమతి జానకి తలుపు తెరచింది. ఆమె ముఖంలో చెమట , ఆ అలసట చూస్తూనే తెలుస్తోంది , వంటి గది నుండి వస్తోందని. " రండి అన్నయ్యా! " లోపలికి పిలిచి సోఫా చూపించి ఫాన్ , టూబ్ లైట్ వేసింది. " వీడెక్కడమ్మా? " అడిగాను నేను. " ఉదయం తొమ్మిది గంటకకల్లా వెళ్ళారు. భుజాన ఒక సంచీ , కొన్ని తెల్ల కాగితాలు తగిలించుకొని వెళ్ళారు. ఆది వారం వస్తే ఇదే సంత. ఎక్కడి కెడతారో చెప్పరు ." అంది రఘు శ్రీమతి. " ఆది వారం అలా నిన్ను తీసుకొని పార్కులు , షికార్లు , సినిమాలకు వెళ్ళకుండా ఎక్కడికి చెప్పా పెట్టకుండా వెడుతున్నాడు వీడు? " అన్నాను నేను ఒకింత అసహనంగా. " వుండండి అన్నయ్యా! కాఫీ తీసు కొస్తాను." అని చెప్పి వంట గది లోకి వెళ్ళింది జానకి. వాడి టేబుల్ మీద కొన్ని తెల్ల కాగితాలు రెప రెప లాడు తున్నాయి. టేబుల్ సొరుగు తీసి చూశాను. కట్టలు కట్టల పేపర్లలో ఏదో వ్రాసి వున్నవి కనబడ్డాయి. అన్ని కథలు , కవితలు వ్రాసినట్లున్నాడు వాడు. " వాడు కథలు , కవితలు వ్రాస్తాడా అమ్మా! " అని అడిగాను జానకిని. కాఫీ కప్పుతో , మంచినీటి గ్లాసుతో లోపలి కొచ్చింది తను. " ఏమో ! అన్నాయ్యా! నాకయితే ఏమీ చెప్పరు. ఏమీ చూపించరు. " అంది జానకి. " ఇటీవల వాడి కథకు మొదటి బహుమతి వచ్చిందంట. చెప్పాడా అమ్మా నీకు? " " నాకసలు ఏమీ తెలీదన్నాయ్యా" కాఫీ తాగేసి బయట పడ్డాను నేను. ************************************ కవులను, రచయితలను నేను మరీ దగ్గరగా ఎప్పుడూచూడ లేదు. వారి జీవన వ్యవహార శైలి ఎలా వుంటుందో నాకు తెలీదు. వారూ మన లాగే ఉంటారా? కానీ ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటారని విన్నాను. వాళ్ళకు గూడా కొన్ని మానసిక బల హీనతలు ఉంటాయని విన్నాను. మరి ఈ రఘు గాడికి ఉన్నట్లుండి ఈ జబ్బు ఎలా పట్టుకొందో అర్థం కావడం లేదు. సంతోషంగా ఇంటి పట్టున వుండకుండా ఎక్కడ తిరుగు తున్నాడో ఏమో? "వాడి కోసం ఎక్కడని వెతకను? ఈ హైదరాబాదు మహా నగరం లో ఏ మూలని వెతకను ? " అనుకొంటూ ఇందిరా పార్కు వైపు వడివడిగా అడుగు లేశాను. బాగా దూరం అనిపించి ఒక ఆటో ఎక్కేశాను.‌ ఇందిరా పార్కు లోయర్ టాంక్ బండ్ లో ఉంటుంది. బహుశా వీడు ఈ పార్కులో ఏ మూలో కూర్చొని కథలు వ్రాస్తుంటాడు. " కుక్క పిల్లా, సబ్బు బిళ్ళా, అగ్గి పుల్లా ...కాదేదీ కవితక నర్హం‌" అన్నాడు శ్రీ శ్రీ.‌ " కవిత్వమొక తీరని దాహం ! " అన్నారు శ్రీ శ్రీ , కానీ నేను కవిత్వం ఒక వ్యసనం అని అంటాను. కవులు అందుకే ఇంటినీ , వంటినీ పట్టించు కోకుండా వ్రాసుకొంటూ ఉంటారు. పాపం రచయితల , కవుల అర్థాంగులు నిజంగా త్యాగ మయులు.‌ వారికి మనం నిజంగా జోహార్లు అర్పించాలి. ఇందిరా పార్కు చేరుకొన్నాక రఘు కోసం జల్లెడ పెట్టి వెతికాను. రఘు ఎక్కడయినా వున్నాడేమో అని. కొమ్మ సందుల్లో , చెట్టు తొర్రల్లో , గుబురు పొదల్లో జంటల ప్రేమ కలాపాలు , శృంగార విన్యాసాలు చూడ లేక కళ్ళు మూసుకొన్నాను. డేటింగ్ పేరుతో ఈ ప్రేమికులు ఒకరి మీద ఒకరు పడుకొని ఆలింగనాలు , చుంబనాలు పెట్టుకొనే రసిక శిఖామణులు ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు. చదువు కోవలసిన వయసులో ఈ కుర్రకారు ఇలా ప్రేమ దోమ అంటూ తమ విలువైన కాలాన్ని దుర్వినియోగ పరచు కొంటున్నారు.‌ అరగంట సేపు ఆ పార్కులో అలా ఇలా తిరిగి బయట కొచ్చేశాను. బస్సు కోసం నిరీక్షిస్తున్నాను. అక్కడ దూరంగా రఘు లాగే ఉన్నాడు.‌ ఒక బిక్షగాడికి ఎదురుగా కూర్చొని బాతాఖానీ చేస్తూ తను తెచ్చుకొన్న తెల్ల కాగితాల మీద ఏవో పిచ్చి గీతల్ని బరికేస్తున్నాడు. పరుగు పరుగున వెళ్ళి , " ఒరేయ్ ! రఘూ ! ఏమి చేస్తున్నావురా ఇక్కడ? " అన్నాను నేను ఒకింత ఆశ్చర్యకరంగా. వాడు వ్రాస్తున్న తెల్ల కాగితాల్ని సంచీ లోకి దోపాడు. " నువ్వు ఇక్కడకు ఎలా వచ్చావు? నేనిక్కడున్నానని నీ కెవరు చెప్పార్రా రామ్నూర్తీ ? " అని వాడు నొసలు చిట్లిస్తూ నా కేసి చూశాడు‌. బహుశా నేను అక్కడకి రావడం వాడికి ఇష్టం లేదనుకొంటా! " నేను వ్రాయ బోయే కథలకు ప్లాటు అంటే మూలం తయారు చేసుకొంటున్నా! అన్నట్టు మొన్న నా కథకు ప్రధమ బహుమతి వచ్చింది తెలుసా? అదీ పేరున్న వార పత్రికలో. ఆ కథ చదివిన వేలాది పాఠకులు నా అభిమానులు అయి పొయ్యారు. " అని నా కళ్ళల్లోకి చూస్తూ ఆనందంగా అన్నాడు.‌ " చూడరా? ఎన్ని ఉత్తరాలో! నా అభిమానులు నాకు వ్రాసినవి .' అని పాంట్ జోబీలో నుండి ఒక యాభై కార్డుల కట్టను చూపించాడు. " నీ కథకు మొదటి బహుమతి వచ్చిందని నాకు చెప్పనే లేదు " " సారీరా రామ్మూర్తీ ! నేను ఎవరికీ చెప్పలేదు " అన్నాడు వాడు. " సారీ ! చలపతి గారూ ! మీ కథ చెప్పండి . ఇతను రామ్మూర్తి అనీ , నా ఆఫీసులో సహోద్యోగి " అని నన్ను ఆ భిక్షగాడికి పరిచయం చేశాడు. " ఇతను చలపతి గారని. ఒకప్పుడు బాగా చచ్చి బ్రతికిన వాడు. సారీ..బ్రతికి చెడిన వాడు. ఇంట్లో పెళ్ళాం‌, బిడ్డల పోరు బడలేక సన్యాసం తీసుకొని , ఇలా యాచక వృత్తి లోకి దిగిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆఫ్ ఏ కాలేజి. అందరూ ఉన్నా నా అనే వారు లేక , ఇలా వసుధైక కుటుంబంలో చేరి యాచక వృత్తిని కొన సాగిస్తున్నాడు ." అని అతని వంక చూస్తూ చలపతిని పరిచయం చేశాడు నన్ను. చలపతి గారు ఏక ధాటిగా ఆంగ్లంలో తన గురించి చెబుతున్నాడు.‌ఆయన ఇంగ్లీషులో ఉన్న నైపుణ్యానికి అతని కాళ్ళు మొక్కాల్సిందే! మరి ఏ పరిస్థితుల ప్రభావం వల్ల అతను యాచకుడిగా మారాడో అర్థం కాలేదు. " మిమ్నల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది " అని నేను చలపతి గారికి నమస్కరిస్తూ ఇంగ్లీషులో అన్నాను. అతడు నవ్వి వూరుకొన్నాడు. " చలపతి గారూ! సెలవిప్పించండి. రేపు ఆదివారం‌ మిమ్మల్ని ఎనిమిది గంటలకు కలుస్తాను. మీ జీవిత చరిత్ర మొత్తం చెప్పాలి. ఈ సారి మీ లాంటి బాధా తప్త సర్ప దష్టుల గురించి ఒక మెగా ధారావాహికను వ్రాయాలను కొంటున్నాను. వంద మంది మీ లాంటి అభాగ్యుల చరిత్రను వ్రాసి సాహితీ జగత్తులో ఒక ప్రకంపనను సృష్టిస్తాను.‌" అన్నాడు రఘు. " తధాస్థు . మీ కోరిక నెర వేరుతుంది ." అన్నాడు చలపతి గారు రెండు చేతులెత్తి దీవిస్తూ. జోబీ లోంచి యాభై రూపాయలు తీసి " ఇది వుంచండి. రేపు ఆది వారం మిమ్మల్ని పబ్లిక్ గార్డన్స్ లో కలుస్తాను " అని బయలు దేరాడు రఘు. " నీకిదేం పొయ్యే కాలం రా! ఏమిటిదంతా? " అసహనంగా అడిగాను. " రచయితలు , కవులు ఈ సమాజాన్ని చైతన్య పరచాలి. వారు దాని కోసం తమ కాలాన్ని కొంచెం త్యాగం చెయ్యాలి. ఫాంటసీ కథలు , ప్రేమ కథల చౌకబారు సాహిత్యం వల్ల సమాజానికి ఒరిగిందేమీ లేదు. ఈ సమాజం లో అగర్భ దరిద్రంతో మగ్గుతూ , కోట్లాది మంది బాధా తప్త సర్ప దష్టులు , అభాగ్యులు ఉన్నారు. నా చిన్నతనంలోనూ ఇలాంటి అభాగ్యులు ఉండే వారు. తిండికి లేక పొలాల్లో ఎలకల్ని పట్టి తినేవారు. ఆకులు ,అలములు , దుంపలు తినే వారు. తాగే దానికి శుభ్రమైన మంచి నీరు , వుండడానికి గూడు , కడుపుకు పట్టెడన్నం , శరీరానికి గుడ్డ లేని అగర్బ దరిద్రులు ఆనాడూ ఉన్నారు. ఈ నాడూ దరిద్రంతో బాధ పడే వారున్నారు. ఎక్కడుందీ లోపం? ఎక్కడికి పోయిందీ మన సామ్య వాదం? పంది కొక్కుల్లాగా బలిసిన రాజకీయ రాబందులు , లంచాలకు మరిగిన అవినీతి జలగలు , వడ్డీ పిశాచులు , అవినీతి గుత్తేదారులు ఈ సమాజాన్ని విచ్చన్నం చేసేశారు.‌ ఈ దేశాన్ని సర్వ నాశనం చేశారు. వున్నవాడు కోట్లకు పడగ లెత్తు తున్నాడు. లేని వాడు అగర్భ దరిద్రంలో మ్రగ్గి పోతున్నారు." ఆవేశంతో వూగి పోతున్నాడు రఘు.‌ అంత అవేశాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. " పతితులార! భ్రష్టులార బాధాసర్ప దష్టులార! బ్రతుకు కాలి, పనికిమాలి, శని దేవత రధచక్రపు టిరుసులలో పడి నలిగిన దీనులార! హీనులార! కూడు లేని, గూడు లేని పక్షులార!భిక్షులార! సఖులవలన పరిచ్యుతులు, జనులవలన తిరస్క్రుతులు, సంఘానికి బహిష్క్రుతులు" రఘు నోటి నుండి శ్రీ శ్రీ వ్రాసిన జగన్నాధ చక్రాల కవిత అలవోకగా వినిపిస్తోంది. ఇలాంటి కవితల్ని విన్నప్పుడు రక్తం మరుగుతుంది. ఏదో చెయ్యాలనే పిచ్చి ఆవేశం వస్తుంది. కానీ ఎవరికి వారు వారి బ్రతుకు చట్రంలో ఇరుక్కు పొయ్యారు. ఎవరూ ఈ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలోచించడం లేదు. " ఏమంటాను సంఘ సంస్కర్తా? ముష్టి వాళ్ళ మీద కథలు చదివే పాఠకులు ఉంటారను కొన్నావా? ఇప్పుడు యువతకు కావలసింది హగ్గులు , కిస్సులు , విచ్చలి విడి శృంగార కథలు , మర్డర్లు , హార్రర్ , సస్పెన్స్ త్రిల్లర్ . ఇలాంటి సాహిత్యాన్ని చదవడం ఎప్పుడో మానేశారు. అసలు పుస్తకాలు కొని ఎవరైనా చదువుతున్నారా? అంతా ఆన్ లైన్ పత్రికలు.‌పైన రెండు లైన్లు , ముగింపు రెండు లైన్లు చదివడానికి గూడా టైం లేదు. ఒకప్పుడు వార , మాస పత్రికలు , నవలలు ఎంతో మంది కొని చదివే వారు. ఇప్పుడు టీ వీ , యూ టూబ్ లు వచ్చాక పుస్తక పఠనం మానేశారు‌. కుర్ర కారు క్రికెట్ మాచ్ గంటల తరబడి చూస్తారు గానీ ఒక మంచి పుస్తకాన్ని అర గంట చదవ మనండి. రఘూ ! ఆనాడు మహా కవులు రాయ ప్రోలు , గురు జాడ , చిలక మర్తి , శ్రీ శ్రీ , తిలక్ , చలం లాంటి మహా కవుకు తమ రచనలతో సమాజాన్ని కొంత వరకూ మార్చ గలిగారు. కానీ ఈ నాడు పరిస్థితి పూర్తిగా మారి పోయింది. కవులు , రచయితలు ఇంత కష్ట పడి వ్రాసి , అచ్చయించి , పుస్తకాన్ని అవిష్కరణ చేయించి , బోలెడు డబ్బులు ఖర్చు పెడితే , కనీసం ఎంతమంది ఆ పుస్తకాన్ని డబ్బు పెట్టి కొంటున్నారు. అవిష్కరణ రోజు ఫ్రీ గా పుస్తకాలు దొరుకుతాయని అడుక్కు తినే వాళ్ళు బోలెడు మందిని నేను చూశాను. ఇక రచయితల , కవుల ఆర్థిక పరిస్థితి చూస్తే జాలేస్తుంది . " అన్నాను నేను " అంటే నా నవల ఎవరూ చదవ రంటావా? " బేలగా అడిగాడు రఘు. " వ్రాయడం నీ కర్తవ్యం. దాని ఫలితాలు దేవుడికి వదిలెయ్యి " అన్నాను నేను. రఘు నేనూ ఒక ఆటో ఎక్కి వాడిని ఎర్ర మంజిల్ కాలనీ లో దించి , నేను సనత్ నగర్ వైపు అదే ఆటోలో వెళ్ళాను. మనసంతా ఏదో భారంగా , దిగులుగా ఉంది నాకు. ************************************ మొదటి రెండు వారాలు ఆఫీసుకు వచ్చిన రఘు ఆ తరువాత ఆఫీసుకు రావడం మానేశాడు.‌వాకబు చేస్తే ఏ లీవు అప్లయి చెయ్యలేదని తెలిసింది. వీడు చేజేతులా భవిష్యత్తును నాశనం చేసు కొంటున్నాడు. ఈ కవిత్వ పిచ్చి లో పడి వుద్యోగాన్ని వదులు కొంటున్నాడు వెధవ. వీడికి కొంచెం బుద్ధి చెప్పాలి అని అనుకొన్నాను. ఒక రోజు ఆఫీసు వదలిన తరువాత స్కూటర్ వేసుకొని రఘు వాళ్ళింటికి వెళ్ళాను. ఇల్లు తాళం వేసింది. ప్రక్కింటి వారిని అడిగాను. " ఏమో తెలియదండీ ! రెండు వారాలుగా భార్యా భర్తలు ఇద్దరూ అసలు కనబడడం లేదు " అంది ఆ ఇంటావిడ. దారిలో వెడుతున్న వారి పనమ్మాయిని అడిగాను‌. " అయ్యగారు , అమ్మగారు నెల రోజులుగా మాట్లాడు కోవడం లేదండీ. అయ్యగారు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ సన్యాసి లాగా గడ్డం పెంచుకొని ఎప్పుడూ ఏదో వ్రాసుకొనే వారు. ఇంటి విషయాలు అసలు పట్టించు కోవడం మానేశారు . అమ్మగారే అన్నీ చూసుకొనే వారు.ఒక రోజు అమ్మ గారు నన్ను పిలిచి రేపటి నుండి పనికి రావద్దన్నారు. పుట్టింటికి వెళ్ళి పోతున్నానని చెప్పారు. అయ్య గారు గూడా ఈ ఇంటికి రావడం మానుకొన్నారు. ఎక్కడున్నాడో ఏమో ! " అని అన్నది ఆ పనమ్మాయి చాలా బాధ పడుతూ.‌ అనుకొన్నంత పనీ అయింది. ఏది జరగ గూడ దను కొన్నానో , అదే జరుగుతోంది.నా మనస్సు ఎందుకో కీడు శంకించింది . ఆ పది రోజులో రఘు గాడి కోసం వెతకని చోటు లేదు. తిరగని ప్రదేశం లేదు . వాడి జాడే లేదు. ************************************** ఐదు సంవత్సరాల తరువాత చిత్రభాను నామ సంవత్సర ఉగాది పర్వ దిన శుభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారతిలో పురస్కారాలను అంద చేస్తోందని ప్రకటించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సాహిత్య అవార్డు ఉత్సవాలకు నాకు గూడా ఆహ్వానం అందింది. నేను గూడా శ్రీమతి తో హాజరయ్యాను. రవీంద్ర భారతి లో ఇసుక వేస్తే రాలనంత మంది జనంతో నిండి పోయింది. చాలా మందికి పాసులున్నా బయటే నిలుచుండి పొయ్యారు. ఎక్కడ చూసినా అవార్డు గ్రహీతల ఫ్లెక్సీలు రంగు రంగుల విద్యుత్ దీపాల మధ్య ప్రకాశిస్తున్నాయి. సాహిత్య రంగం , కళా రంగం , సేవా రంగం లో ప్రముఖులు , నిష్ణాతులు అయిన వారిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరిస్తోంది.‌ నగరం లోనే గాకుండా రాష్ట్రం నుండి గూడా ఎంతో మంది లబ్ధ ప్రతిష్ఠులైన సాహితీ వేత్తలు , పండితులు , కళాకారులూ , సంగీత విద్వాంసులూ , రాజకీయ నాయకులు హాజరయ్యారు. చూడ్దానికి రెండు కళ్ళూ చాలడం లేదు. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే! అధికారులు , అనధికారులతో రవీంద్ర భారతి కిట కిట లాడి పోతోంది. వేదిక మీద చిన్నారుల కూచి పూడి , భరత నాట్య నృత్యాలతో అహ్లాదకరమైన వాతావరణం వుందక్కడ. సభ ప్రారంభ మయింది. ముఖ్య మంత్రి గారితో సహా తమ మంత్రివర్గంలో ముఖ్యులయిన వారు , అధికారులు వేదిక మీద ఆసీను లయ్యారు. జ్యోతి ప్రజ్వలన తరువాత ఆహుతులందరినీ ఆహ్వానిస్తూ ప్రారంభోపన్యాసం చేస్తున్నాడు ఒక అధికారి. పుష్ప గుచ్చాల అనంతరం ప్రభుత్వం నిర్వహించిన ఈ వుత్సవాలను గురించి వుపన్యాసం ఇస్తున్నారు.‌ అధ్యక్షుల వారి స్థానంలో ఉన్న ముఖ్య మంత్రి గారు ఉపన్యాసం చేస్తున్నారు. తమ ప్రభుత్వం కళల పట్ల , కళాకారుల పట్ల తమ అంకిత భావాన్ని వివరిస్తున్నారు.‌ తమ తమ వృత్తుల్లో రాణించిన ఉత్తమ కళాకారుల్ని , ఉత్తమ పండితుల్ని , ఉత్తమ సాహితీ వేత్తల్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానించారు ముఖ్య మంత్రి గారు. అందరి ముఖాల్లో ఏదో ఆనందం , సంతృప్తి ద్యోతక మవుతోంది. అంతలో మైకులో ఇలా వినబడింది. " సరస్వతీ పుత్రులు , ప్రముఖ నవలా కారుడు , ఉత్తమ విలువలు కలిగిన సాహితీ వేత్త, స్వయం కృషితో తన సత్తా ఏమిటో చూపించి , అఖిల ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకాన్ని ఉర్రూత లూగించి , కత్తి కంటే కలం గొప్పదని , అక్షర యజ్నం చేసిన అభినవ సోమ యాజులు , అభినవ వాల్మీకి , అక్షర బ్రహ్మ , జ్ణాన పీఠ్ అవార్డు గ్రహీత శ్రీ శ్రీ సనగరం రఘునాధ రావు గారిని వేదిక మీదకు రావలసినదిగా ఆహ్వానిస్తున్నాము. ఉత్తమ రచయితగా అయన వ్రాసిన " జీవన గతులు " అనే నవలకు ఈ ఏడాది రాష్ట ప్రభుత్వ ఉత్తమ సాహితీ పురస్కారం జరగ బోతుంది. ఈ నవలకు ఈ సంవత్సరమే జ్ణాన పీఠ్ అవార్డు మన తెలుగు వాడికి లభించినందుకు రాష్ట ప్రభుత్వం తరపున సనగరం గారిని ఘనంగా సన్మానిస్తున్నాము " అంటూనే సాదా సీదాగా గడ్డం పెంచుకొని , మామూలు ఖద్దరు బట్టలు వేసుకొని , తైల సంస్కారం గూడా సరిగా లేని జుత్తుతో వేదిక మీదకు చేరుకొన్నారు సనగరం రఘు నాధ రావు. ఆయన వేదిక మీదకు రాగానే , వేదిక మీద పెద్ద లందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో రఘు నాధ రావును ఆహ్వానించారు. మంగళ వాయుద్యాల నడుమ అతడ్ని ప్రత్యేక ఆసనంలో కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు సత్కరించారు. అలాగే పది లక్షల చెక్కు ,ఒక నివాస స్థలాన్ని బహూకరించారు. మైకులో రఘు గురించి చెబుతుంటే నా కళ్ళను నేనే నమ్మ లేకున్నాను. నా స్నేహితుడు రఘు గాడేనా వీడు...ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఎలా సంపాయించాడు? వీడు వ్రాసిన నవల " జీవన గతులు " కి జ్ణాన పీఠ్ అవార్డు ఎలా వచ్చింది? అసలు ఆంధ్ర ప్రజానీకాన్ని అంతగా ఉర్రూత లూగించిన ఆ నవలలో ఏముంది? అనేక ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు రఘును ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మన రాష్ట్రంలో ఈ పావర్టీ ని పార ద్రోలుతాను.‌ ఒక్క సామాన్యుడు గూడా ఆకలితో అలమటించడానికి వీల్లేదు. అందరికీ సమ న్యాయం చేస్తాను.‌ కూడు , గుడ్డ , గూడు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తాను. మీ నవల మాబ వత్వాన్ని తట్టి లేపుతుంది‌ ప్రజల్ని చైతన్య వంతుల్ని చేస్తుంది. సమాజాన్ని మార్చే ఇలాంటి నవలలు ఇంకా మీరు వ్రాయాలి. అలాగే రచయితలు పరిష్కార మార్గాన్ని చూపించే విధంగా రచనలు చెయ్యాలి" అంటూ తన వుపన్యాసాన్ని ముగించారు ముఖ్య మంత్రి గారు. " నా శ్రీమతి చెవిలో మన రఘునే ఇతడు. పోయి కలుద్దాం రా ! " అని వేదిక మీదకు వెళ్ళడానికి ప్రయత్నించాను. వేదిక మీదున్న పోలీసు అధికారులు నన్ను మెడ బట్టి బయటకు గెంటేశారు. " నా చిన్న నాటి స్నేహితుడండీ ! మా రఘును కలవాలండీ ! " అని నేను గట్టిగా అరుస్తున్నా! కానీ నా అరుపులు ఎవరికీ వినబడ లేదు. వేదిక మీద రఘు మాట్లాడుతున్నాడు.‌ ఈ నవల పది భారతీయ భాషల్లో అనువదింప బడుతోంది‌ . అలాగే ఫారిన్ కంట్రీస్ వారు అనువాద హక్కుల్ని అడుగుతున్నారు. ఈ పుస్తకాల మీద వచ్చే కోట్లాది రూపాయల్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నాను . గౌరవ నీయులైన ముఖ్య మంత్రి గారు మన అభాగ్య అనాధ బాధా సర్ప దష్టులకు అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. దేశంలో దరిద్రాన్ని పార ద్రొయ్యాలి. అందరికీ సుఖ జీవనాన్ని ప్రసాదించాలి! " అని రఘు ప్రసంగాన్ని ముగించాడు. రఘుని ఎలాగైనా కలవాలని ప్రయత్నించినా , వాడికి పెద్ద ప్రోటోకాల్ వున్నట్లుంది. నలుగైదుగురు పోలీసు ఆఫీసర్లు రఘు కు తోడుగా అంబాసిడర్ కార్లో ఎక్కించారు. గేట్ బయట నిలబడి " ఒరేయ్ రఘూ...నేను రామ్మూర్తిరా ! కార్ ఆపురా! నీతో మాట్లాడాలి " అని నేను గట్టిగా అరచాను. నా అరపులు పట్టించు కోకుండా కారు రయ్యిమని గేట్ బయటకు వెళ్ళి పోయింది. అచేతనంగా చేష్ట లుడిగి చూస్తూ వుండి పొయ్యాను. రచయితలు , కవులు , కళాకారులు , శాస్త్రజ్ణులు పిచ్చి వాళ్ళ లాగానే కనిపిస్తారు నా లాంటి సామాన్యులకు. కానీ వారంతా పిచ్చివారిలా కనబడుతున్న మహా మేధావులు. వీళ్ళే నేమో " ' మనుషుల్లో ఋషులు ' అని అనిపించింది నా కప్పుడు.

మరిన్ని కథలు

Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల