
"ఐసీయు లో అంతా నిశ్శబ్దంగా ఉంది. కళ్ళు తెరిచిన రమేష్ తన పరిస్థితిని గ్రహించి, నర్స్ కి సైగ చేసి, మెల్లగా అడిగాడు: "నా భార్య ఎక్కడ? ఎలా ఉంది?"
"సారీ సర్, మీ ఆవిడకు సీరియస్గా ఉంది. ఇప్పుడే ఏమీ చెప్పలేం అంటున్నారు డాక్టర్"
"ఇంతకీ మాకు ఏమైంది?"
"మీకు గుర్తులేదా? మీకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఇద్దరికీ ఇప్పుడు సీరియస్ గానే ఉంది. మీరు రెస్ట్ తీసుకోండి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అన్నీ తెలుస్తాయి"
"అయ్యో, ఎందుకు ఇలా జరిగింది? అంతా మా ఖర్మ"
"అయ్యో సర్, మీ ఆవిడ ఇప్పుడే చనిపోయింది..సారీ" చెప్పింది నర్స్
రమేష్ కొత్తగా ఉద్యోగంలో చేరిన తర్వాత, పెళ్ళి కూడా చేసుకున్నాడు. చాలా ఉత్సాహంగా ఒక సంవత్సరం గడిచింది. ఇలా ఇప్పుడు యాక్సిడెంట్ కి గురయ్యాడు. భార్య చనిపోయింది. చూసేవారు లేక, తన తండ్రికి ఫోన్ చేయించాడు. అక్కడికి చేరుకున్న తండ్రి..
కొడుకును అలాంటి పరిస్థితిలో చూసి, తండ్రి మనసు చాలా బాధపడింది. డాక్టర్ సలహా మేరకు విదేశాలలో ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఎంత డబ్బు ఖర్చుపెట్టినా నయం కాలేదు.
ఒకరోజు...
కొడుకు ఉన్నట్టుండి కలవరించసాగాడు "నేను గుర్తున్నానా రామ్?"
"ఎవరు?"
"నేను శ్యామ్.. నా గురించి ఒకసారి గుర్తు చేసుకో"
రామ్ తన గతం గుర్తు చేసుకున్నాడు..
****
చాలా సంవత్సరాల కిందట, రామ్ తన ఫ్రెండ్ శ్యామ్ తో కలిసి వ్యాపారం మొదలుపెట్టాడు. వ్యాపారంలో బాగా లాభాలు వచ్చాయి. కొంతకాలం తర్వాత, ఇక వ్యాపారం విరమించుకుందామని, వారి ఒప్పందం ప్రకారం ఇద్దరు లాభాలు సమానంగా పంచుకోవాలి. అప్పుడే రామ్ మనసులో దుర్బుద్ధి పుట్టింది. మొత్తం లాభాలు అంతా తనే తీసుకుని, వ్యాపారం అంతా తనే దగ్గరుండి చూసుకున్నానని చెప్పి, నామమాత్రంగా కొంత డబ్బు చేతిలో పెట్టి శ్యామ్ ని మోసం చేసాడు. పత్రాలు లేకపోవడంతో, శ్యామ్ మాటలు ఎవరూ నమ్మలేదు. బాగా మనస్తాపం చెందిన శ్యామ్, రైలు కింద పడి భార్యతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. పోయే ముందు రామ్ మీద కోపంతో ఉన్నాడు శ్యామ్.
****
"నువ్వా శ్యామ్?"
"అవును, ఆ రోజు నువ్వు నాకు చేసిన మోసం, నా ఆస్తి మొత్తం తీసుకుని బాగా ధనవంతుడవు అయ్యావు. ఇప్పుడు నీ ఆస్తంతా పోయింది. ఇప్పుడు నువ్వు రోడ్డున పడ్డావు. ఇప్పుడు నా ఆత్మ శాంతించింది.." అంటూ ఆ గొంతు ఇంక వినిపించలేదు
శ్యామ్ దంపతుల ఉసురు తగిలి..తన కొడుకు పరిస్థితి బాగోలేదు..కోడలు చనిపోయింది. మోసం చేసి సంపాదించినదంతా కొడుకు ట్రీట్మెంట్ కోసం వడ్డీతో సహా పోయింది..కర్మ ఎవరినీ వదలదని రామ్ కు అర్ధమైంది.
********