తంజావూరు దగ్గర తిరువయ్యూరులో కీర్తనలు పాడుకుంటూ భిక్షాటన చేస్తున్నాడొక భిక్షువు. ఒక చేతితో తంబూర మీటుతూనే మరో చేతిలోని చిడతలతో తాళం వేసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు . దృష్టిని దైవం మీద కేంద్రీకరించి కీర్తన ఆలపిస్తున్నాడు. వీపుకి వేలాడుతున్న భిక్షాపాత్రలో భిక్షను స్వీకరిస్తున్నాడు. ఆ గాన మాధుర్యానికి తన్మయులవుతూనే భిక్ష వేస్తున్నారు గృహస్తులు.
ఒక బ్రాహ్మణుడు పాత్రలో భిక్ష వేయగానే శరీరం మీద ఏదో పురుగు ప్రాకినట్టు వణికిపోయాడు భిక్షువు . కారణం ఆయన చెవులకు తాకిన నాణాల శబ్దం. భిక్షా పాత్రను వెంటనే పరిశీలించాడు భిక్షువు.
అందులో బంగారు నాణాలు కనిపించాయి. వాటిని చూడగానే ముఖం చీదరించుని బియ్యాన్ని అక్కడే పారబోసి గబగబా వెళ్ళిపోయాడు భిక్షువు.
బ్రాహ్మణుడు ఆశ్చర్య పోయాడు.
ఐహిక సుఖాల మీద వ్యామోహం లేని ఆ భిక్షువులోని వైరాగ్య భావమే అలా చేయించింది తప్ప బ్రాహ్మణుడి మీద కోపం కాదు. ఆ భిక్షువే త్యాగయ్య, త్యాగబ్రహ్మ పేర్లతో ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు.
ఆ కాలంలో తంజావూరుని పరిపాలించే శరభోజి మహారాజుకు త్యాగయ్య గాన మాధుర్యం సంతోషాన్నివ్వడంతో ధనదానాలతో తృప్తిపరచాలని ప్రయత్నించాడు. ఆహారం తప్ప వేటినీ స్వీకరించలేదు త్యాగయ్య. ఈసారి ఆ బ్రాహ్మణుడి ద్వారా ప్రయత్నించి విఫలమయ్యారు.
అదీ సంగతి. త్యాగయ్య నడిచిన మార్గాన్ని అనుసరిస్తే ఆస్తులు, అంతస్తుల గొడవలు, కొట్లాటలు ఉండవు.
-----**------

