నిర్ణయం - సాయి సోమయాజులు

nirnayam

విధేయ రాజ్యాన్ని పరిపాలించే గోవర్ధనవర్మ గొప్ప ధైర్య సాహసాలు కలిగినవాడు. ప్రజల్ని కంటిపాపలవలే చూసుకునేవాడు. ఆయన పరిపాలనలో అంతా సుఖ సంతోషాలతో ఉండేవారు.

ఆ మహారాజుకున్న ఒకే ఒక లోటు ఏమిటంటే, బుద్ధిమాంద్యపు పిల్లాడు పుట్టడం. ఏ శాపమో, ఏ జన్మలో చేసుకున్న పాపఫలితమో కాని తనకి జన్మించిన ఆ పిల్లాడిని చూసి రాజు చింతాక్రాంతుడవుతుండేవాడు.

ఒకనాటి సాయంకాలం మహారాజు మంత్రితో దేశ పరిస్థితులను గురించి చర్చిస్తున్నాడు.

అప్పుడు మంత్రి " మహారాజా, యువరాజావారిని పట్టాభిషిక్తుణ్ణి చేసే సమయం ఆసన్నమైంది. మీరు ఈ విషయంలో కాస్త ఆలోచించాలి. " అన్నాడు.

" మా అబ్బాయి సంగతి తెలుసు కదా ! రాజంటే శత్రువుల గుండెల్లో పదునైన కత్తిలా, ప్రజల మనసుల్లో కమ్మటి వెన్నలా వుండాలి. బుద్ధి మాంద్యంతో పుట్టిన మా అబ్బాయి శాస్త్ర,శస్త్ర విద్యలు అభ్యసించ లేదు సరి కదా, కనీసం మామూలుగా ఆలోచించడం కూడా రాదాయె. పుత్ర వాత్సల్యంతో నేను వాడికి పట్టాభిషేకం చేస్తే ఆలోచనలేని మహారాజు కింద పని చేసే వారందరూ ఆ లోటుని ఎవరికనుకూలంగా వారు మార్చుకునే ప్రమాదం లేకపోలేదు. తద్వారా రాజ్యంలో తలేత్తే అరాచకం ఏపాటిదో ఊహించడానికే మనసొప్పడం లేదు. " అన్నాడు విచలిత మనస్కుడై.

" అయ్యా క్షమించాలి. ఈ చల్లటి సాయం సంధ్య వేళ హాయిగా సేద దీరుతున్న మీ మనసుని పాడు చేసాను. పోనీ యువరాజు గారిని పట్టాభిషిక్తుడిని చేద్దాం. పరిపాలన చేయడానికి మరో యోగ్యుడిని నియమిద్దాం.మనం పైనుండి పర్యవేక్షిద్దాం. ఏమంటారు. ? " అన్నాడు.
" మంత్రిగారూ, వన్శపారంపర్యంగా నేనూ మా వాళ్ళే ఈ రాజ్యాన్ని పరిపాలించాలనే ఉద్దేశం నాకు లేదు. రాజ్యం వీరభోజ్యం. అందుచేత రాజ్యాధికారానికి కావాల్సిన అర్హతలున్న అభ్యర్థిని మీరు వెతకండి. "అన్నాడు.

రెండు సంవత్సరాల కాలం గిర్రున తిరిగింది.

ఆరోజు రాజ్యంలో మహోన్నత కార్యక్రమం జరుగుతోంది అది.. విక్రముడనే యువకుడిని మహారాజుగారు దత్తత తీసుకుని ఆ తర్వాత పట్టాభిషేకం చేయనున్నారు.

కొన్నాళ్ళ తర్వాత సాయంకాలం మహారాజు, మంత్రి మాట్లాడుకుంటున్నారు.

" విక్రముడి పాలన్ భేషుగ్గా వుందని ప్రజలు జేజేలు పలుకుతున్నారు ప్రభూ. శత్రువులు మన రాజ్యం వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతున్నారు. మీ నిర్ణయం సర్వామోదమైంది " అన్నాడు మంత్రి సంతోషంగా.

" మహారాజుకి పరిపాలనలో మేటి అనిపించుకోవాలన్న స్వార్థం తప్ప మరేదీ పనిక్రాదు. ముఖ్యంగా కుటుంబ, ఆశ్రిత పక్షపాతాలు అస్సలు పనికిరాదు. అనుక్షణం రాజ్యశాంతియే పరమావధిగా ఉండాలి. మీరు చెప్పినది విన్న తరువాత నా మనస్సు పరిపూర్ణ శాంతినొందింది.."

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి