సగటు మనిషి - బి.రాజ్యలక్ష్మి

common man

రాజశేఖర్ పల్లెటూరి వాతావరణం లో పెరిగాడు ,ఆ వూళ్ళో హైస్కూల్ వరకే వుంది ,పై చదువులకి సిటీ కి వెళ్లాలి!అతను యెప్పుడూ ఊరుదాటలేదు!అవసరం కూడా పడలేదు !ఎందుకంటె నాన్న వైపు అమ్మ వైపు వాళ్లు. బంధువులూ,అందరూ అక్కడక్కడే వున్నారు !ప్రతి వీధి , ప్రతియిల్లు తనదిగానే వుండేది,పచ్చని పొలాలు చల్లని సెలయేటి గలగలలు దేవాలయం స్నేహితులు !!! అవినాభావం గా అతని జీవితం లో అల్లుకుపోయాయి !

పట్నానికి పైచదువులకి పోవాలంటే దుఃఖం ఆగడం లేదు ! సామాన్య సంసారం !కానీ యే లోటూ లేదు ! మితిమీరిన సంపాదన లేదు !అయినా వున్నదాంట్లో ఆనందం గా హాయిగా వున్నారు ! బంధువర్గం లో సంపాదన కన్నా మనిషి వ్యక్తిత్వానికి విలువ గుర్తింపు వుండేవి. అతనికి అరణ్యవాసానికి వెళ్తున్నట్టుగా వుంది ! అన్నయ్య రామచంద్రానికి ఇంటికి పెద్దకొడుకు అవడం వల్ల తండ్రికి చేదోడు వాదోడుగా తన చదువును మిడిల్ స్కూలు తో ఆపాడు ! అప్పటికి హైస్కూలు వూళ్ళో లేదు !

అందుకే తమ్ముణ్ణి బాగా చదివించి ఒక ఉద్యోగస్తుడిగా చూడాలనుకున్నాడు ! పల్లెటూరు కాబట్టి చిన్నతనం లో మేనత్త కూతురు సీత తో పెళ్లయ్యింది ! రాజశేఖర్ అన్నయ్యతో పట్నానికి బయలుదేరాడు !తండ్రి ఆశీస్సులు ,అమ్మ ముద్దులు ,స్నేహితుల దిగులు చూపులు !!మళ్లీ అందరినీ యెప్పుడు చూస్తానో అనుకుంటూ కన్నీళ్లతో బస్సెక్కాడు . రామచంద్రానికి కూడా కన్నీళ్లు తిరుగుతున్నాయి ,అయినా పైకి గంభీరం గా వున్నాడు .

రామచంద్రం తమ్ముణ్ణి కొంత డబ్బు అవసరానికి యిచ్చి జాగ్రత్తలుచెప్పితిరుగుముఖం పట్టాడు .

రాజశేఖర్ మొదట్లో తన జీవితం మీద తనకుఅధికారం లేనట్టుగా భావించేవాడు . క్రమం గా మారుతున్న తన జీవితపు మలుపులను అంగీకరించడం ప్రారంభించాడు . తన చదువు ,మంచి వుద్యోగం ,కష్టపడి చదివిస్తున్న అన్నయ్యకు సాయపడడం !అతనికి తన భవిష్యత్తు అర్ధమయ్యింది !

కానీ కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తుంది . రాజశేఖర్ డిగ్రీ చదువుతున్న సమయం లోనే భయంకర తుఫాను !గాలివానకు వూళ్లో పంట నష్టం ! గిట్టుబాటు ధర రాలేదు . రాజశేఖర్ చదువు కోసం చేసిన అప్పు తీర్చడం కోసంపొలం అమ్మాల్సివచ్చింది . తండ్రికి చూపు తగ్గింది . శరీరం లో శక్తి తగ్గింది . ఇప్పుడు రామచంద్రం అవసరాలకోసం మరొకరి పొలం లో పనికి కుదిరాడు .

రామచంద్రం పిల్లలిద్దరూ అపర్ణ ,ఆదిత్యపెద్దవాళ్లవుతున్నారు . ఇంత క్లిష్ట సమయంలో కూడా రామచంద్రం డబ్బు పంపుతున్నాడు . మొత్తానికి రాజశేఖర్ డిగ్రీ చేతికి వచ్చింది .ఉద్యోగప్రయత్నాలు మొదలు పెట్టాడు .

పుట్టిపెరిగిన వూళ్లోనే వుద్యోగం చెయ్యాలనుకున్నాడు . ఊరికి వచ్చాడు . కానీ యిప్పుడు వూళ్లో మునుపటి బంధాలు ,ఆప్యాయతలు కరువయ్యాయి . పంట నష్టం కోలుకోలేని దెబ్బ !అందరూ తమ తమ కుటుంబ పోషణకు దారులు వెతుక్కుంటున్నారు . తనవారి ఇళ్లే పరాయి యిళ్లయ్యాయి .

" ఒరేయ్ ఎందుకురా డిగ్రీ పుచ్చుకుని యీ వూరొచ్చావు ?ఇక్కద ఏం వుద్యోగం వస్తుంది !అన్నయ్యకు సాయం బదులు బరువవుతావు పట్టణం లో వుద్యోగం చేసి అన్నయ్య కు అండగా నిలబడు "వూళ్లోవాళ్లు సలహా యిచ్చారు .

వూళ్లో వుద్యోగం ప్రయత్నించాడు !లాభం లేకపోయింది !రామచంద్రం వూళ్లోని బంధువులమ్మాయి అంజలితో రాజశేఖర్ పెళ్ల్లి జరిపించాడు !

రాజశేఖర్ వైవాహిక జీవితం నిరుద్యోగం తో మొదలయ్యింది . బాధ్యత పెరిగింది . అన్నయ్య మీద భారం యెక్కువయ్యింది . అంజలి అన్నయ్య ద్వారా పట్నం లో ప్రైవేట్ బళ్లో వుద్యోగం రాజశేఖర్ కి వచ్చింది .

రాజశేఖర్ ఇంటివాడయ్యాడు ,ఉద్యోగస్తుడయ్యాడు . కొత్తకాపురం పట్నం లో రెండుగడుల యింట్లో మొదలయ్యింది కానీ జీతం సరిగా ఇచ్చేవాళ్లు కాదు . మొదట్లో కష్టం గా వుండేది . మెల్లగా భార్యాభర్తలిద్దరూ అలవాటు పడ్డారు ఇంటి అద్దె ,వెచ్చాలు ,కాస్త మంచి దుస్తులు కూరా నారా ,యివన్నీ ఖర్చు చూసుకునేటప్పటికి చివరకు యేమి మిగులు కనిపించేదికాదు . ఎంత ప్రయత్నించినా యింటికి పంపించడం కుదిరేది కాదు .

రామచంద్రం అన్నయ్య అప్పుడప్పుడు ఉత్తరాలు వ్రాస్తున్నాడు . అతను ఫోన్ల వాడడు . అతనికి పాతతరం వాసనలు ,ఆప్యాయతలు ,అనుబంధాలు ,బంధుత్వాలు యింగువ కట్టిన గుడ్డ లాగా అంటుకునేవున్నాయి . తమ్ముడికి క్షేమసమాచారాలు అడుగుతూ ఉత్తరాలూ వ్రాసేవాడు . యెన్నడు తన ఆర్ధిక సమస్యలు ,డబ్బు పంపమని వ్రాసేవాడు కాదు పెద్దపిల్ల అపర్ణ ,పిల్లాడు ఆదిత్య బాగాచదువుకుంటున్నారని తెలిపేవాడు .

రాజశేఖర్ పట్నం వచ్చి ఐదుసంత్సరాలు అయ్యింది . అత్తవారింటికి రెండుసార్లు వెళ్లాడు కానీ అన్నయ్యను చూడడం కుదరలేదు .తండ్రి తనపెళ్లిఅయినతర్వాత చనిపోయాడు . మొదటిసారిగా తనపరిష్టితికి విరక్తిగా నవ్వుకున్నాడు .ఎన్నో వూహించుకుంటూ చదువుకున్నాడు ,వుద్యోగం లో చేరాడు .కానీ అన్నయ్యకు అండగా నిలవలేకపోతున్నాడు . మధ్యతరగతి జీవితాలు యింతేనేమో !!

చదువు ,వుద్యోగం ,పెళ్లి ,సంతానం !!ఒకచట్రం చట్రంలో చిక్కితే బంధాలు తగ్గుతాయా ,లేక తనే ఆలా మారిపోయాడా ? చిన్నప్పటి ఆప్యాయతలు ,అనురాగాలు యేమయ్యాయి !! అతనికి యాంత్రిక జీవనం మీద నిరాశక్తత !!!

చివరకు ఒకరోజు రామచంద్రం రాజశేఖర్ యింటికి వచ్చాడు .
"అన్నయ్యా "సంతోషం గా చేయిపట్టుకుని లోపలికి తెచ్చాడు . అంజలి బావగారికి నమస్కరించింది .
"అమ్మా అంజలీ మీ అక్కయ్య నీకోసం పంపిందమ్మా "అంటూ చీర కవరు బల్లమీద పెట్టాడు రామచంద్రం .
"ఒరేయ్ రాజా నీకిష్టమని వదిన అరిసెలు ,కారప్పూస చేసిందిరా !యిదిగో "అంటూ క్యారియర్ బల్లమీద పెట్టాడు రామచంద్రం .
రాజశేఖరుకి చిన్నప్పుడు తనల్ని చేయిపట్టుకుని బళ్లోకి తీసికెళ్ళిన అన్నయ్య యెదురుగా నించున్నట్టుగా ఫీలయ్యాడు .తను నలిగిన చొక్కా వేసుకుని తనకు శుభ్రంగా వుతికినచొక్కా వేసిన అన్నయ్య కనిపించాడు .

ఎక్కడో యేదో గిల్టీ గా బాధగా గుండె తడితగిలింది రాజశేఖర్ కి .
అన్నయ్య పెరిగిన గడ్డం ,పీక్కుపోయిన ముఖం చూడగానే రాజశేఖర్ కి యెవరో తనల్ని డొక్కలో పొడిచినట్టయ్యింది . "ఏరా నువ్వుపుట్టి పెరిగిన వూరూరా !! ఇంటికేసి ఒక్కనాడు రాకపోతివి !! ఒకసారి వచ్చిపోరా !!చిన్నప్పటి జ్ఞాపకాలు వచ్చి అందరూ సరదాగా కలవండిరా "అంటూ రామచంద్రం నవ్వుతూ తమ్ముణ్ణి పలకరించాడు .

రాజశేఖర్ జవాబు చెప్పలేక తలదించుకున్నాడు . "అపర్ణ చదువైపోయింది . యింటిపట్టునే వదినకు చేదోడుగా వుంటున్నది . ఆదిత్య యీ సంవత్సరం హైస్కూలు అయిపోతుంది . కాలేజీ చదువు ఆలోచించాలి . అపర్ణకు మంచి సంబంధం వెదకాలి . వ్యవసాయం సరిగా లేదు .ఏదో చేతికి మూతికి సరిపోతున్నది . " అన్నాడు రామచంద్రం .

"అన్నయ్యా నీకు డబ్బవసరం వస్తే వుత్తరం వ్రాస్తే పంపుతాను కదా "అన్నాడు రాజశేఖర్ .
రామచంద్రం నవ్వి వూరుకున్నాడు .

"ఒరేయ్ డబ్బవసరం యెప్పుడూ వుంటుంది ,ఏం వ్రాయనురా ? నీకు కుదిరినప్పుడు నువ్వు యిబ్బంది పడకుండా పంపు "అన్నాడు రామచంద్రం . .

ఒకరోజు వుండి మర్నాడు రామచంద్రం తిరిగి వెళ్లిపోయాడు .
అన్నయ్య వెళ్లిపోగానే రాజశేఖరుకి హృదయంలో అన్నయ్య బొమ్మ నిలిచి తనల్ని ప్రశ్నిస్తున్నట్టుగా భావించాడు . పొలం ,ధాన్యం గిట్టుబాటు వున్నరోజుల్లోనే అన్నయ్య చదువు మాని నాగలి పట్టాడు . తన చదువుకోసం అన్నయ్య అప్పుచేసాడు ,అప్పుతీర్చడానికి పొలం అమ్మాడు . కానీ తానేం చేస్తున్నాడు !!!
మరుసటి నెలజీతం రాగానే వెంటనే అన్నయ్యకు కొంతడబ్బు పంపాడు . యెదోతృప్తి ,ఏదోహాయి !!!!
అంజలి జీతం డబ్బు తగ్గిందేమిటని ప్రశ్నించింది .

అన్నయ్యకు పంపానన్నాడు రాజశేఖర్
అంజలి ముఖంలో రంగులు మారాయి .
"ప్రతినెలా పంపుతారా ,యీ ఒక్కనెలేనా "విసుగు ముఖంతో ప్రశ్నించింది .
"మా అన్నయ్య !!!! ప్రతినెలా పంపుతాను , ఒక నెల తిని తక్కిన నెలలు పస్తుంటాడా ??? "బాధా ఆక్రోశం అన్నాడు
అంతే అంజలి మళ్లీ నోరెత్త లేదు
"రాజా ,ఆదిత్యను పై చదువులు చదివించాలంటే నాకు తోచడం లేదురా ! ఏం చెయ్యాలో తోచడం లేదురా "అన్నయ్య వుత్తరం చదివిన రాజశేఖర్ కి తన బాధ్యతను వెన్నుతట్టి లేపినట్టుగా అయ్యింది .
ఆదిత్యను రప్పించుకున్నాడు . కాలేజీలో చేర్చాడు . రాజశేఖర్ సాయం కాలం కొంత మంది పిల్లలకు ట్యూషన్లు మొదలు పెట్టాడు . ఇప్పుడు రాజశేఖర్ ఎంతో తృప్తిగా ప్రశాంతం గా వున్నాడు . వున్న దాంట్లో సద్దుకుంటూ ఆదిత్యను చదివిస్తున్నాడు .
మధ్య తరగతి జీవితాలు ! కించిత్ కోపం , కించిత్ స్వార్ధం , కించిత్ అసహనం !!!! కానీ అంతర్లీనంగా కనపడని అనుబంధాలు ,ఆప్యాయతలు ,!!!! పువ్వు వాడినా సన్నజాజి తావిలాగా అల్లుకున్న అందమైన అనుబంధాలు !!!

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం