వీడని అనుబంధం - కందర్ప మూర్తి

Veedani anubandham

రైతు సాంబయ్యకు రాముడు - భీముడు రెండు దుక్కి దున్నే ఎడ్లున్నాయి. వ్యవసాయ పనులపుడు నాగలి పట్టి పొలంలో దుక్కి దున్ని పంటలు పండిస్తే మిగతా సమయంలో ఎడ్లను బండికి కట్టి సరుకులు తోలుతాడు. పక్క పొలం రైతుతో గొడవ పడినందున పొలం సరిహద్దు వెంబడి ముళ్లకంచెలు పెట్టించాడు సాంబయ్య. వర్షంలో ఒకసారి గట్టు వెంబడి నాగలితో పొలం దున్నుతుంటే కాలు బెణికి ఎద్దు భీముడు ముళ్ల కంచె మీద పడ్డాడు. ఎండిన పెద్ద తుమ్మ ముల్లు కంట్లో గుచ్చుకుని ఒక కంటి చూపు పోయింది. అప్పటి నుంచి రోజువారీ పొలం పనుల్లో జాప్యం జరుగుతు ఆధాయం తగ్గింది. అందువల్ల ఎద్దు భీముడిని ఎలాగైనా వదిలించు కోవాలనుకున్నాడు సాంబయ్య. గానుగ ఆడే తెలుకలి అప్పన్న దగ్గరకెళ్లి ' నూనె ఆడేగానుగ రాటకి కట్టిన నీ ఎద్దును నాకిచ్చి నా గుడ్డి ఎద్దును నువ్వు ఉప యోగించుకో.గానుగ రాటతో చుట్టు తిరుగుతుంది కనక నీ పనికి సమస్య ఉండదు' అన్నాడు సాంబయ్య. ఆరోగ్యంగా బలంగా ఉన్న ఎద్దు భీముడిని చూసి సరే నన్నాడు అప్పన్న.గానుగ ఎద్దును సాంబయ్య, గుడ్డి ఎద్దు భీముడిని అప్పన్న మార్చుకున్నారు. తొలకరి వర్షాలు కురిసి వ్యవసాయ పనులు మొదలయాయి.సాంబయ్య తన నాగలి అరకకు ఒకవైపు రాముడిని మరోవైపు గానుగ ఎద్దును కట్టి భూమిని దున్నడం ప్రారంభించాడు పొలంలో కొద్ది దూరం వెళ్లాక గానుగ ఎద్దు అలవాటుగా కుడి పక్కకి తిరిగింది. అరక ముందు కెళ్లలేదు.ఎన్ని దెబ్బలు వేసినా కుడి ఎడమలకు తిరుగుతోంది తప్ప ముందుకు వెళ్లడం లేదు.అరక ముందు కెళ్లక ఎండలో విసిగిపోయాడు సాంబయ్య. తెలుకలి అప్పన్న గానుగ రాటకి కట్టిన భీముడు పది అడుగులు వెళ్లి ఆగి ముందుకు వెళ్లేది. పప్పు నలగక గానుగలో నూని దిగక అప్పన్నకి చిరాకు మొదలైంది. గుడ్డి ఎద్దు భీముడిని వెంటబట్టుకుని సాంబయ్య దగ్గరికొచ్చి తన గానుగ ఎద్దును తోలుకుపోయాడు తెలుకలి అప్పన్న. రైతు సాంబయ్య దగ్గరకు తిరుగొచ్చిన భీముడు ఒకరోజు దృష్టి లోపం వల్ల పక్క పొలంలో ఏపుగా ఎదిగిన పంటను మేయడం కారణంగా తగాదా ఊరి పంచాయతీ వరకు వెళ్లింది. ఈ గుడ్డి ఎద్దును అమ్మినా సంతలో ఎవరు కొనరని తలిచి దూరంగా తీసుకెళ్లి కొండగుట్టల్లో వాగు దగ్గర వదిలి వచ్చాడు. సంతకెళ్లి రాముడికి జతగా మరొక ఎద్దును కొనుక్కొచ్చాడు సాంబయ్య. ముందునుంచి సరిజోడిగా భీముడితో జతకట్టిన రాముడు మరొక ఎద్దుతో పని చెయ్యలేక పోతోంది. కొండ గుట్టల్లో ఆకలితో దారి తెలియక తిండి కోసం తిరుగుతున్న ఎద్దు భీముడిని ఒక నక్క చూసి , అది గుడ్డిదని గ్రహించి దాన్ని మెల్లిగా నీటి మడుగులో పడేలా చేస్తే చాలా రోజుల వరకూ భుక్తికి కరువుండదనుకుంది. నక్క భీముడి దగ్గరకెళ్ళి " ఏమిటి మిత్రమా ! ఊరు వదిలి ఈ కొండ గుట్టల్లో తిరుగుతున్నావ్? " ఆప్యాయంగా అడిగింది. నక్క ఆప్యాయతకి మురిసిపోయిన భీముడు జరిగిన సంగతంతా చెప్పింది.తన రొట్టె విరిగి నేతిలో పడిందనుకుంది మాయదారి నక్క. " భయ పడకు నేస్తమా, నీకు తోడు నేనున్నాను. ఈ గుట్టల్లో కడుపు నిండా తిని రాత్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకో అని చెప్పి కొద్ది దూరంలో నీటి మడుగుంది, ముందు అక్కడికెళ్లి నీళ్లు తాగితే నిన్ను మొక్క జొన్న పొలానికి తీసుకెల్తానంది" నక్క. ఆ ప్రాంతం కొత్తయినందున సరే నంది ఎద్దు. ఇద్దరూ కలిసి వెల్తూండగా నీటి మడుగు గట్టు మీద ఎర్రగా ఏదో తినేవస్తువు కంటపడింది నక్కకి. ముందు రోజున వేటగాళ్లు అడవిపందుల వేట కోసం పేలుడు పదార్థాలకు ఎరని చేర్చి పెట్టారు. ఎర్రని మాంసపు ఎరను చూసిన నక్కకి నోరూరి ముందు దాన్ని రుచి చూసిన తర్వాత ఎద్దు సంగతి చూడొచ్చని తలిచి దగ్గరికెళ్లి ఎరని గట్టిగా నోటితో కొరికింది. " ఢాం!" అని పేలి నక్క ఎగిరి మడుగులో పడి చచ్చింది. ఊరిలో రైతు సాంబయ్యకి ఎద్దు భీముడు లేనిలోటు తెలి సొచ్చింది. కంటి చూపు తగ్గినా విశ్వాసంతో తనకు సేవలందిస్తూ ఫల సాయానికి సాయపడిందని , రాముడు కూడా దిగులుగా ఉండటం చూసిన రైతు గుట్టల్లో ఆకలితో తిరుగుతున్న భీముడిని వెతికి ఇంటికి తీసుకువచ్చి కడుపునిండా పచ్చగడ్డి, కుడితి తౌడు తినిపించాడు. తిరిగి వచ్చిన భీముడిని చూసిన ఎద్దు రాముడు ఆనందంతో రంకె వేసాడు. * * * *

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి