చివరి పాఠం . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Chivari paatham

అమరావతి నగర రాజ్య పొలిమేరలలో సదానందుడు అనే పండితుడు ఆదేశ రాజుగారి సహయంతో, విద్యార్దులకు ఉచిత భోజన ఆశ్రయం కల్పించి విద్యాబోధన చేయసాగాడు. నాయనలారా నేటిపాఠంలో యాగాల గురించి తెలుసుకొండి.

పూర్వం ఎందరో రాజులు పలు రకాల యాగాలు ప్రజల సంక్షేమం కోరి నిర్వహించేవారు. యాగహవిస్సు ను స్వీకరించిన దేవతలు యాగనిర్వాహకుడిని ఆశీర్వదించేవారు ఫలితంగా ఆ రాజ్యం సుభిక్షంగా పాడి పంటలతో కళకళలాడుతూ ఉండేది.

'అశ్వమేధయాగం' నిర్వహించినవారు, మాంధాతృడు, వేణుడు, శశిబిందుడు, సగరుడు, పృథుడు, జనమజేయుడు, బలి, పురూరవుడు, భగీరధుడు, దిలీపుడు, యయాతి, నభాగుడు, రంతిదేముడు, రాముడు, భరతుడు, ధర్మరాజు వంటి పలువురు నిర్వహించారు.

ఇంద్రుడు కాశీలో గంగానది తీరాన పది అశ్వమేధ యాగాలు చేయడం వలన అక్కడ 'దశశ్వమేధఘాట్ ' ఏర్పడింది. నేటికి అక్కడ సంధ్యాసమయంలో గంగానదికి హారతి ప్రతి దినం ఇస్తారు.

'రాజసూయ యాగం' మాంధాతృడు, సుహాత్రుడు, సుష్మద్మని పుత్రుడు విశ్వంతరుడు, పరిక్షితుని పుత్రుడు జనమజేయుడు, సహాదేవుని పుత్రుడు సోమకుడు, దేవవృధుని పుత్రుడు బభృవు, విదర్బ దేశాధిపతి ధోమకుడు, గాంధారి దేశాధిపతి, నగ్నజిత్తు, కిందమ ముని పుత్రుడు సనశ్రుతుడు, జానకుని పుత్రుడు క్రతువిదుడు, విజవసుని పుత్రుడు సుదాముడు, హరిశ్చంద్రుడు, ధర్మరాజు వంటి పలువురు నిర్వహించారు.

యయాతి, భగీరధుడు, 'వాజపేయ యాగం' నిర్వహించారు. 'మరుత్తు' వాజపేయ యాగంతోపాటు, అసంఖ్యాకంగా పలు రకాల యాగాలు నిర్వహించాడు. దిలీపు చక్రవర్తి కుమారుడు రఘువు 'విశ్వసృద్ యాగం', 'విశ్వజిత్తు' అనే యాగాలు చేసాడు.

'దుర్యోధనుడు' వైష్ణవ యాగాన్ని, 'దశరధుడు', 'జనకమహారాజు' సంతానం కోరి 'పుత్ రకామేష్టియాగం' చేయగా, తన తండ్రి మరణానికి కారకులైన నాగులను అంతమొందించడానికి 'సర్పయాగం' చేసాడు జనమజేయుడు.

ఇలా పలు యాగాలు లోక కల్యాణార్దం అని తమ అధికారాన్ని సుస్ధిరం చేసుకోవడానికి, భూలోకంలో ఖ్యాతి పొంది,స్వర్గలోకంలో స్దానం పొందడానికి ఇటువంటి అనేక యాగాలు ఆర్థికబలం, అంగబలం కలిగిన శక్తివంతమైన చక్రవర్తులు, రాజులు, సామంతులు సమర్థవంతంగా నిర్వహించారు.అన్నాడు సదానందుడు.

వారం రోజుల అనంతరం ఇద్దరు శిష్యుల విద్యాభ్యాసం పూర్తి కావడంతో వాళ్ళను పిలిచి "నాయనలార నేటితో మీ విద్యాభ్యాసం పూర్తి అయింది, మీరు వెళ్ళవచ్చు" అన్నాడు సదానందుడు. అందుకు ఆ శిష్యులు "గురుదేవా, విద్యాదాత, అన్నదాత లు దైవస్వరూపాలు కనుక తమకు గురుదక్షణగా ఏదైనా ఇవ్వడం ఆచారం. ఏదైనా గురుదక్షణ కోరండి తమ పాదపద్మాలకు సమర్పించి వెళతాం" అన్నారు. "నాయనలారా మీరు పేద విద్యార్దులు. మీవద్ద ఏం ఉంటుంది నాకు ఇవ్వడానికి, మీ కోరిక కాదనలేక పోతున్నాను. అడవిలోనికి వెళ్లి మీ తలగుడ్డ నిండుగా ఎండి రాలిన ఆకులు తెచ్చిఇవ్వండి అవే నాకు గురుదక్షణ" అన్నాడు సదానందుడు. అలాగే అంటూ అడవిలోనికి వెళ్లిన శిష్యులు ఎండిన ఆకులు సేకరించబోగా, అక్కడ ఉన్నవారు "నాయనలారా ఈ ప్రాంతంలోని ఎండిన ఆకులు అన్ని సేకరించి విస్తర్లుగా కుట్టుకొని మేమంతా జీవిస్తున్నాం దయచేసి ఇక్కడఆకులు ఏరకండి." అన్నారు. మరికొంతదూరంలోనికి వెళ్ళి అక్కడ ఎండుఆకులు సేకరించబోగా అక్కడ ఉన్నవారు "నాయనలారా ఇలా రాలినఎండు ఆకులను మేము వైద్యాచేయడానికి వాడుతున్నాం. దయచేసి మీరు ఇక్కడఎండు ఆకులు సేకరించ వద్దు" అన్నారు. మరో ప్రాంతంకు వెళ్లగా అక్కడ ఉండేవారు "నాయనా ఈప్రాంతంలోని వారందరము ఈ ఎండు ఆకులతోనే అన్న వండుకుంటాం, స్నానానికి నీళ్లు వేడి చేసుకుంటాం, కనుక ఈ ప్రాంతంలో ఎండు ఆకులు సేకరించవద్దు" అన్నారు. ఎక్కడకు వెళ్ళినా ఏదోవిధంగా ఎండుఆకులు వినియోగంపడం చూసి నిరాశతో ఆశ్రమం చేరేదారిలో నీటిలో ఒక ఎండుఆకు చూసి అందుకోబోగా అందులోఉన్న రెండుచీమలు "అయ్య ఈ ఆకు పుణ్యాన మా ప్రాణాలు కాపాడుకుంటున్నాం, దయచేసి మామ్ములను వదిలేయండి" అన్నాయి. వట్టి చేతులతో ఆశ్రమంచేరిన శిష్యులను చూసి" ఏం జరిగింది నాయనలారా" అన్నాడు సదానందుడు. జరిగిన విషయం వివరించారు శిష్యులు. "నాయానా అర్ధం అయిందా చెట్లు మానవాళికి ఎంత మహోపకారాన్ని చేస్తున్నాయో. ఈసృష్టిలో వ్యర్ధ అంటూ ఏది లేదు. చివరికి పోలంలో కలుపు మొక్కగా ఉండే గరిక కూడా పసువుల మేతకు వినియోగ పడేదే" అన్నాడు సదానందుడు. "గురుదేవా చివరిపాఠం గా మీరునేర్పిన ఈ విషయం లోకానికి తెలియజేస్తాము సెలవు" అని సదానందునికి పాదాభివందనం చేసి వెళ్లిపోయారు శిష్యులు.

మరిన్ని కథలు

Sarigamalu
సరిగమలు
- కొడవంటి ఉషా కుమారి
Sandhyarani coffee kappu
సంధ్యారాణి కాఫీకప్పు
- అనంతపట్నాయకుని కిశోర్
Anaadigaa..
అనాదిగా....
- షామీరు జానకీ దేవి
దుష్టబుద్ధి!
దుష్టబుద్ధి!
- - బోగా పురుషోత్తం
Vendi kadiyalu
వెండి కడియాలు
- కొడవంటి ఉషా కుమారి
Chillara kshanalu
చిల్లర క్షణాలు
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Nee jeevitam nee chetallo
నీ జీవితం నీ చేతల్లో
- జి.ఆర్.భాస్కర బాబు