
భూపాలపల్లి అడవులలో ఉండే జంతువులకు అంతు తెలియని రోగాలు వచ్చి మృత్యువాత పడుతున్నాయి. కొన్ని ఆకలి లేమి, కడుపు ఉబ్బరం,
విరోచనాలతో బాధ పడుతున్నాయి.
వనరాజు గజరాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా అడవి జంతువుల బాధలు
తగ్గడం లేదు. చివరకు సలహాదారు తిమ్మరాజు ఆలోచన మేరకు 'భాలూ'
ఎలుగుబంటిని రప్పించి దగ్గరలోని కూనవరం వెళ్లి జంతు డాక్టరు వద్ద వైద్య విద్య నేర్చుకురమ్మని పంపించాడు.
గజరాజు ఆజ్ఞను కాదనలేక అడవి జంతువుల బాధలు చూడలేక
భాలు ఎలుగుబంటి అడవి దాటి కూనవరంలోని పశువైద్యుడికి గజరాజు
వినతిని తెలియచేసి తనకు జంతు వైద్యం నేర్పమని కోరేడు.
పశువైద్యుడు ఒక మాట మీద భాలూకి జంతు వైద్యం నేర్పడానికి
ఒప్పుకుని "అడవి ఏనుగులు గ్రామాల పంటపొలాలను, ఫలవృక్షాలను
నాశనం చెయ్యకూడదని, అలాగే వానరాలు, ఇతర జంతువులు గ్రామంలో
వచ్చి విధ్వంసం చెయ్యరాదని షరతులు " పెట్టేడు.
అందుకు గజరాజు అంగీకరించడంతో జంతు రోగ నివారణలో మెలకువలు,
తినే ఆహారం, తాగే నీటి విషయంలో జాగ్రత్తలు అన్నీ శిక్షణ ఇచ్చి కొన్ని మూలికలు, వేర్లు , పసర్లు ఆయుర్వేద వైద్య చిట్కాలు తెలియచేసాడు.
డాక్టరు భాలు అడవిలో అందరికీ అందుబాటులో ఉన్న పెద్ద వటవృక్షం కింద పర్ణకుటీరం ఏర్పాటు చేసి అడవిలో వైద్యం కోసం లభించే ఆకుల
పసర్లు, వనమూలికలు, చూర్ణాలు , పళ్ల రసాలు సేకరించి భద్రపరిచాడు.
అన్ని జంతువులకు తాము నివసించే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛమైన నీళ్ళు తాగాలని, నిలవ పదార్థాలు తినవద్దని, సాద్యమైనంత వరకు సూర్యకాంతిలో తిరగమని అనేక ఆరోగ్య సూచనలు చేసాడు.
వైద్య శిక్షణ అనంతరం అడవికి తిరిగి వచ్చిన డాక్టరు భాలూ గజరాజు
అనుమతితో సలహాదారు తిమ్మరాజును వెంటపెట్టుకుని అడవి చుట్టు పరిసరాలను పరిశీలించాడు.
అడవిలో ఉండే జలాసయాలకు విదేశీ పక్షులు వలస వచ్చి చెట్లపై గూళ్లు
ఏర్పాటు చేసుకుని నివాసం ఉన్నందున వాటి రెట్టలలో ఉండే వైరస్ లు
నీటిలో కలిసి వనజంతువులు ఆ కలుషిత నీటిని సేవించడం వల్ల కొత్త
రోగాలు సోకుతున్నాయని, అలాగే కొందరు పర్యాటకులు అడవిలో
లభించే ఖనిజ సంపద కోసం వచ్చి వారి వెంట తెచ్చుకున్న తినుబండారాలు
చాక్లెట్లు, బిస్కెట్లు, లాలీపాపులు వంటి ప్లాస్టిక్ రేపర్లు వాడేసి అడవిలో
పడవెయ్యడం వల్ల వాటిని తిన్న అడవి జీవాలు మృత్యువాత పడుతున్నయని అవగాహనకు వచ్చాడు డాక్టరు భాలు.
డాక్టరు భాలు వచ్చి పర్ణకుటీరంలో వైద్యశిబిరం మొదలు పెట్టినప్పటి
నుంచి జంతువులలో రోగాలు తగ్గి వైద్యం వల్ల ఉపశమనం కలుగుతోంది.
డాక్టరు హస్తవాసి మంచిదని నమ్మి దూరం నుంచి పెద్ద చిన్న జంతువులు
వచ్చి వరుసలు కట్టి డాక్టరు పిలుపు కోసం ఎదురు చూస్తుంటాయి.
అలా ఓపికగా ఎదురు చూస్తున్న తల్లి వానరం, పిల్ల వానరం వంతు
వచ్చింది.
డాక్టరు భాలు తల్లీ , పిల్లను దగ్గరగా కూర్చోబెట్టి "ఏమిటి బాధ? "
అని తల్లి కోతిని అడిగాడు.
"డాక్టరు గారూ, పిల్లది వారం రోజుల నుంచి తిండి తినడం లేదు.
రోజంతా నీర్సంగా కడుపు ఉబ్బరంతో బాధ పడుతోంది. నేను అదే
తగ్గిపోతుందని పసిరిక గడ్డిపరకలు నమిలించాను. అయినా అది
తిండి ఎందుకు తినడం లేదో తెలవక మీ దగ్గరకు తీసుకు వచ్చాను".
అని పిల్ల కోతికి వచ్చిన బాధ చెప్పింది.
డాక్టరు భాలు పిల్ల కోతిని దగ్గరకు పిలిచి కళ్లూ, పళ్ళు, చెవులు
పరీక్ష చేసి చేత్తో దాని పొట్టను నొక్కాడు.
కడుపు గట్టిగా అనిపించింది. ఏదో అనుమానం కలిగింది.
తల్లి కోతి ద్వారా వారం దినాల నుంచి సమస్య ఉందని
తెలుసుకున్న డాక్టరు భాలు పిల్ల కోతిని వివరాలు అడిగాడు.
"వన విహారానికని కొందరు విద్యార్థులు అడవిలోకి వచ్చారని,
వారు అనేక తినుబండారాలు తింటు ఎక్కడ పడితె అక్కడ
విసిరేసారని, అప్పుడు నేను ఆడుకుంటూ కింద పడ్డ తియ్యటి
పళ్లను తిన్నానని " జరిగిన సంగతి చెప్పింది
డాక్టరు భాలూకు విషయం అర్థమైంది. పిల్ల కోతి తిన్నవి
చాకొలెట్లని, వాటిని పైన తొడుగులు తియ్యకుండా తిన్నందున
కడుపులోకి వెళ్లి జీర్ణం అవక కడుపు ఉబ్బరంతో బాధపడుతు
ఆకలి మందగించిందని , అసలు సంగతి తల్లి కోతికి చెబుతు
"ఈమద్య మనుషులు 'ప్లాస్టిక్ ' అనే విషపదార్థాలు తినుబండారాలతో
పాటు పడవెయ్యడం వల్ల వాటిని తిన్న జంతువులు ఆనేక రోగాలతో
మృత్యువాత పడుతున్నాయని" వివరింంచి , ఒక చూర్ణం ఇచ్చి కేరెట్
తురుముతో తినిపించమని చెప్పాడు.
డాక్టరు భాలు ఇచ్చిన చూర్ణం కేరెట్ తురుముతో తినిపించిన
కొద్ది సమయం తర్వాత పిల్ల కోతికి విరోచనాలు జరిగి కడుపులో
కల్మషం బయటకు వచ్చి సమస్య తీరి బాగా ఆకలి వేసింది.
తల్లి వానరం మనసు తేలిక పడింది.
డాక్టరు భాలు వైద్య శిబిరం తెరిచినప్పటి నుంచి అడవిలో
జంతువులు ఆరోగ్యంగా ఉంటు చలాకీగా కనబడటం గజరాజుకు
ఆనందమైంది.
* * *
సమాప్తం