గూడు మరిచిన పక్షి - కందర్ప మూర్తి

Goodu marichina pakshi

" ఒరే , చిన్నా! సదువు ఒగ్గేసి ఊరంట ఆంబోతులా తిరగడం మాని పట్నానికి పోయి కూలిపనో , రిచ్చా నడిపో కుసిన్ని డబ్బులు తెత్తే ఎవసాయానికి పెట్టుబడిగా పనికొత్తాయి" వయసొచ్చిన కొడుకు చంద్రాన్ని నిలదీసాడు సన్నకారు రైతు వెంకన్న. స్నేహితులతో జల్షాగా తిరిగే చందర్రావుకి అహం దెబ్బతింది. తండ్రితో మాటా మాటా పెరిగి రోషంతో కట్టుబట్టలతో మిత్రుడు సింహాద్రిని వెంట తీసుకుని పట్నానికి మకాం మార్చేసాడు చంద్రం. ఎవరు పరిచయం లేని ప్రదేశం. స్నేహితులిద్దరూ ఎక్కడ తిరిగినా తిండి పుట్టలేదు. ఆకలి దంచేస్తోంది. చివరికి రోడ్డు పక్కన దాబా హోటల్లో కప్పులు గిన్నెలు కడిగితే భోజనం పెడతామంటే ఆ పనికి ఒప్పుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. కొడుకు పట్నంలో ఉన్నాడని తెలిసి వెంకన్న ఇంటికి రమ్మన్నా వెళ్లలేదు. స్నేహితులిద్దరు హోటల్లో పనిచేసుకుంటూ రాత్రిళ్లు హోటలు బయట అరుగు మీద పడుకుంటున్నారు. ఒకరోజు హోటలుకి శలవైనందున మిత్రులిద్దరు పట్నంలో తిరగడానికి బయలు దేరారు. అలా వెల్తూంటే ఒక చోట పెద్ద మైదానంలో ధృఢకాయులైన యువకులు వరస కట్టి నిలబడి ఉన్నారు. చంద్రం మిత్రుడు సింహాద్రి అక్కడ ఏం జరుగుతుందోనని వాకబు చెయ్యగా " మిలిటరీ లోకి కుర్రాళ్లని తీసుకుంటు న్నారని తిండి పెట్టి బట్టలు వసతితో పాటు నెలకి జీతం ఇస్తారట " అని సమాచారం తెచ్చాడు. మనకి సదువు ఏమీ లేదని, మనల్నెవరు మిలిట్రీకి తీసుకుంటారని అశక్తత కనబర్చాడు చంద్రం. " పోనీలేరా , లైనులో నిలబడి చూద్దాం. తీసుకోకుంటే వచ్చేద్దాం" అని సింహాద్రి నచ్చ చెబితే 'సరే 'నని మిత్రులిద్దరు రిక్రూటింగ్ ఆఫీసు దగ్గర కుర్రాళ్లతో కలిసి వరసలో నిలబడితే దేహదారుడ్య వైధ్య పరిక్షల్లో సెలక్టు అయారు. వాళ్లిద్దరికి చదువు లేదని తెలిసినా వారి దేహ దారుడ్యం , చురుకుతనం గమనించి సైనిక సిబ్బంది వయసు నిర్ధారణ, చిరునామా, వివరాలు గ్రామ పంచాయతీ ఆఫీసు నుంచి ధృవీకరణ పత్రం తీసుకు రమ్మని చెప్పారు. స్నేహితులిద్దరూ మాట్లాడుకుని ఊరికి తిరుగొచ్చి విషయం పెద్దోళ్లకి చెప్పేరు. " వద్దురా , మిలిట్రీకి పోతే సచ్చిపోతారని, ఇక్కడే ఏదో పని సూసుకుని బతకండని " ఊరి పెద్దలు నచ్చ చెప్పారు. ఎవరెన్ని చెప్పినా వాళ్లు వినలేదు..మిలిటరీకి వెళ్లడానికే నిశ్చయాని కొచ్చారు. చివరికి, అందాజాగా వారి వయసు , పేరు , చిరునామా, ఊరి వివరాలతో పంచాయతీ ప్రసిడెంటు గారి నుంచి ధృవపత్రం తీసుకుని తాహసీల్దారు ఆఫీసు ముద్రతో రిక్రూటింగ్ ఆఫీసులో అందచేసారు. * * * మిత్రులిద్దర్నీ ఎంపిక చేసి డాక్యుమెంట్లు పూర్తి చేసి ట్రైనింగ్ సెంటర్ కి పంపేరు రిక్రూటింగ్ ఆఫీసు సిబ్బంది. ట్రైనింగ్ సెంటర్లో దేశం నలు మూలల నుంచి సెలక్టై వచ్చిన యువకులతో కోలాహలంగా ఉంది. ఎవరు ఏ భాష మాట్లాడు తున్నారో తెలియడం లేదు.తెలుగు మాట అసలు లేదు. మిలిటరీ సిబ్బంది ఠీవిగా ఆకుపచ్చ దుస్తుల్లో , హిందీలో గట్టిగా కేకలేస్తు కనబడుతున్నారు. తెలుగు వాళ్లు ఒకరిద్దరు కనబడినా వాళ్లని వేరే విభాగానికి పంపేసారు. ట్రైనింగ్ సెంటర్లో స్నేహితులిద్దరు ఒకేచోట ఉంటూ హిందీ భాష తెలియక చేతి సంజ్ఞల ద్వారా రోజువారీ దినచర్య చేసు కుంటు మెల్లిగా హిందీ మాట్లడటం నేర్చుకుని మిలిటరీ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసారు. ఇద్దరికీ ఆకుపచ్చని యూనిఫాం, రోజూ మంచి భోజనం , వసతి , నెలకి జీతం అందుతుంటే ఈ జీవితమే హాయి అనుకున్నారు మిత్రులిద్దరు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత స్నేహితులిద్దర్నీ వేరువేరు ప్రాంతాలకు పోస్టింగు ఇచ్చి పంపేరు. చిన్నప్పటినుంచి కలిసి తిరిగిన మిత్రులిద్దరు భారమైన మనసుతో వీడ్కోలు చెప్పుకున్నారు. దేశం వేరువేరు ప్రాంతాల్లో సైన్యం ఫిరంగి విభాగంలో సిపాయిలుగా సేవ లందిస్తున్నారు. అన్ని వసతులతో పాటు నెలనెలా జీతం , సంవత్సరానికి రెండు నెలల శలవు ఉంటోంది. చంద్రం తండ్రికి ఆర్థికంగా డబ్బు సర్దుబాటు చేసి వ్యవసాయ అప్పులు తీర్చ గలుగుతున్నాడు. ఇప్పుడు చంద్రం ముసలి తండ్రి తల్లి చెల్లిని బాగా చూసు కుంటున్నాడు. శలవుపై ఊరికి వచ్చి పెళ్ళి చేసుకున్నాడు. జులాయిగా తిరిగే కొడుకు జీవితంలో స్థిర పడ్డాడని వెంకన్న సంతోషించాడు. చంద్రం సిపాయిగా సైన్యంలో చేరి పదేళ్లు గడిచిపోయాయి. బలంగా ధృడంగా క్రమశిక్షణ గల సైనికుడిగ కనబడుతున్నాడు. ఈ సమయంలో మిత్రుడు సింహాద్రిని ఊళ్లో కలిసింది తక్కువే. * * * మిత్ర దేశంగా పొరుగున ఉన్న చైనా వంచనతో భారతదేశ భూ భాగాన్ని దురాక్రమణ జరపగా యుద్ధం ప్రారంభమైంది. భారత సైన్యం చైనా భారత సరిహద్దుల్లో మొహరించింది. దేశమంతటా అత్యవసర పరిస్థితి ప్రకటించారు.కళాకారులు రాజకీయ నాయకులు , మహిళా సంఘాలు , స్వచ్ఛంద సంస్థలు జాతీయ రక్షణ నిధికి విరాళాలు సేకరిస్తున్నారు. భారత సరిహద్దుల్లో భీకర యుద్ధం జరుగుతోంది.వెన్నుపోటు తో మోసగించిన చైనాదేశ సైన్యం ముందస్తు ప్రణాళికతో యుద్ధ సన్నాహాలు చేసుకుంది. భారత సైన్యానికి భారీ ప్రాణనష్టం జరుగుతోంది.భయంకర ఎత్తైన మంచు పర్వతాలు ,చలిగాలులు , ఎముకలు కొరికే చలి , క్లిష్ట వాతావరణ పరిస్థితులు, సరైన రోడ్డు రవాణా సదుపాయాలు లేక ఆయుధాలు ,ఆహారం, చలిదుస్తులు అందక భారత సైనికులు కష్టాల పాలవు తున్నారు. చైనా సైనికుల తుపాకీ తూటాలకు కొంతమంది , వాతావరణ పరిస్థితులకు , ఆహార సరఫరా అందక ఆకలికి, తాగునీరు లేక భారత సైనికులుప్రాణాలొదుతున్నారు. కొండలు గుట్టల్లో గుంపులుగా సైనికుల మృతదేహాలు కానొస్తున్నాయి. సిపాయి చంద్రం పటాలంలో చాలా మంది చనిపోయారు. మిగిలిన కొద్ది మంది ప్రాణరక్షణలో చెల్లాచెదురై పోయారు. చంద్రం ఒంటరి వాడయాడు. ఆహారం అందుబాట్లో లేదు. ఉన్న కొద్ది పాటి నీళ్లు బిస్కెట్లతో తిరుగుబాట పట్టేడు. భీకర పర్వతాల్లో దారెటో తెలియడం లేదు. వంటి మీద యూనిఫారం చిరిగి కాలికున్న బూట్లకి రంద్రాలు పడి రాళ్లు కాళ్లకి గుచ్చుకుంటున్నాయి.అలాగే అవస్థలు పడుతు భారత సైనిక శిబిరాల చెక్ పోస్టు కోసం వెతుకుతున్నాడు. అలా చాలాదూరం ప్రయాణం చేసి అలసట వల్ల ఒక పెద్ద బండరాతి మీద విశ్రాంతి కోసం కూర్చున్నాడు.దగ్గరలో మూలుగు శబ్ధం వినబడుతోంది. ఎవరని మూలుగు వచ్చిన వైపు వెళ్లాడు. అక్కడ ఒక సైనికుడు చిరిగిన యూనిఫాం తో అపస్మారక స్థితిలో పడిఉన్నాడు. ఆకలి దప్పులతో అలసి ఉన్నా చంద్రంలో మానవత్వం మేల్కొంది. వంగి ఆ వ్యక్తి ముఖం చూస్తే నేపాలీ గూర్ఖా సైనికుడిలా కనిపించాడు. తల దగ్గర హెల్మెట్ పడి ఉంది. తుపాకీ తూటా హెల్మెట్ కి తగిలి రంద్రం చేసి సైనికుడి తలలో కెళ్లినట్టుంది. తల దగ్గర రక్తం గడ్డ కట్టింది. బతికే ఉన్నాడు. చంద్రానికి ఏమి చెయ్యాలో తోచడం లేదు. ఈ పరిస్థితుల్లో తన ప్రాణాలకే నమ్మకం లేదు. మరి ఈ గాయపడిన సైనికుణ్ణి ఏం చెయ్యాలి. ఇలాగే వదిలేస్తే కొద్ది గంటల్లోనే చచ్చిపోతాడు. తనకి మిలిటరీ ట్రైనింగ్ సెంటర్లో , యుద్ధ సమయంలో గాయపడిన సహచర సైనికుల ప్రాణరక్షణ ఎలా చెయ్యాలో నేర్పిన పద్దతి గుర్తుకు వచ్చింది. మానవత్వం మరోసారి తట్టి లేపింది. తన దగ్గరున్న వాటరు బాటిలు మూత తీసి కొద్దిగా నీళ్లు అతని నోట్లో పోసాడు.కొద్ది సేపటికి అతనిలో కదలిక వచ్చింది. కాని స్ప్రుహ రాలేదు. చంద్రం వంట్లో శక్తి కూడదీసుకుని ఆ సైనికుడి శరీరాన్ని వీపు మీద ఎక్కించుకుని చేతిలోని రైఫిల్ చేతి కర్రగా చేసు కుని ముందుకు సాగుతున్నాడు. సాయంకాలమైంది. వెలుగు క్షీణిస్తోంది. దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్లిన తర్వాత మైదాన ప్రాంతానికి చేరుకున్నాడు. కొద్ది దూరంలో మనుషుల కదలికలు మాటలు వినబడుతున్నాయి. కాళ్లలో శక్తి లేకపోయినా వీపు మీద అపస్మారక సైనికుడి శరీరంతో తూలుతు ముందుకెళ్లి పడిపోయాడు. చంద్రం ముఖం మీద చల్లటి నీళ్లు పడటంతో కళ్లు తెరిచి చూస్తే తను భారత సైనిక చెక్ పోస్టు శిబిరంలో ఉన్నట్టు గ్రహించాడు. దేవుడు తనను రక్షించాడను కున్నాడు. అక్కడి సైనిక వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స జరిపి ఆహారం, నీరు అందిస్తే కోలుకున్నాడు. తనకు కొద్ది దూరంలో నేపాలీ గూర్ఖా సైనికుడు తలకి బేండేజీ కట్టుతో అపస్మారక స్థితిలో స్ట్రైచర్ మీదున్నాడు. మూతికి ఆక్సిజన్ మాస్కు చేతికి సలైన్ బాటిల్ కనెక్టు చేసిఉంది. ఆ రాత్రికి సైనిక శిబిరంలో ఉంచి మర్నాడు మిలిటరీ అంబులెన్సులో దగ్గరున్న మిలిటరీ ఎమర్సెంసీ మెడికల్ సెంటర్ కి తీసుకెళ్లారు. ఆర్మీ చెక్ పోస్టు దగ్గర సిపాయి చంద్రం ఆర్మీ యూనిట్ వివరాలు , పేరు , సర్వీసు నంబరు సేకరించారు. మంచు , కొండరాళ్ల రాపిడికి పగిలి చిల్లులు పడిన కాళ్ల బూట్ల కారణంగా చంద్రం కాలి వేళ్లకు ఇన్ ఫెక్షన్ సోకి శస్త్ర చికిత్స జరిపి వేళ్లు తీసేయవల్సి వచ్చింది.అందువల్ల వైద్య పరంగా ఆర్మీ సర్వీసుకి అనర్హుడిగా ఉధ్యోగ విరమణ చేయించారు. సైన్యంలో పది సంవత్సరాలే సర్వీస్ చేసినందున మెడికల్ పెన్సన్ మంజూరు చేసారు. సిపాయి చంద్రం వెంట తెచ్చిన గూర్ఖా యువకుడి తలలో బుల్లెట్ ముక్క దూరినందున శస్త్రచికిత్స చేసి దాన్ని తీసేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు సైనిక వైధ్య సిబ్బంది. కాని అతని జ్ఞాపకశక్తి నశించి గతం మర్చిపోయాడు. తన పేరు , ఊరు , ఆర్మీ యూనిట్ సర్వీస్ వివరాలు ఏమీ చెప్పలేక పోతున్నాడు. అతను ఎవరో తెలుసుకునే ఆధారాలు సైనిక అధికారులకు లబ్యం కాలేదు. హాస్పిటల్ స్టాఫ్ వైధ్య సేవలో కోలుకుని ఆరోగ్యవంతుడైనప్పటికి ఎక్కడి వాడో ఎన్ని ప్రయత్నాలు చేసినా వివరాలు తెలుసుకో లేకపోయారు. మతిస్థిమితం లేని ఆ యువ సైనికుడిని ఎవరికి అప్ప గించడం , అతని భావి జీవితం ఎలాగని సైనిక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.నోటిమాట కూడా స్పష్టంగా లేదు. ఆ యువకుణ్ణి ఎక్కడ ఉంచాలని చర్చించుకుంటు సిపాయి చంద్రాన్ని మరిన్ని వివరాలు అడిగితే , భారత సైన్య గూర్ఖా దళ సైనికుడై ఉంటాడని మన దేశ సరిహద్దు ప్రాంతంలో చావు బతుకుల మద్య ఉంటే నాతోపాటు సైనిక శిబిరానికి చేర్చినట్టు చెప్పాడు సైనిక అధికారులకు. అధికారులు ఎన్నెన్ని ప్రయత్నాలు జరిపినా ఆ సైనికుడు ఎవరైందీ ఆచూకీ దొరక లేదు. సైనిక సిబ్బంది ఆ గూర్ఖా యువకుణ్ణి ఎక్కడికి చేర్చడమా అని ఆలోచనలో ఉంటే తనతో పాటు ఊరికి తీసుకెల్తానని , అతని వివరాలు తెలిసిన తర్వాత అప్పగిస్తానని సైనిక అధికారులకు చెప్పగా మాజీ సిపాయి చంద్రం వెంట పంపడానికి అంగీకరించారు. గూర్ఖా యువకుడితో పాటు చంద్రం తన గ్రామానికి చేరుకున్నాడు. సాహసంతో యుద్ధంలో కెళ్లి ప్రాణాలతో తిరిగొచ్చిన చంద్రానికి ఘనస్వాగతం లభించింది. . గూర్ఖా యువకుడిని చూసి ఊరి ప్రజలు ముందు అబ్యంతరం చెప్పినా అతని మానశిక స్థితిని గమనించి పంచాయతీలో అంగీకరించారు. * * * చంద్రం మిత్రుడు సింహాద్రి సైన్యంలో వేర్వేరు ఫిరంగి పటాలలో ఉండి చైనాతో యుద్ధంలో పాల్గొన్నందున అతని జాడ దొరక లేదు. యుద్ధంలో చనిపోయి ఉంటాడను కున్నారు.సింహాద్రి కి బదులుగా ఈ గూర్ఖా అబ్బాయి వచ్చాడను కున్నారు. మాజీ సిపాయి చంద్రానికి ప్రభుత్వం తరఫున భూమి , నగదు బహుమతిగా లభించాయి. తండ్రి చనిపోవడంతో కుటుంబ భాద్యత చూసుకోవల్సి వచ్చింది. సైన్యం నేర్పిన క్రమశిక్షణ, ప్రవర్తన ఇప్పుడు చంద్రానికి ఎంతో ఉపయోగ పడింది. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేక వెనుక బడిన ఊరి అభివృద్ధి కోసం పంచాయతీ ప్రశిడెంటుగా భాద్యత తీసుకుని గ్రామ బాగోగులు చూస్తున్నాడు. గూర్ఖా యువకుడు పొట్టిగా ధృడంగా ఉన్నాడు. చంద్రం స్నేహంతో బాగా కోలుకుని మెల్లగా తెలుగు మాట్లాడటం నేర్చుకున్నాడు. కలుపుగోలుగా ఉంటూ ఊరి జనంతో కలిసి పోయి ఎవరికి ఏ సహాయం అవుసరమైనా ముందుంటాడు. చంద్రం నేపాలి యువకుడికి ' బహదుర్' అని పేరు పెట్టినా ఊరి జనం మాత్రం 'బాబు ' అని పిలుస్తున్నారు. చంద్రం తన పరపతితో ప్రభుత్వ ఆహార గిడ్డంగిలో వాచ్ మేన్ గా ఉధ్యోగం వేయించాడు. చంద్రం గ్రామసర్పంచిగా ఎన్నికైన తర్వాత రక్షిత తాగునీరు, విధ్య , ఆరోగ్యం పారిశుద్ధ్యం పనుల మీద శ్రద్ధ వహించి జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అధికారుల మెప్పు సంపాదించాడు. బహదుర్ చంద్రానికి అన్ని విషయాల్లో తోడ్పాటుగా ఉంటూ కృష్ణార్జునుల్లా పేరు తెచ్చుకున్నారు. కాలగమనంలో చంద్రం తన చెల్లిని బహదుర్ కిచ్చి పెళ్లి చేసి జీవితంలో స్థిర పరిచాడు. వారికొక బాబు కలిగాడు. సంతోషంగా రోజులు గడుస్తున్న బహదూర్ కి విషాద సంఘటన జరిగింది. ఆహార గిడ్డంగి వద్ద డ్యూటీలో ఉండగా సాయంకాలం అకస్మాత్తుగా వచ్చిన భీకర గాలివానకు గిడ్డంగి కప్పు మీదున్న ఇనుప వాసం ఊడి బహదుర్ తలకి తాకింది. తలకి జోరుగా తగిలిన దెబ్బకు బహదుర్ స్ప్రుహ తప్పి పడిపోయాడు. తోటి సిబ్బంది వెంటనే పట్నంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లగా అత్యవసర శస్త్రచికిత్స జరపవల్సి వచ్చింది. అనుకోని ఈ దుర్ఘటనకు చంద్రం హతాసుడయాడు.డబ్బు ఖర్చు చేసి ఖరీదైన వైధ్యం చేయించాడు. కొద్ది రోజుల తర్వాత బహదుర్ కోలుకుని స్ప్రుహలో్ కొచ్చి వెర్రి చూపులు చూస్తూ వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఏదో అర్థం కాని భాషలో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న వారెవరికీ ఏమీ అర్థం కాక మెదడు దెబ్బతిని పిచ్చి వచ్చిందను కున్నారు. చంద్రానికి విషయం తెల్సి పరుగున బహదుర్ దగ్గర కొచ్చి పేరు పెట్టి పిలిచి ఏమైందని కంగారుగా అడిగాడు. " నా పేరు జియాంగ్ చింగ్ , నాది చైనా దేశం. నా ఊరి పేరు రాంగ్లీ. పదంచెన్ దగ్గరుంది. మీరంతా ఎవరు? నేను ఇక్కడి కెలా వచ్చాను?" అని బహదుర్ తెలుగులో అన్నాడు.అక్కడున్న హాస్పిటల్ సిబ్బంది , అందరూ ఆశ్చర్య పోయారు. చంద్రానికి ఏమీ అర్థం కాలేదు. బహదుర్ తన వెంట ఊరికి వచ్చి పదేళ్లు దాటింది. ఇన్నాళ్లు ఊరిలో ఒకడిగా కలిసి పోయాడు. గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా ఓటరు కార్డు , రేషను కార్డు సంపాదించి స్థానికుడిగా చెలామణి అవుతున్నాడు వేహ భాషలన్నీ గ్రామీణ పద్దతిలో ఉన్నాయి. కొంచెం రూపంలో మార్పు తప్ప మిగత పద్దతులన్నీ తెలుగు వాడిగా కనబడు తున్నాడు. తలకి దెబ్బ తగిలి హాస్పిటల్లో సర్జరీ జరిగి కోలుకున్నప్పటి నుంచి వింత మార్పు జరిగి విచిత్రంగా ప్రవర్తిస్తూ తను చైనా వాడినని , తన ఊరు పేరు చెబుతున్నాడు.చైనా యుద్ధం జరిగి పదేళ్లు జరిగింది. దాని విషయం జనం మర్చిపోయారు. మరిప్పుడు ఏమిటీ విచిత్ర పరిస్థితని చంద్రం అయోమయంలో పడ్డాడు. కొద్ది రోజుల తర్వాత బహదుర్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకు వచ్చారు. ఆరోగ్యం బాగుపడి మామూలు మనిషై తన డ్యూటీ చేసుకుంటు ఎప్పటిలా ఊరి జనంతో కలిసి నప్పటికీ అప్పుడప్పుడు తనది చైనా దేశమని , తన ఊరు రాంగ్లీ గ్రామమని , కొండల్లో ఉందని , తనకు అమ్మా నాయన అన్నయ్య ఊర్లో ఉంటారని తను ఆర్మీలో నౌకరి చేస్తున్నట్టు చెబుతు తనని ఎవరు ఇక్కడికి తీసుకు వచ్చారని అడుగు తూంటాడు. తన కుటుంబం ఎలా గుందోనని తనలో తనే మాట్లాడు కుంటుంటాడు. బహదుర్ తలకి దెబ్బ తగిలినప్పటి నుంచి మెదడు దెబ్బతిని పిచ్చెక్కి అలా మాట్లాడుతున్నారను కుంటున్నారు ఊరి జనం. బహదుర్ అప్పుడప్పుడు పిచ్చిగా ఏవేవో మాట్లాడటం విన్న చంద్రానికి అనుమానం కలుగుతోంది. పది సంవత్సరాల కిందట దేశ సరిహద్దు యుద్ధ ప్రాంతంలో అపస్మారక స్థితిలో చావుబతుకుల మధ్య ఉన్న బహదుర్ ని మన భారత సైన్య గూర్ఖా దళ సైనికుడని మానవత్వంతో ఆర్మీ శిబిరానికి చేర్చ వలసివచ్చింది. తర్వాత నుంచి బహదుర్ గురించిన ఏ సమాచారం తెలియదు. అతని తలలో దూరిన బుల్లెట్ ముక్క శస్త్రచికిత్స జరిపి తీసిన తర్వాత మతి స్థిమితం లేనందున తన పేరు, ఊరు కుటుంబ వివరాలు భారత సైన్య ఏ గూర్ఖా దళానికీ చెందిన వాడో తెలియలేదు. ఆర్మీ ప్రధాన కార్యాలయానికి ఏ సమాచారం తెలియలేదు. బహదుర్ ఫొటో తీసి అన్ని సైనిక దళాలకు పంపినప్పటికీ ఏ ఫలితం రాలేదు.తనతో వచ్చి ఊరిలో ఒకడిగా కలిసి పోయాడు. దేశంలో అందరూ యుద్ధ పరిస్థితుల్ని మరిచి పోయారు. తన ఆప్త మిత్రుడు సింహాద్రి జాడ తెలియక యుద్ధ క్షేత్రంలో చనిపోయాడని నిర్ధారణ కొచ్చారు. అన్నీ సద్దుమణిగి ప్రశాంతంగా రోజులు గడుస్తున్న ఈ సమయంలో జరుగుతున్నసంఘటనలతో అనుమానం కలిగి చంద్రం జిల్లా సైనిక సంక్షేమ అధికారికి విషయం తెలియచేసాడు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి బహదుర్ ప్రస్తుత ఫోటోతో జరిగిన సంఘటనల వివరాలతో సమగ్ర రిపోర్టు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కి పంపేరు. ఆర్మీ అధికారులు స్తూలంగా పరిశీలించి అనుమానంతో చైనా రాయభార కార్యాలయానికి బహదుర్ ఫోటోతో అతడు చెబుతున్న ఊరి పేర్లతో నోట్ తయారు చేసి , గతంలో జరిగిన చైనా యుద్ధ సమయంలో జాడ తెలియని వారి సైనికుల వివరాలు పరిశీలించగా బహదుర్ ఫోటోతో సరిపోలి అతను మాట్లాడుతున్న పిచ్చి మాటలు నిజమేనని నిర్ధారణ జరిగింది. వాస్తవానికి బహదుర్ గా పిలవబడే గూర్ఖా యువకుడు చైనా సైన్య సైనికుడనీ , సరిహద్దు గ్రామ నివాసని యుద్ధ సమయంలో పొరపాటున సరిహద్దు దాటి భారత భూభాగంలో వచ్చి నందున రైఫిల్ తూటా హెల్మెట్ కి తగిలి అపస్మారక స్థితిలో పడి ఉండగా మానవతా దృక్పధంతో చంద్రం భారత సైనిక స్థావరానికి చేర్చడం వల్ల ప్రాణాలతో బతికాడు. ఇదీ జరిగిన వాస్తవం. ఆర్మీ అధికారులు బహదుర్ని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కి రప్పించి చైనా రాయభార కార్యాలయ సిబ్బంది కి పరిచయం చెయ్యగా వారితో చైనాభాషతో మాట్లాడితే , అతను చైనా ఆర్మీ సైనికుడేనని అతను చెప్పిన ఊరు కుటుంబ సబ్యుల వివరాలు వాస్తవమని రుజువైంది. యుద్ధ సమయంలో బహదుర్ని గూర్ఖా సైనికుడిగా భావించి ప్రాణాపాయ స్థితిలో భారత సైనిక శిబిరానికి చేర్చి కాపాడిన మాజీ సిపాయి చంద్రం , తనతో ఊరికి తీసుకెళ్లి తమ గ్రామ వాసిగా భారతదేశ పౌరుడిగా గుర్తింపు సంపాదించి పెట్టాడు. తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటంటే , తను భారత దేశంలోనే ఉంటానని వీసా పాస్ పోర్ట్ సౌకర్యం కలిగిస్తే ఒకసారి తన స్వంత ఊరెళ్లి కుటుంబ సబ్యుల్ని కలిసొస్తానని పై అధికారులకు విన్నవించుకున్నాడు బహదుర్ ఉరఫ్ జియాంగ్ చింగ్ సమస్య సామరస్యంగా పరిష్కారమైనందుకు , బహదుర్ ' బాబు' గా ఊరికి ఉపకారిగా అందరి మన్ననలు పొంది నందుకు ఊరి సర్పంచి మాజీ సిపాయి చంద్రం ఆనందానికి అవధులు లేకపోయాయి.

మరిన్ని కథలు

Tappevaridi
తప్పెవరిది
- మద్దూరి నరసింహమూర్తి
Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి