
అనంతగిరిని ఆనందవర్మ పాలించేవాడు. అతని ఆస్థానంలో అతిథి వర్మ అనే గొప్ప విద్వాంసుడు వుండేవాడు. అతను గొప్ప నాదస్వర వాయిదానికి పక్క రాజ్యాధిపతుల బిరుదులతో పాటు ధనాన్ని కూడా పొందాడు.
అతిథి వర్మకు వస్తున్న కీర్తిని చూసి ఆనందవర్మకు అసూయ కలిగింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అతిథి వర్మకు తాను రాజ ఆస్థానంలో ఆశ్రయం ఇవ్వడం వల్లే గొప్ప ఘనకీర్తి వచ్చిందని భావించాడు. అతనికి వస్తున్న గొప్పపేరు తన వల్లే వచ్చిందని అది తనకే దక్కాలని ఉవ్విళ్లూరేవాడు.
తన కష్టాన్ని నమ్ముకున్న అతిథి వర్మ ఉత్తమ ప్రతిభ చూపి పొరుగు రాజ్యంలో వస్తున్న ప్రోత్సాహంతో తరచూ ఆ రాజ్యాలకు వెళ్లేవాడు.
ఇది చూసి ఆనంద వర్మ తనను అగౌరవ పరుస్తున్నాడని అతిథి వర్మపై కోపం పెంచుకున్నాడు. అప్పటి నుంచి అతిథి వర్మకు ఇచ్చే జీతభత్యాలను ఆపివేశాడు.
కడు పేదరికం నుంచి వచ్చిన అతిథి వర్మ ఆ నాటి నుంచి కుటుంబ పోషణ కష్టమై దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. విదేశాల నుంచి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని అత్యద్భుత ప్రతిభ చూపి కీర్తి, ధనం సంపాదించాడు. అయినా వచ్చే ధనం ఇతర రాజ్యాలకు వెళ్లి వచ్చే ఖర్చులకే సరిపోయేది. ఫలితంగా అతిథివర్మ కడు పేదరికాన్ని ఎదుర్కొన్నాడు.
ఓ సారి ఆనందవర్మ కుమారుడి పెళ్లికి నాదస్వరం వాయించాలని అతిథి వర్మను ఆహ్వానించాడు. అయితే అదే సమయానికి పొరుగు రాజ్యంలో పది దేశాలు నిర్వహించే నాదస్వర సమ్మేళనంలో తాను పాల్గొనడంతో రాజు పెళ్లికి రాలేకపోయాడు.
తన కొడుకి పెళ్లికి రాకపోవడంతో తనను అవమానించాడని అతిథి వర్మపై ఆనందవర్మ మరింత ద్వేషం పెంచుకున్నాడు.
పొరుగు రాజ్యంలో నిర్వహించిన నాదస్వర సమ్మేళనంలో అద్భుత ప్రతిభ చూపిన అతిథి వర్మకు ప్రథమ బహుమతి లభించింది. ఘన సన్మానం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి పొరుగు రాజులు ఆనందవర్మను ఆహ్వానించారు. అయితే అతని మీదున కోపంతో ఆనందవర్మ వెళ్లలేదు.
వారం రోజుల తర్వాత సొంత రాజ్యానికి వచ్చిన అతిథి వర్మకు స్వరాజ్య ప్రజలు ఘనంగా ఆహ్వానించి సన్మాన సభ ఏర్పాటు చేశారు. తన సన్మాన సభకు రావాలని అతిథి వర్మ రాజును ఆహ్వానించాడు. ఆనందవర్మ రాలేదు.
సన్మానం తర్వాత వచ్చిన బిరుదులు, విలువైన బంగారు పతకాలను రాజు వద్దకు తీసుకెళ్లి ‘‘ రాజా నన్ను క్షమించండి.. పది రాజ్యాల నాదస్వర సమ్మేళనంలో పాల్గొన్నందున నేను మీ కుమారుని పెళ్లికి రాలేకపోయాను.. మీ ఆశ్రయం వల్లే నాకు పొరుగు రాజ్యాలలో మంచి పేరు వచ్చింది. లభించిన బిరుదులు, కానుకలను మీకు అంకితం ఇస్తున్నాను.. స్వీకరించి నన్ను ఆశీర్వదించండి..’’ అని నమస్కరించి వాటిని రాజు చేతిలో పెట్టాడు.
అది చూసిన ఆనందవర్మ కళ్లు చెమర్చాయి. అతిథి వర్మ ప్రతిభను గుర్తించక నిరాదరణకు గురిచేసిన తనపై అపార రాజ భక్తి చూపుతున్న అతిథి వర్మ ప్రతిభను గుర్తించక నిరుత్సాహానికి గురి చేసిన తనను తానే నిందించుకున్నాడు ఆనందవర్మ.
కొద్ది రోజుల తర్వాత తన చిన్న కుమారుడి పెళ్లికి నాదస్వరం వాయించిన అతిథి వర్మ వాయిద్యాన్ని తిలకించేందుకు వచ్చిన పొరుగురాజులను చూసి ఆశ్చర్యపోయాడు ఆనందవర్మ.
తర్వాత అతిథి వర్మ ఇంటికి వెళ్లి పేదరికంలో వున్న అతిథి వర్మ కుటుంబ దీన స్థితిని గ్రహించి చలించిపోయి తన ఆస్థానంలో విద్వాంసుడిగా చేర్చుకుని ప్రోత్సహించాడు ఆనందవర్మ.