
"సార్, మిమ్మల్నే"
ఎవరో ముక్కు మొహం తెలియని ఒకాయన పిలిస్తె అటు చూసాను.
"మీ చేతిలోనున్న నెయ్యి పేకట్ 'డి మార్ట్' లో కొనుంటె ముప్పై అయిదు రూపాయలు మిగిలుండేది."
నేను డైమన్ పార్కు సమీపం లోని విశాఖ డైరీ పాల బూత్ లో నెయ్యి పేకట్ ను కొనడం గమనించినట్టున్నాడు.
"థాంక్యూ, కాని ఇక్కడ మన దగ్గర్లో 'డి మార్ట్' లేదు కదా, మాధవ ధారకో లేక మధురవాడకో వెళ్ళాలి, పరుగిడి పాలు తాగేకన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిది కదా" అన్నాను నేను.
"అదేమిటి సార్ మనకి దగ్గర్లో జగదాంబ జంక్షన్ లో ఉంది."
"అలాగా, నాకు తెలియదు, థాంక్స్ ఎ లాట్, .... సరే గాని మీరు నాకు చెప్పినట్టే అందరికి చెబుతారా? " అని అడిగాను.
"లేదండి, మీలాంటి వాళ్ళకు చెబుతాను."
నేను రిటైర్ అయి ఖాళీ గా ఉన్నానని అర్థం చేసుకున్నట్టున్నాడు. లేకపోతే ఒక్క నెయ్యి పేకట్ కోసం ఆ షాపు వరకు నడిచి వచ్చి ఎందుకు కొంటాను అన్న లాజిక్ పట్టుకున్నాడన్నమాట.
"అవునండి, ఇప్పుడు యూత్ అయితే మనం చెప్పినా వినరు. వాళ్ళు స్విగ్గీ మార్ట్ లోనో లేక బ్లింకిట్ లోనో లేక వేరే స్టోర్లో ఆన్ లైను లో తెప్పించుకుంటారు. రేట్లు గురించి పట్టించుకోరు. మీలాంటి వాళ్ళైతే నా మాట వింటారు. అందుకే మీకు చెప్పాను."
అవును నిజమే! ఆ మధ్యన హైదరాబాదులోని మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. ఇంట్లో ఎగ్స్ అయిపోయాయని వెంటనే స్విగ్గీమార్ట్ లో ఆర్డర్ చేసింది. పావు గంటలో తెచ్చిచ్చాడు గాని వాడు డజన్ ఎగ్స్ కు నూట ఇరవై రూపాయలు చార్జ్ చేసాడు.
"అదేమిటమ్మా బజారులో డజన్ ఎనబై రూపాయలే కదా" అన్నాను
" అవును డాడీ, కాని మనకు డోర్ డెలివరీ చేస్తారు మరియు పదిహేను నిముషాల్లో తీసుకొస్తారు కదా"
"అదనముగా డెలివరీ చార్జీలుండవా?"
"నాకు ఉండవు, నేను మహారాజ పోషకురాలిని." అంది నవ్వుతూ
"అవును కాలానుగుణంగా మనం కూడ మారాల్సిందేనేమో" అనుకున్నాను.
కాని మా చిన్నప్పుడు ఇవేవి లేవు. అప్పుడు "జగ్గన్న కిరాణా కొట్టు" తో నా అనుబంధం గుర్తొచ్చింది. గత స్మృతుల ప్రవాహములో కాసేపు డోలలాడాను. ఎంత ఆత్మీయత వెల్లి విరుస్తుందో ఆ బంధములో. ఇప్పటికీ నేను మా ఊరు వెళ్ళినప్పుడు జగ్గన్న కిరాణా కొట్టు మెట్లు ఎక్కకుండా ఉండను. ఇప్పుడు వాళ్ళ పెద్దబ్బాయి ఆ కొట్టును నిర్వహిస్తున్నాడు.
"మాస్టారు గారు బాగున్నారా?" అంటు ఆప్యాయమైన పలకరింపుతో నా మది ఆహ్లాదభరితమవుతుంది. ఇలాంటి అనుభూతుల్ని ఏ మార్టులో కొనగలం? అలా నా చిన్న నాటి ఊహల్లోకి వెళ్ళాను.
-----///-----
“ ఒరే బాబు ఈ రూపాయి తీసుకుని జగ్గన్న కిరాణా కొట్టుకు వెళ్ళి పావలా తాలింపు దినుసులు, పావలా ఎండు మిర్చి, అర్థ రూపాయి వంట నూనె పట్టుకురా" అని అమ్మ చెప్పగానే ఎగిరి గంతేసుకుని జగ్గన్న కొట్టుకు వెళ్ళేవాడిని, ఎందుకంటె వెళ్ళిన ప్రతిసారి అమ్మ ఇచ్చిన అయిదు పైసలతో పాటు జగ్గన్న నాకు ఒక బెల్లం ముక్క ఇచ్చేవాడు ఫ్రీగా. నాతో నా ఫ్రండ్ కృష్ణ వస్తే వాడికి కూడ ఒక బెల్లం ముక్క ఇచ్చేవాడు.
ఒక్కోసారి "చేతిలో డబ్బులు లేవు, రేపిస్తానని చెప్పురా" అని అమ్మ అంటే, జగ్గన్న అరువు కూడ ఇచ్చేవాడు.
చాల మంది నెల జీతగాళ్ళకు జగ్గన్న దగ్గర ఖాతా ఉండేది. వాళ్ళు సరుకులు కొన్న ప్రతిసారి ఖాతా పుస్తకములో నోట్ చేసుకునే వాడు. నెలకో సారి వాళ్ళ జీతం రాగానే చెల్లించేవారు.
ఆ రోజుల్లో "బతకలేక బడి పంతులు" అనేవారు. మరి ఒక ప్రయివేట్ మాస్టారి పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించండి. అప్పుడు మా నాన్న గారు ఒక ప్రయివేట్ మాస్టర్. ఊరిలో ఆర్థికముగా బలంగా ఉన్న వాళ్ళు వారి పిల్లలకి ఇంటివద్ద ట్యూషన్ లు చెప్పమనే వారు. నాన్న గారు ఆ విధముగా నాలుగిళ్ళకు వెళ్ళి ట్యూషన్ లు చెప్పేవారు. నెలకు సుమారు వంద రూపాయలు వచ్చేది. కాని మధ్య మధ్యలో వారి వద్ద ఇంటి అవసరాల నిమిత్తం కొంత నగదు వాడుకోవడం వలన ఏ నెలలోను పూర్తి జీతము వచ్చేది కాదు. వచ్చినా మా లాంటి వాళ్ళకి జగ్గన్న ఖాతాలు ఇచ్చేవాడు కాదు. ఎందుకంటె అప్పట్లో జగ్గన్న దగ్గర సరుకుల ఖాతా ఉండాలంటె దానికొక స్థోమతుండాలి. చిన్నదో పెద్దదో గవర్నమెంటు ఉద్యోగముండాలి. ప్రతి నెలా జీతము రాగానే క్రమం తప్పకుండా బాకీ చెల్లించాలి.
మాలాంటి వాళ్ళకి జగ్గన్న ఒక రోజు అరువు ఇవ్వడమే గొప్ప. కాని నాన్నగారి మంచితనం చూసి జగ్గన్న ఖాతా ఇస్తానన్నా నాన్నగారు తీసుకోలేదు. మా నాన్న గారికి ఈ విషయమై నేను అడిగితే "అంగట్లో అరువు తలమీద బరువు" అనే వారు.
-----///-----
నేను ఆరో తరగతిలో ఉండగా మా నాన్న గారు మా ఊరిలోని "సమితి ప్రాథమిక పాఠశాల" లో ఉపాధ్యాయునిగా నియమితులయ్యారు. "అంటె జగ్గన్న కిరాణా కొట్టులో మేము కూడ ఖాతా పెట్టుకోవచ్చన్నమాట" అనుకున్నాను.
నాన్న గారు ఉద్యోగములో చేరిన చోట తన సహోపాధ్యాయులంతా "బజారు వీధిలో హరి కిరాణా షాప్ లో మాకు ఖాతాలున్నాయి, ఊరిలో అందరి కన్నా తక్కువ రేట్లుకే అన్ని సరుకులు ఇస్తారు. అతని దగ్గర లేని వస్తువంటు ఏమి ఉండదు. మీరు కూడ అక్కడే ఖాతా పెట్టుకోండి" అని సూచించారు. కాని నాన్న గారు వినలేదు.
"మా ఇంటికి దగ్గరలో ఉన్న "జగ్గన్న కిరాణా కొట్టు" మాకు అలవాటు పడిన షాపండి" అని చెప్పి వాళ్ళ సూచనను సున్నితముగా తిరస్కరించారు.
ఆనందరావు గారు అక్కడ హెడ్ మాస్టరు గారు. ఆయనకున్న పరిపాలనా సంబంధిత పనుల్లో నాన్న గారి సహాయము తీసుకునేవారు. ఆ విధముగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆనందరావు గారు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుండేవారు. మేము కూడ వారి ఇంటికి వెళ్ళే వారము. అలా ఇరు కుటుంబాల మధ్య స్నేహ బంధం బలపడింది.
ఒక సారి పాఠశాలకు ఇచ్చిన నిధులు సక్రమముగా వినియోగించారో లేదో చూడడానికి తనిఖీ అధికారులు వచ్చారు. అది ప్రతి సారి జరిగే తంతే, కాని ఆ సారి తనిఖీ లో అయిదు వందల రూపాయలు గల్లంతు అయినట్టు గుర్తించారు. దానితో హెడ్ మాస్టర్ ఆనందరావు గారిని విధుల నుండి తొలగించారు. "అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టుంది" అని మిగతా ఉపాధ్యాయులు ఎగతాళి చేసినా, నాన్న గారు హెడ్ మాస్టర్ ఆనందరావు గారికి అండగా నిలబడ్డారు. తరువాత కొద్ది రోజుల్లోనే తనిఖీ అధికారులు తమ తప్పు తెలుసుకుని ఆనందరావు గారిని తిరిగి నియమించారు.
ఆ నిలుపుదల కాలములో ఆయనకొచ్చిన జీతములో కోత మూలముగా ఖర్చులకు ఇబ్బంది పడ్డారు ఆనందరావు గారు. 'హరి కిరాణా షాప్' లో ఖాతా బాకీలను సక్రమముగా కట్టకపోవడం వలన తదుపరి సరుకులు ఇవ్వడానికి వారు నిరాకరించారు. ఆ కాలములో నాన్న గారు జగ్గన్న ను సంప్రదించి ఆయన పరిస్థితిని వివరించి కొద్ది రోజుల్లో మళ్ళీ ఆయన నియామకం పునరుద్ధరిస్తారని నచ్చ జెప్పి అక్కడ సరుకుల ఖాతాను తెరిపించారు. అది నాన్నగారి మంచితనానికి జగ్గన్న ఇచ్చిన గౌరవం. అలాగే జగ్గన్న ఔదార్యము కూడ.
-----///-----
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అణచివేయడానికి అప్పటి ప్రభుత్వం 'ముల్కి రూల్స్' ప్రవేశపెట్టింది. దాని కారణముగా ఆంధ్ర ప్రాంతము వారికి అన్యాయం జరుగుతుందని భావించి "జై ఆంధ్ర ! జై జై ఆంధ్ర!!" అంటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమించారు. ఆంధ్ర ప్రాంతములో ఈ ఉద్యమం సుమారు ఆరు నెలలు ఉవ్వెత్తున ఎగిసింది.
"ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు" ఆ సమయం లో ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందులో పాల్గొనుటవలన వారికి ఆరు నెలలు జీతాలు రాలేదు. అప్పుడు కూడ నాన్నగారు చాల మందికి జగ్గన్న దగ్గర అరువు ఇప్పించారు. ఆ ఉద్యమం ముగిసిన తరువాత అందరు కూడ తమ తమ అప్పులు తీర్చేసారు.
ఆ విధముగా నాన్నగారి మీద జగ్గన్నకు సదభిప్రాయం ఏర్పడింది. మరియు జగ్గన్న వద్ద నాన్నగారి పరపతి పెరిగింది.
ఒకసారి జగ్గన్నకు ఒంట్లో బాగులేకపోతె, ఆయన్ని పరామర్శించడానికి నేను నాన్నగారితొ కలిసి జగ్గన్న ఇంటికి వెళ్ళాం.
"ఏమైందండి, మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది కదా " అన్నారు నాన్నగారు.
"మేస్టరు గారు నాకు అయిదు పదులు దాటుతుంది. నిత్యం కూర్చొనే ఉంటాము కదా. దాని వలన శరీరానికి తగిన వ్యాయామం లేక చక్కెర వ్యాధి వచ్చిందండి. దానికి మందులు వాడుతున్నాను. ఇప్పుడు హటాత్తుగా కడుపు నొప్పి వస్తె ఆసుపత్రికెళ్ళాను. హెర్నియా ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు."
"ఎవరు డాక్టర్ కన్నయ్య గారేనా?"
"అవునండి"
"నాకు ఆయన బాగా తెలుసు. నేను చెబుతాను మీ ఆపరేషన్ జాగ్రత్తగా చెయ్యమని" అన్నారు నాన్నగారు.
డాక్టర్ కన్నయ్య గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయికి ట్యూషన్ చెబుతారు నాన్నగారు. ఆ విధముగా నాన్నగారికి డాక్టర్ కన్నయ్య గారి దగ్గర కూడ పలుకుబడి ఉంది.
నాన్న గారు చెప్పడంతో డా. కన్నయ్య గారు జగ్గన్న ఆపరేషన్ చాల బాగా పూర్తి చెయ్యడమే కాకుండా ఫీజులో కూడ రాయితీ ఇచ్చారు.
-----///-----
మా వీధిలో ఎవరింట్లో ఏ కార్యమైనా వారికి కావలసిన సరుకులు లిస్టు రాసి జగ్గన్న కొట్టుకు పంపిస్తే చాలు వారి ఇంటికి సరుకులు పంపించేవాడు జగ్గన్న. డబ్బులు రావనే భయముండేది కాదు జగ్గన్నకు ఎందుకంటె అది ఆయన మంచి తనం మరియు అక్కడి మనుషులతో జగ్గన్న పెంచుకున్న అనుబంధం. ఆ కార్యము పూర్తి అయిన తరువాత వీలు చూసుకొని వారు చెల్లించే వారు.
"జగ్గన్నా మా వీధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు చేద్దామనుకుంటున్నాం, మీ వంతుగా విగ్రహానికి అయ్యే ఖర్చుని మాకు సహాయం చెయ్యాలి" అని ఒక సారి నేను నా స్నేహితులతో కలిసి వెళ్ళి అడగ్గానే "దేవుడి కార్యం కదా ఏ వీధి అయితేనేం" అని వెంటనే దానికి చెల్లించాల్సిన మొత్తం ఇచ్చాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మా గణపతి విగ్రహానికి ఆయనే దాత. అందుకే గణపతికి కూడ ఆయన మీద వల్లమాలిన ప్రేమాభిమానాలు.
ఒకసారి మా ఊరి పంచాయతి శానిటరీ ఇనస్పెక్టర్కి అందాల్సిన ముడుపులు సక్రమముగా అందక పోవడం వలన జగ్గన్న పై కల్తీ నెయ్యి అమ్ముతున్నారని కేసు పెట్టారు. అదంతా బోగస్ అని తరువాత తేలిపోయింది. ఇలా "గణపతి బప్పా" కూడ "ఉభయ కుశలోపరి" అన్నట్టు ఆయన్ని రక్షిస్తూ ఉండేవాడు.
జగ్గన్న ఆ విధముగా మా వీధి వాళ్ళలో ఒకడై పోయి మా అందరికి మా స్వకార్యాలలోనే కాక దైవకార్యాలలో కూడ తోడు నీడగా ఉండేవాడు. అక్కడ మా వారందరితోను అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది.
నాకు ఉద్యోగమొచ్చాక వేర్వేరు ఊళ్ళు బదిలీ పై వెళ్ళినా నేనుండే ఇంటికి దగ్గర్లో ఉండే కిరాణా షాపులన్ని "జగ్గన్న కొట్టు" లానే అనిపించేవి. నేను అక్కడే సరుకులు కొనేవాడిని. ఇప్పుడు కూడ మా ఇంటికి దగ్గర్లోని కిరాణా షాపులోనే మా నెల సరుకులు కొంటాను. ఎప్పుడైనా పిల్లల దగ్గరికి హైదరాబాదు వెళ్ళ వలసి వచ్చి ఒక నెల ఆ షాపుకు వెళ్ళకపొతే "ఏమిటి సార్, బాగున్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారు?" అని ఆషాపు యజమాని ఆప్యాయముగా అడుగుతాడు అచ్చం మా జగ్గన్న లాగానే. మరియు "భాను మూర్తి గారు, మోహన రావు గారు మీ కోసం అడిగారండి లాస్ట్ మంత్" అని మా రిటైర్డ్ ఫ్రండ్స్ యొక్క సమాచారాలు కూడ చెబుతుంటాడు.
ఈ ఆత్మీయతలు ఏ మార్టుల్లో మనకి దొరుకుతాయి?
-----///-----