గుణపాఠం - మద్దూరి నరసింహమూర్తి,

Gunapatham

జాతస్య మరణం ధృవం -- పుట్టిన ప్రతీ జీవి మరణించక తప్పదు --అని అందరికీ తెలుసు. కానీ, మితిమీరిన ఆత్మవిశ్వాసం, నిర్లక్ష్యం మరియు స్వయంకృతాపరాధం వలన కలిగే మరణాలు సహజం అనిపించుకోవు. అవి ఆత్మహత్యా సదృశాలు.

మా గృహ సముదాయంలో, మేము 12 మంది వృధ్ధ నాగరికులం ఒక సమూహంగా ప్రతీ రోజూ సాయంసంధ్యా సమయంలో ఒక చోట కూర్చొని, మా మాటలలో ప్రపంచమంతా చుట్టి వస్తూ ముచ్చట పడిపోతూ ఉంటాం. మా సమూహం ఏర్పడడానికి మూల స్తంభాలైన సత్యమూర్తి మరియు శ్రీనివాసరావులంటే అందరికీ గౌరవంతో కూడిన అవినాభావ ఆత్మీయత. ఏరోజైనా వారిద్దరిలో ఎవరైనా సాయంసంధ్యా ముచ్చట్లకు రాకపోతే ఒక తెలియని వెలితిగా అనిపిస్తుంది.

అంతగా మాలో మమేకమైన వారిద్దరూ రెండు నెలల అంతరంలో పరలోకగతులైపోవడం మాకు చాలా బాధ కలిగించింది. అయితే, వారిద్దరూ అలా మాకు దూరమవడానికి కారణాలు తెలిసిన తరువాత ప్రాజ్ఞులైన వీరిద్దరూ ఎందుకు ఇలా మరణాన్ని కోరి తెచ్చుకున్నారు అని అనుకోవలసి వచ్చింది.

మా వృధ్ధ సమూహానికే కాక మా గృహ సముదాయంలో ఉండే అందరికీ వారిద్దరి జీవితాల పరిశీలన గుణపాఠంలా నిలిచేయి.

ఒకరి జీవితం ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్తే, మరొకరి జీవితం స్వయంకృతాపరాధంకి చెల్లించాల్సిన మూల్యం తెలిసొచ్చేటట్టు చేస్తూ ఇద్దరిలోనూ ఉండే మితిమీరిన ఆత్మవిశ్వాసం అనర్థదాయకం అని ఎలుగెత్తి చాటింది.

ముందుగా, స్నేహితుడు సత్యమూర్తి జీవితం చూద్దాం.

“సిరీ, ఎన్నిసార్లు బెల్లు కొట్టినా మీ నాన్నగారు తలుపు తీయడం లేదు, ఆయన మొబైల్ రింగ్ అవుతోంది కానీ ఎత్తడం లేదు. నువ్వు ఈ ఇంటి మారు తాళం చెవి తీసుకొని వెంటనే రావాలి” – అని ఆదుర్దాగా చెప్పిన భర్త కిరణ్ మాటలు విన్న శిరీష సత్యమూర్తి ఇంటి మారు తాళం చెవి తీసుకొని స్కూటీ మీద బయలుదేరింది.

శిరీష వచ్చే లోపల సత్యమూర్తి ఫ్లాట్ కి ఆ పక్క ఈ పక్క ఫ్లాట్ వాళ్ళని కిరణ్ పిలుచుకొని రాగా ఓ పది మంది జనం గుమి గూడేరు. సత్యమూర్తి మొబైల్ నెంబర్ తెలిసిన వారందరూ అతని మొబైల్ కి రింగ్ చేయసాగేరు. కొందరు సత్యమూర్తి ఇంటి కాలింగ్ బెల్ అదే పనిగా నొక్క సాగేరు.

హఠాత్తుగా ఫ్లాట్ తలుపు తెరిచిన సత్యమూర్తి ఎటువంటి మాటలు లేక నాలుగు అడుగులు ఇంటి లోపలకు నడిచి అక్కడ ఉన్న సోఫాలో వాలిపోయి అయోమయంగా దిక్కులు చూస్తున్నాడు. అతని నోటి వెంట ఒక్క మాట కూడా రావడం లేదు. చేతులతో కానీ మరేవిధంగా కానీ ఎటువంటి సంజ్ఞలు కూడా చేయడం లేదు.

మరో ఐదు నిమిషాలలో అక్కడకు చేరుకున్న శిరీష, తండ్రి చుట్టూ మూగిన జనాన్ని పక్కకు తోసుకుంటూ, ముందుకు వచ్చి –

“నాన్నా నాన్నా ఏమిటయ్యింది నీకు, ఏమిటలా దిక్కులు చూస్తున్నావు, నేను చిన్నిని గుర్తు పట్టేవా” అని రోదనాభరితమైన కంఠంతో దీనంగా చూడసాగింది.

సత్యమూర్తి తన కూతురు శిరీషతో సహా ఎవరినీ గుర్తు పడుతున్నట్టు లేదు. ఎవరి మాటకి బదులు చెప్పడంలేదు,

సోఫాలో వాలిపోయిన సత్యమూర్తిని నిటారుగా కూర్చోపెట్టే ప్రయత్నంలో సత్యమూర్తి తల వెనుకకి చేయి వేసిన కిరణ్ చేయంతా రక్తసిక్తమై కనిపించేసరికి –

“సిరీ, మామయ్యకి మరొకసారి తల వెనక్కి దెబ్బ తగిలినట్లుంది. రక్తం వస్తోంది. మనం వెంటనే ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాలి. నా కారులో కూర్చోబెట్టాలి సాయం పట్టు”

కిరణ్ నోటివెంట ఆ మాటలు విన్న శిరీషకు దుఃఖం ఆగక కాలు చేయి ఆడలేదు.

వెంటనే అక్కడున్న జనంలోంచి నలుగురు ముందుకు వచ్చి “మేము కిరణ్ కి సాయాం చేస్తాం, నువ్వు ఇంటికి తాళం వేసి త్వరగా కిందకు రామ్మా” అని అందరూ కలిసి సత్యమూర్తిని కిరణ్ కారులో కూర్చోపెట్టే ప్రయత్నం చేసేరు.

ఆ ప్రయత్నంలో “మీ చేయి ఇక్కడ ఉంచండి, మీ కాలు మడిచి లోపల పెట్టండి” అన్న ఎవరి సలహాలకు సత్యమూర్తిలో ఎటువంటి స్పందన లేదు.

తండ్రిని పట్టుకొని శిరీష వెనక సీట్లో కూర్చొంటే, కిరణ్ దగ్గరగా ఉన్న ఆసుపత్రిలో అతనిని చేర్పించేడు.

సత్యమూర్తి తలకి తగిలిన దెబ్బకి ప్రథమ చికిత్స చేసిన ఆసుపత్రివారు MRI టెస్ట్ చేసి ఒక గదిలోకి చేర్చి పడుకోపెట్టేరు. అప్పటికి కూడా సత్యమూర్తి కళ్ళతో చుట్టూ చూడడం తప్పితే ఏమీ మాట్లాడడం లేదు, ఎవరికీ ఏమీ జవాబు చెప్పడం లేదు, ఎటువంటి చేష్టలు చేయడం లేదు.

MRI రిపోర్ట్ తో సహా సత్యమూర్తిని చూడడానికి వచ్చిన న్యూరోలాజిస్ట్ శిరీష మరియు కిరణ్ ని ఉద్దేశించి –

“ఏమి జరిగిందో వివరంగా చెప్పండి” అనగానే --- శిరీష చెప్పసాగింది.

సత్యమూర్తి ఇంటికి శిరీష ఇంటికి సుమారు రెండు కిలోమీటర్లు దూరం ఉంటుంది. విదేశంలో ఉన్న అబ్బాయి దగ్గరకి భార్య వెళ్లడంతో సత్యమూర్తి ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు.

ఎప్పటిలాగానే, ఈరోజు ఉదయం కూడా తొమ్మిది అవుతూండగా అమ్మాయి శిరీష ఇంటికి ఫలహారం చేయడానికి వచ్చేడు. అప్పుడే అతని తల వెనక్కి చిన్న బొడిపి కట్టి ఉండడం చూసిన శిరీష --

“ఏమైంది నాన్నా, నీ తల వెనక్కి ఈ బొడిపి ఏమిటి. ఎక్కడేనా పడ్డావా. ఇప్పుడు ఆటోలో వచ్చేవా లేక నీ అలవాటు ప్రకారం నడిచే వచ్చేవా”

“నేను నడిచే వచ్చేను. స్నానం చేస్తూంటే కాలు జారి బాత్రూం లో పడిపోయేనమ్మా. అప్పుడు ఈ బొడిపి కట్టి ఉండి ఉంటుంది. తగ్గిపోతుందిలే”

“నొప్పిగా ఉందా నాన్నా, డాక్టర్ దగ్గరకు వెళదామా”

“కొంచెం నొప్పి ఉందిలే. నిన్న రాత్రి బాగా నిద్ర పట్టలేదు. ఫలహారం చేసి నేను ఓ గంట పడుకుంటాను. అప్పుడు అవసరమైతే డాక్టర్ దగ్గరకు వెళ్ళవచ్చులే”

“తలకి దెబ్బ తగిలితే ఆటోలో రాకుండా నడిచి రావడం ఏమిటి నాన్నా. దారిలో రోడ్డుమీద పడిపోతే ఎంత ప్రమాదం”

సత్యమూర్తి నవ్వుతూ “రోజుకి రెండుసార్లు ఒక్కొక్కప్పుడు మూడుసార్లు మన ఇంటికి మీ ఇంటికి, అంటే రోజుకి నాలుగు నుంచి ఆరు కిలోమీటర్లు, నడిచే ఉక్కు శరీరమమ్మా నాది, నాకు ఏమీ అవదు”

అలా పడుకున్న సత్యమూర్తి మధ్యాహ్నం ఒంటి గంటకు లేచేడు.

“ఎలా ఉంది నాన్నా, డాక్టర్ దగ్గరకు వెళదామా”

“ఇప్పుడు నొప్పి లేదమ్మా మరి డాక్టర్ దగ్గరకు ఎందుకు. నేను చెప్పేను కదా నాకేమీ అవదని”

“హాలులో టీవీ చూస్తూండు. మీ అల్లుడు గారు పావుగంటలో వచ్చేస్తారు. ఇద్దరికీ కలిపి ఓ అరగంటలో వడ్డించేస్తాను”

పది నిమిషాల తరువాత వచ్చిన కిరణ్ తో శిరీష జరిగింది చెప్పి ఇద్దరికీ వడ్డించింది.

భోజనం చేస్తూ కిరణ్ –

“మామయ్యా, ఈరోజు మరి అటూ ఇటూ తిరగక ఇక్కడే ఉండిపోండి” అని సలహా ఇచ్చేడు.

“సాయంత్రం పనిమనిషి వస్తుంది కదా. అందుకే, భోజనం అయిన తరువాత ఓ గంట విశ్రాంతి తీసుకొని ఇంటికి వెళ్తాను. రాత్రికి మీరెలాగా వస్తారు కదా” అని నవ్వుతూ జవాబిచ్చేడు.

కొంత వయసొచ్చిన తరువాత కొంతమంది ఎవరి మాట వినరు, వారికి తోచినదే చేస్తారు అని తెలిసిన కిరణ్ మౌనంగా ఉండిపోయేడు. శిరీష ఏదో చెప్పబోతుంటే, వద్దని వారించేడు.

శిరీష ఇంట్లో పనులు చూసుకుంటూండగా, కిరణ్ కూడా ఇంట్లోనే ఆఫీసు పని చేసుకుంటూండగా – “నేను వస్తానమ్మా” అని సత్యమూర్తి తన ఇంటికి బయలుదేరేడు.

కిరణ్ తన కారులో దింపుతాడన్నా సత్యమూర్తి ఒప్పుకోడని తెలిసిన శిరీష కిరణ్ ఆ ఊసే ఎత్తలేదు.

ఆటోలో వెళ్ళమన్నా అతను వినక నడిచే వెళ్తాడని తెలిసిన శిరీష తండ్రికి ఏమీ చెప్పలేదు.

సత్యమూర్తి అలవాటుగా అలవోకగా నడిచి ఇంటికి చేరుకున్నాడు.

తండ్రి ఇంటికి బయలుదేరిన అరగంట తరువాత శిరీష ఫోన్ చేస్తే సత్యమూర్తి ఫోన్ రింగ్ అవుతున్నది, కానీ అతను ఫోన్ ఎత్తడంలేదు. ఆందోళనపడిన శిరీష పనుపున కిరణ్ వచ్చేడు సత్యమూర్తి ఇంటికి.

“ఇంతవరకే నాన్నకు నాకు మా ఆయనకు తెలుసు” డాక్టరుగారితో చెప్పింది శిరీష.

ఆమెకు తెలియనిదేమిటంటే –

ఇంటికి వచ్చిన సత్యమూర్తి బట్టలు మార్చుకొని బాత్రూంకి వెళ్లి లఘుశంక తీర్చుకొని వస్తూ కళ్ళు తిరిగి ద్వారం దగ్గర పడిపోయేడు. అతనికి బాత్రూంకి వెళ్లి వస్తూండడం జ్ఞాపకం ఉంది. కళ్ళు తిరగడం కానీ పడిపోవడం కానీ గుర్తుకు లేవు. కొంతసేపటికి తెలివొచ్చి చెవికి కాలింగ్ బెల్లు వినిపిస్తూంటే,

మెల్లిగా లేచి వీధి తలుపు తీసి, అంతలోనే మరలా కళ్ళు తిరుగుతూంటే మెల్లిగా సోఫాలో కూలబడ్డాడు.

“డాక్టరుగారూ, MRI రిపోర్ట్ ఎలా ఉంది, ఏమైనా సమస్య ఉందా”

“పెద్ద సమస్యే ఉందమ్మా”

“అంటే”

“మీ నాన్నగారికి మొదట తగిలిన దెబ్బతో మెదడులో రక్తం కొంత మేర గడ్డ కట్టినా, అది బొడిపి రూపంలో ఉండిపోవడం కొంత మంచిదైంది. ఆయన నడిచి మీ ఇంటికి రావడం తిరిగి నడిచి వెళ్లడంతో శారీరకంగా శ్రమ కలిగి రక్త ప్రసారం పుంజుకుంటుందేమో అనే సమయానికి మరోసారి తగిలిన దెబ్బతో రక్తస్రావమైంది”

“ఇప్పుడు ఏమి చేయాలంటారు”

“శస్త్ర చికిత్స చేయవలసిందే”

“మా నాన్నగారి ప్రాణానికి ఏమి ప్రమాదం లేదు కదా”

“చూడమ్మా, శాయశక్తులా మా ప్రయత్నం మేము చేస్తాము. ఆయన వయసు రీత్యా, తొలిసారి దెబ్బ తగలగానే, వెంటనే మీరు ఆయనను ఆసుపత్రికి తీసుకొని రావలసింది. అక్కడ ఆయన మీరు కలిసి చేసిన నిర్లక్ష్యంతో సహా, మరో నిర్లక్ష్యం ఆయనను ఒంటరిగా ఇంటికి పంపడం. అందుకే, శస్త్ర చికిత్స చేసి నాలుగు రోజులు ఆయన మా పర్యవేక్షణలో ఉన్న తరువాతనే ఆయన గురించి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలిగేది” అని ఆ వైద్యుడు నిర్మొహమాటంగా సత్యమూర్తి పరిస్థితిని వివరించేరు.

నాలుగు గంటల తరువాత ఆపరేషన్ గదిలోంచి వచ్చిన వైద్యుడు “సారీ, మా ప్రయత్నం మేము చేసినా, మెదడులో రక్తస్రావం అవడంతో పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయి, కోమాలోకి వెళ్ళిపోయేరు. కోమాలోకి వెళ్లిన పేషెంట్ గురించి ఇప్పుడేమీ చెప్పలేము. ప్రస్తుతానికి ఆయన్ను ఐసీయూలో ఉంచుతున్నాము. ఒక గంట తరువాత, మీరు ఒక్కొక్కరు వెళ్లి ఆయన్ను చూసి రావొచ్చు” అని చెప్పి వెళ్ళిపోయేరు.

అలా ఐసీయూలోకి వెళ్లిన సత్యమూర్తి మరునాడు తెల్లవారగట్ల కోమాలో ఉండగానే పైలోకానికి వెళ్ళిపోయేడు.

ఆ వార్త తెలిసిన శిరీష కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూంది, బావమరిదికి అత్తగారికి ఈ సమాచారం ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు కిరణ్.

తాను ఇచ్చిన సలహాతో ఇక్కడకు రావడానికి విదేశంలో బయలుదేరడానికి సిద్ధమవుతున్న తల్లి తమ్ముడుతో సంప్రదించి, వారిని ఒప్పించి, అంత దుఖంలోనూ ధైర్యంగా నిలబడి సత్యమూర్తి అవయవదానానికి సిద్ధమైన కిరణ్ శిరీషలను వైద్యుడు మనః పూర్తిగా అభినందించేరు.

‘ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కూడిన నిర్లక్ష్యం ఎంత దారుణమైన

ఫలితాన్నిస్తుందో తెలియ చేసింది ’ సత్యమూర్తి జీవితం.

ఇప్పుడు, స్నేహితుడు శ్రీనివాసరావు జీవితం ఏమి గుణపాఠం చెపుతూందో చూద్దాం.

“ఏమిటి రావుగారూ నాలుగు రోజులై మన సంధ్యా సమయం ఇచ్చకాలకు రావడం లేదు, ఏదైనా ఊరికి వెళ్ళేరా లేక ఏమైనా అనారోగ్యసమస్యలా”

“మీరు ఆఖరుగా అన్నదే ఖాయం చేసుకోండి”

“అంటే మీకు అనారోగ్యమా, నేను నమ్మలేను. మీరు నాతో పరిహాసం ఆడుతున్నారు కదూ”

“మీ దగ్గర ఎంత చనువున్నా, నా కంటే వయసులో పెద్దవారైన మీతో నేను పరిహాసమాడగలనా శర్మగారూ”

“మన సమూహంలో ఉన్న 12 మందిలో మీరే పరిపూర్ణ ఆరోగ్యవంతులు అని అందరూ అనుకూంటూంటే, మీరేమిటి ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఏమిటయ్యింది, కొంచెం వివరంగా చెప్పండి”

‘ చిన్న మాటలో చెప్పాలంటే – స్వయంకృతాపరాధం ’

ఇంతలో రావుగారి శ్రీమతి కాఫీ బిస్కట్లు తీసుకొని వచ్చేరు.

“ఏమిటమ్మా నాలుగు రోజులై రావుగారిని ఇలా నాలుగు గోడలకి పరిమితం చేసేసేరు”

“నాలుగు రోజుల క్రిందట ఆయన ఒంటరిగా ఆసుపత్రికి వెళ్లి వచ్చిన దగ్గరనుంచి ఇలా నాలుగు గోడల మధ్య ఒంటరిగా ఉంటున్నారు అన్నయ్యగారూ. ఎవరితోనూ మాట్లాడరు. ఆ రోజు ఆసుపత్రిలో ఏమైందో నాకు కానీ, మా అబ్బాయికి కానీ ఏమి చెప్పలేదు. మీ సమూహంలో మీరిద్దరూ అతి సన్నిహితంగా ఉంటారు అని అందరికి తెలుసు. కాబట్టి మీతో ఆయన ఏమైనా చెప్తారేమో”

”సరే అమ్మా నేను రావుగారితో మాట్లాడతాను, మీరు వెళ్ళండి. వెళ్తూ గది తలుపు చేరవేసి వెళ్ళండి”

ఆవిడ కాఫీ కప్పులు తీసుకొని గది తలుపు దగ్గరగా వేసి ఆవలకి వెళ్ళిపోయేరు.

“ఇప్పుడు చెప్పండి రావుగారూ, ఎప్పుడూ మీ భార్యాభర్తలు కలిసి ఆసుపత్రికి వెళ్ళే మీరు, ఒక్కరే ఆసుపత్రికి ఎందుకు వెళ్ళేరు. అక్కడ ఏమి జరిగింది”

“మీకు అన్నీ చెప్తాను శర్మగారూ. కానీ, మీరు ఎవరికీ ఏమీ చెప్పనని నాకు మాటిస్తారా”

“రావుగారూ, మీకు తెలుసో లేదో 'రోగం రట్టు' అంటారు”

“సరే. ఇప్పుడు నాకు వచ్చిన సమస్య మీతో ముందుగా చెప్పినట్టు స్వయంకృతాపరాధమే”

“ఆ ఒక్క పదంతో నాకు ఏమి అర్ధం అవుతుంది, కొంచెం వివరంగా చెప్పండి”

శ్రీనివాసరావు స్వతహాగా తెలివైన మనిషి. పరోపకారమిదం వెధవ శరీరం అని నమ్మే భోళా మనిషి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగంలో చేరే నాటికి ఆయన వయసు పాతిక దాటలేదు. పైఅధికారులతో వినయంగా, సహోద్యోగులతో సన్నిహితంగా, క్రిందిఉద్యోగులకు మిత్రుడిలా అందరికీ తలలో నాలుక లాగ ఉండేవారు. ఎవరికి ఏ సహాయం కావలసినా, ఆయనకు చేతనైనంత సహాయం చేస్తూ అందరి మన్ననలు పొందేరు. కార్యాలయంలో పనుల నిమిత్తమై తనకు కావలసిన జ్ఞానాన్ని ఆయన ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ, పైఅధికారుల సందేహాలకు కూడా రావుగారే సమాధానంగా నిలిచేరంటే అతిశయోక్తి కాదు.

అవసరమైతే, ఇతరుల పనిలో వారి సందేహాలకు కావలసిన సమాధానాలకు కూడా కలిపి కార్యాలయంలో ఆలస్యంగా కూర్చొని పని చేసేవారు. అలాటప్పుడు ఎక్కువగా టీ సిగరెట్లు త్రాగడం అలవాటైంది. ఆయనకు కాగితం మీద కలం పెట్టాలంటే పక్కన టీ చేతిలో సిగరెట్టు పక్కన సిగరెట్టు పాకెట్ ఉండి తీరవలసిందే. ఆయనని ఎవరైనా పొగిడితే సులువుగా మునగ చెట్టు ఎక్కేస్తారు. ఆ బలహీనత ఆసరా చేసుకొని, చాలామంది వారికి కావలసిన పనులు చేయించుకునేందుకు ఆయన దగ్గర ఉన్న ధూమ్రపానం వ్యసనం వాడుకొని, అతనికి ఎక్కువగా సిగరెట్టు ప్యాకెట్లు సిగార్ లైటర్ సమకూర్చడంతో ఆయన వ్యసనం బాగా ముదిరింది.

ఆయనకు పెళ్ళై భార్య కాపరానికి వచ్చేనాటికి ఆ వ్యసనం ముదిరిపోయింది. కానీ ఇంట్లో తల్లి తండ్రి సోదరులు క్రొత్త పెళ్ళాం ఉండడంతో, ఇంట్లో సిగరెట్టుని కాల్చడానికి మనసొప్పక, ఉదయం లేచిన దగ్గరనుంచి కార్యాలయానికి వెళ్లే లోపల ఒకసారి ఏదో పని మీద బయటకు వెళ్లి సిగరెట్టు త్రాగి, ఆ వాసన రాకుండా ఉండడానికి ఏదో చిరుతిళ్ళు తిని వచ్చేవారు. ఆదివారాలు సెలవురోజుల్లో మూడు నాలుగు సార్లు ఆలా బయటకు వెళ్లి వస్తూండేవారు.

నడక, ధ్యానం అలవాట్లతో మాత్రమే కాక, వయసుతో సహజంగా ఉండే రోగనిరోధకశక్తితో, ధూమ్రపాన వ్యసనం ఆయనకు ఏమాత్రం అనారోగ్యం కలిగించలేదు. దాంతో, తన ఆరోగ్యం మీద తనకు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఆ వ్యసనం మోతాదు పెరగసాగింది.

తన పనితో పాటూ ఇతరులకు సహాయం చేసే నిమిత్తం ఎక్కువ పనిని నెత్తిమీద పెట్టుకున్న రావుగారు ఆ పనులు శీఘ్రంగా చేసేందుకై ఆయన పడే తపన ఆయనకు మానసిక ఒత్తిడిని తెచ్చిపెట్టేయి. ఆ మానస ఒత్తిడి భౌతికంగా కూడా మారి ఆయనకు రక్తపోటు చక్కర వ్యాధి వచ్చేటట్టు చేసేయి. మరింత ఒత్తిడి సమకూరి ఆ వ్యాధులు ముదరసాగేయి.

ప్రతీ ఆరునెలలకు వైద్య పరీక్షలు చేయించుకునే భాగంగా ఒక రోజు ఆయనకి గుండెలో రెండు స్టెంట్లు వెంటనే వేసుకోవాలి అన్న వైద్యుని సలహా అందుకొనేటట్టుగా పరిణమించింది. అవి వేయించుకున్న తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలో భాగంగా ధూమ్రపానం బాగా తగ్గించుకోవలసి వచ్చినా, ఆరునెలలసరికి పుంజుకున్న ఆరోగ్యంతో ఆ వ్యసనం మరలా పునరుద్దించుకున్నారు.

కాలక్రమేణా తల్లితండ్రులు గతించడంతో పిల్లలకు ఎవరి సంసారాలు వారికి ఏర్పడి తానూ భార్యా మాత్రమే మిగలడంతో, ఇంటిదగ్గరే సిగరెట్టు కాల్చడం ఆరంభించేరు. క్రమేణా, ఆవిడ వెలిగక్కే వ్యతిరేకతకు విలువనివ్వడం తగ్గి, రోజుకి మూడు నాలుగు సిగరెట్టు పెట్టెలు ఖాళీ చేయడం అలవాటైంది.

ఇదంతా ఆయన గతం.

ప్రస్తుతంలోకి వస్తే – ఇరవై రోజుల క్రిందట ---

ఎప్పటిలాగే ఆయన వైద్యపరీక్షలకు వెళుతూ భార్యను కూడా తోడు రమ్మంటే –

“ఎప్పుడూ ఈ పరీక్షలగోలేమిటి, ఆసుపత్రి అంటే నాకు చికాకు. మీరు ఒక్కరూ వెళ్లి రండి, నేను మాత్రం ససేమిరా రాను” అని ఆమె మొండికేసేరు.

అలా ఒంటరిగా వెళ్లి రావుగారు చేయించుకున్న వైద్యపరీక్షలలో భాగంగా గుండెకు తీసిన x-ray చూసిన వైద్యునికి అనుమానం వచ్చి వెంటనే PSA పరీక్ష చేయిస్తే, ఆయన అనుమానం బలపడడంతో వెంటనే బయోప్సీ రిపోర్ట్ కోసం కావలసిన నమూనా తీసి పరీక్షకు పంపించి, 15 రోజుల తరువాత తప్పకుండా రమ్మని చెప్పేరు.

అలా నాలుగురోజుల క్రిందట ఒక్కరే వైద్యుని దగ్గరకు వెళ్లిన ఆయనకు, అశనిపాతంగా ఆ వైద్యుడు –

విపరీతమైన ధూమ్రపానంతో పాడైన ఊపిరితిత్తులలో వ్యాపించిన కాన్సర్ కణాలు బలంగా ఉండి కాన్సరు వ్యాధి ఇప్పటికే నాలుగో మెట్టుకు చేరుకుంది, ధూమ్రపానానికి శాశ్వతంగా దూరమవ్వాలని చెప్తూ, కాన్సరు కణాలు చాలా త్వరగా వృద్ధి చెందుతాయి కాబట్టి ఇప్పటికే రోగాన్ని ఆలస్యంగా గుర్తించడంతో ఇంక ఏమాత్రం ఆలస్యం చేయక వెంటనే కాన్సర్ వ్యాధికోసం ఎక్కడ చికిత్స తీసుకోవాలో సూచిస్తూ, ఆ వైద్యులు తెలుసుకొనేందుకు కావాల్సిన సమాచారం రిపోర్టులు ఇచ్చి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడకి వెళ్ళమని సలహా ఇచ్చేరు.

కట్టుకున్న భార్యకు కూడా ఆ పరిస్థితి చెప్పకుండా మనసులో అనేక ఆలోచనలతో సతమతమవుతూ, తనకు చేరువవుతున్న మరణాన్ని ఆలోచిస్తూ భయానికి లోనవుతూ, ఆయనకున్న రక్తపోటు చక్కరవ్యాధి పరిమాణాలు ఇంకా పెంచుకున్నారు.

అంతా విన్న శర్మగారు “రావుగారూ గతం గతః అన్నారు. ప్రస్తుతం మీరు ఇంట్లో ఎవరికీ మీ పరిస్థితి చెప్పకపోవడం చాలా పెద్ద తప్పు. నేను ఇప్పుడు వెళ్లిన వెంటనే, మీ భార్యకి అబ్బాయికి మీ పరిస్థితి తెలియచేయండి. వారి సహకారంతో మీ రోగానికి కావలసిన చికిత్స చేయించుకొని త్వరలో మీరు కోలుకోవాలని ఆ దేవదేవుని మనసారా వేడుకుంటున్నాను” అని చెప్పి వెళ్ళిపోయేరు.

ఆ రాత్రి శ్రీనివాసరావు ఇల్లు రణరంగంతో కూడిన దుఃఖసాగరంగా మారిపోయింది. తెలిసి తెలిసి తనకు పిల్లలకు ఇంత అన్యాయం చేయడానికి మనసెలా ఒప్పింది అని ఆయనను భార్య నిలదీసింది. ఆయన అబ్బాయి మనసంతా ఆందోళనతో నిండిపోయింది. ఇంతటి అనర్ధానికి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కూడిన స్వయంకృతాపరాధమే కారణం అని తలుస్తూ, శ్రీనివాసరావు ఆరాత్రి నిద్రను అసలు దరిచేరనీయలేదు. నిద్రలేమితో, ఉదయానికి చక్కర పరిమాణం రక్తపోటు ఎక్కువగా పెరిగిపోయేయి.

శ్రీనివాసరావు భవితవ్యం గురించి ఆలోచిస్తూ ఆరాత్రి ఆలస్యంగా నిద్రపోయిన శర్మగారు మరునాడు ఆలస్యంగా లేచిన అరగంటకు శ్రీనివాసరావు అబ్బాయినుంచి వచ్చిన ఫోన్ లో –

“ఉదయాన్నే శ్రీనివాసరావు పరలోకగతులయేరు” అని వినిపించిన వార్తతో ఆత్మీయుడిని కోల్పోయానే అంటూ శర్మగారు నిస్తేజులైపోయేరు.

‘ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కూడిన స్వయంకృతాపరాధం తననే కాక

తనను నమ్మినవారిని కూడా అర్ధాంతరంగా నట్టేట ముంచేస్తుంది ' అని

శ్రీనివాసరావు జీవితం ఒక గుణపాఠంగా నిలిచింది.

మరిన్ని కథలు

Bhamane satya bammane
భామనే... సత్య... బామ్మ నే
- కొడవంటి ఉషా కుమారి
Pundarika varada Hari Vithal-Story picture
పుండలీక వరదా హరి విఠల్
- హేమావతి బొబ్బు
Jagganna Kiranakottu
జగ్గన్న కిరాణా కొట్టు
- రాపాక కామేశ్వర రావు
Varada kalipina bandham
వరద కలిపిన బంధం
- డా.సి.యస్.జి.కృష్ణమాచార్యులు