
అది ఒక ఐదు అంతస్తుల అపార్ట్మెంట్. మూడో ఫ్లోర్ లో త్రీ డబల్ వన్ ఇంట్లోని కిటికీ దగ్గర కూర్చుని తదేకంగా క్రిందకి చూస్తున్నాడు బాబు. లేచి ఉన్నంతసేపూ ఆ కిటికీ దగ్గరే కూర్చుంటాడు. ఆయా వచ్చి "పాలు తాగుతావా?" అని అడిగింది. బుర్ర అడ్డంగా తిప్పాడు. 'వీడో మూగ మొద్దు!' అని అనుకుంటూ ఆ పాలన్నీ గటగటా తాగేసింది. రోజుా కిటికీ లోంచి క్రిందకి చూడడం బాబుకి బాగా అలవాటు అయింది. వాడి దినచర్యలో ఒక భాగమయ్యింది. సాయంత్రం ఆరు గంటలు అయింది. బాబు తండ్రి వాసు, తల్లి వాణి ఆఫీస్ నుంచి వచ్చారు. "బాబుా, పాలు తాగావా?" అని అడిగింది వాణి. బాబు చెప్పే లోపే, "పెద్ద గ్లాసు పాలు తాగెేడమ్మా!" అన్నది ఆయా. వాళ్లు మరి ఏమీ అనకుండా ఫ్రెష్ అవడానికి లోనికి వెళ్లారు. మళ్లీ వచ్చి ఒకరు లాప్టాప్, ఇంకొకరు సెల్ ఫోన్ పట్టుకుని కూర్చున్నారు. బాబు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఆయా వంట చేసి వెళ్ళిపోయింది. అలా రెండు గంటలు గడిచాక, బాబు 'ఆకలి!' అన్నట్టు తల్లికి కడుపు చూపించాడు. 'ఐదేళ్లు అవుతున్నా వీడికి మాటలు రాలేదు ఎందుకనో... ఇంకా మూగ భాషే!' దిగులుగా అనుకుంది వాణి. "ఏం కారణమో తెలియదు. ఒకసారి డాక్టర్ కి చూపిద్దాం!" అన్న ది వాణి. "సరే, రేపు మనిద్దరికీ సెలవు కదా! డాక్టర్ దగ్గరికి వెళ్దాం..." అన్నాడు వాసు. మర్నాడు బాబుని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అన్ని టెస్టులుా చేశారు. వాసుతో కొంతసేపు మాట్లాడాడు డాక్టర్. మర్నాడు వేరే డాక్టర్ కి కూడా చూపించాడు వాసు. ఇంటికి రాగానే, "నా బట్టలు, బాబు బట్టలు సూట్ కేస్ లో పెట్టు. మేము ఊరికి వెళ్ళాలి..." అన్నాడు, వాణితో. "ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు?" అడిగింది వాణి. "మా అమ్మ, నాన్నని చూడాలని ఉంది!" అన్నాడు వాసు. "అయితే మీతో బాబు ఎందుకు?" అని అడిగింది వాణి. "ముందు బట్టలు సర్దు, తీసుకెళ్తాను" అని గట్టిగా కసిరాడు. "పదిహేను రోజులు సెలవు పెడుతున్నాను..." అని బాబుని తీసుకుని బయటకు వెళుతుంటే, "అన్ని రోజులు ఎందుకు? మూడు రోజులు చాలు కదా, వాళ్లని చూడడానికి..." అన్నది వాణి. "నా ఇష్టం!" అన్నాడు వాసు. బాబుని తీసుకుని ట్రైన్ ఎక్కాడు. అది కూడా స్లీపర్ క్లాసు టికెట్ తీసుకున్నాడు. ట్రైన్ లో, 'టీ...టీ... చాయ్... చాయ్...' అంటూ ఒకరు, 'సమోసా, సమోసా!' అంటూ ఇంకొకరు, 'చెనక్కాయలు, చెనక్కాయలు...' అని ఇంకొకరు... ఇలా ఏదో ఒక వస్తువు అమ్మే వాళ్ళు వస్తున్నారు. బాబుకి అంతా వింతగా ఉంది, అంత మంది మనుషుల్ని చూడడం వలన. రాజమండ్రి దగ్గర ట్రైన్ దిగి, రావులపాలెం బస్సు ఎక్కారు వాళ్ళిద్దరూ. ఎనిమిది గంటలయింది ఇంటికి చేరేసరికి. సడన్ గా కొడుకుని, మనవణ్ణి చూసి ఆశ్చర్యపోయారు?వాసు తల్లి,దండ్రులు ఇద్దరుా. "ఏమైందిరా, ఇంత రాత్రివేళ వచ్చావు?" అని కంగారు పడిపోయారు. "ఏం లేదమ్మా. మిమ్మల్ని చూడాలని అనిపించి వచ్చాను." అన్నాడు వాసు. మనవడిని చూసి ఆనంద పడిపోయారు. ఎప్పుడో వాడికి ఏడాది వయసు ఉన్నప్పుడు చూశారు. మళ్లీ ఇప్పుడే చూడడం. వాడికి స్వయంగా స్నానం చేయించి, అన్నం తినిపించి, పడుకోబెట్టింది సీతమ్మ. ******** మరునాడు వాసు వచ్చాడని తెలిసి, వాసు ఫ్రెండ్ వేణు తన ముగ్గురు పిల్లలతో వచ్చాడు. వాళ్లను బెరుకుగా చూస్తూ ఉన్నాడు బాబు! కానీ, కొంతసేపటికి ఆ పిల్లల చనువుతో, వాళ్లతో ఆడుకోవడానికి బయటికి వెళ్లాడు. వేణుకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు. తన బాబు తోటి వాడే కాని వాడు గలగలా మాట్లాడుతున్నాడు. కొంతసేపటికి "తాతా, బిస్కెట్లు!" అంటూ వచ్చారు పిల్లలు. తండ్రి డబ్బాలోని బిస్కెట్లు తీసి ఇచ్చాడు అందరికీ. అలా రోజూ ఆడుకోవటం అలవాటయింది. ఒక వారం పోయాక ఒకరోజు, "తాత బిక్కి( బిస్కెట్)" అని అడిగాడు బాబు. ఆశ్చర్యపోయాడు వాసు, తన కొడుకు మాట్లాడటం చూసి! పెద్దవాళ్ళిద్దరికీ బాగా దగ్గరయ్యాడు బాబు. బాబుకి చిన్న చిన్న మాటలు వస్తున్నాయి. మళ్లీ మనవడిని తీసుకెళ్లి పోతాడేమో అని బెంగగా ఉంది ఇద్దరికీ. సడన్ గా "నాన్నా, అమ్మా! మీరిద్దరూ నాతో రావాలి." అన్నాడు వాసు. "ఎందుకురా దగ్గర్లో దీపావళి పండగ ఉన్నది కదా కోడల్ని రమ్మని చెప్పు ఇక్కడే పండగ జరుపుకుందాం" అన్నాడు తండ్రి రాఘవయ్య. 'కోడలికి తామంటే గిట్టదు.చాదస్తపు మనుషులు అని విసుక్కుంటుంది. అయినా సరే అదేమీ మనసులో పెట్టుకోకుండా తమ ఇంటి పిల్ల' అనుకున్నాడు రాఘవయ్య. ఇష్టం లేకపోయినా దీపావళికి వచ్చింది వాణి. అందరూ వచ్చారన్న సంతోషంతో సీతమ్మ వంటిల్లంత పిండి వంటలతో నింపేసింది. 'ఉన్న నలుగురు మనుషుల కోసం ఇన్ని వంటలు ఎందుకు' అని మనసులోనే విసుక్కుంది వాణి. రాఘవయ్య ముందు రోజే బజారుకెళ్ళి పటాసులు అన్నీ కొని తెచ్చారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆ ఇంటి మంగలి, చాకలి, పనివాళ్ళు, పొలంలో పనిచేసే రైతులు వాళ్లందరికీ కూడా చేసిన పిండి వంటలు, పటాసులు పంచిపెట్టడం చేశారు రాఘవయ్య, సీతమ్మ. వచ్చిన వాళ్ళందరూ "చల్లగా పది కాలాలపాటు ఉండండి బాబు" అని అందరినీ దీవించి వెళ్లారు. ఇల్లంతా దీపాల వెలుగులతో కళకళలాడింది. చిచ్చుబుడ్లు, పటాసులు, జువ్వలసందడితో వీధి వీధంతా మార్మోగింది. చాలా సంవత్సరాల తర్వాత సందడిగా పండగ చేసుకున్నారు అందరూ. ఆమరునాడే "నాకు సెలవు లేదంటూ" వాణి వెళ్లిపోయింది. 'అపార్ట్మెంట్లో దీపావళి అంటే నాలుగు కొవ్వొత్తులు వెలిగించి, ఓ నాలుగు పెన్సిల్స్ వెలిగించి ఇంట్లోకి వెళ్లిపోవడమే. అక్కడి నుంచి టీవీ చూడడం తప్పించి ఇంకేమీ ఉండదు. ఇక్కడి సందడికి పిల్లాడిలో చాలా మార్పు కనిపించింది ఎంతైనా ఉమ్మడి కుటుంబంలో ఉన్న పిల్లలు చాలా చురుకుగా ఉంటారు' అనుకున్నాడు వేణు. నాన్న, అమ్మ మీరిద్దరూ నాతో పట్నం బయలుదేరండి అన్నాడు వేణు. "మేమెందుకు రా మాకు బోలెడు పనులు ఉన్నాయి ఇక్కడ" అన్నారు సీతమ్మ, రాఘవయ్య. "అదంతా నేను చూసుకుంటాను," అని వేణుని పిలిచి పొలం కౌలుకి ఇచ్చాడు. ఇంటికి తాళం వేసి వేణుని చూసుకోమన్నాడు. ఇక్కడి పనిమనిషి రంగిని కూడా వెంట తీసుకెళ్లాడు, ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పి. *** అందరిని చూసిన వాణి మనసులోనెే విసుక్కుంటూ, బయటకు మాత్రం, "బాగున్నారా అత్తయ్య గారుా, మామయ్య గారుా?" అని అడిగింది. ఆయాను మానిపించేశాడు వాసు. రంగి ఇంట్లో పనులన్నీ చేస్తుంది, తల్లికి సహాయంగా. బాబు చాలా హుషారుగా ఉన్నాడు. బాబు ని సాయంత్రం పూట దగ్గరలో ఉన్న పార్క్ కి తీసుకెళ్తున్నారు తాతా, నాయనమ్మ. బాగా చలాకీగా ఉంటున్నాడు. మాటలు కూడా కొంచెం కొంచెం వస్తున్నాయి. నెల రోజులు గడిచాయి. 'ప్రశాంతంగా ఉంది' అనుకున్నాడు వాసు. ఇంతలో, "ఇంకెన్నాళ్లు ఉంటారు మీ అమ్మ నాన్న? నెల రోజులు అయింది వచ్చి!" అని కోపంగా అడిగింది వాణి. "మా అమ్మ, నాన్న ఇక వెళ్లరు, ఇక్కడే ఉంటారు!" అన్నాడు వాసు. "ఎందుకీ లంపటం మనకి? నేనొప్పుకోను!" అన్నది వాణి. చెంప మీద ఒక్కటిచ్చాడు వాసు, భార్యకి. "అసలు నీకేం తెలుసు వాళ్ళ విలువ ?" అని ఆగి, "డాక్టరు ఏమన్నాడో తెలుసా? బాబు ఇలా డల్ గా మాటలు రాకుండా ఉండడానికి కారణం మనమే. మన ఉద్యోగం, సంపాదన అంటూ ఇద్దరం బయటకు వెళ్ళిపోతున్నాము. వాడితో మాట్లాడేవారు ఎవరూ లేక వాడికి మాటలు రాలేదు. వాడు చిక్కి పోవడానికి కారణం ఆయా. మనం వాడికి ఇచ్చేవన్నీ తను తినేస్తుంది వాడికి పెట్టకుండా. ఎదురింటి బామ్మగారు చెప్పేదాకా, ఈ విషయం నాకు తెలియదు. అమ్మగా వాడి గురించి ఏమైనా ఆలోచించావా? ప్రపంచంలో ఎన్నో బంధాలు అవసరాల కోసం పుడుతుంటాయి కానీ ఏ అవసరం లేకుండా స్వార్థం లేకుండా పుట్టే నిజమైన బంధం తల్లి అనుబంధం ఒకటే. వాడు రోజూ కిటికీలోంచి ఏం చూస్తున్నాడో తెలుసా? అక్కడ కూలీల కుటుంబాలు ఉన్నాయి గుడిసెల్లో. భార్యాభర్తలిద్దరూ కూలికి వెళ్ళిపోతూ తమ పిల్లవాడిని, పెద్దవాళ్ళయిన తమ తల్లిదండ్రులకు అప్ప చెబుతున్నారు. వాళ్లు సంతోషంగా వాళ్లతో ఆటలు, పాటలు, డాన్సులు. అది చూసి మనవాడు అలా తనకు లేరని ఫీలవుతున్నాడు. అది మనకు చెప్పలేక పోతున్నాడు. ఇప్పుడు చూడు, అమ్మ నాన్నతో ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో! మాటలు కూడా వస్తున్నాయి. చాలా హుషారుగా ఉన్నాడు. ఆ కూలీలకు ఉన్న జ్ఞానం, మంచి మనసు మనకు లేదు..." అన్నాడు వాసు. భర్త మాటలకు తనలోని తల్లి మనస్సు మేల్కొంది. "నిజమేనండీ, నేను గమనించలేదు గాని బాబులో చాలా మార్పు వచ్చింది. మాటలు రాలేదని ఇన్నాళ్లు స్కూల్లోకూడా జాయిన్ చేసుకోలేదు!" అంటూ చక్కగా ఆరోగ్యంగా ఉన్న బాబుని చూసి మురిసిపోయింది వాణి. 'ఇదంతా అత్తయ్య, మామయ్య గారి దయ' అనుకుని వాళ్లని ఆదరంగా చూడటం మొదలు పెట్టింది. ఆ మార్పుకి చాలా సంతోషించారు పెద్దవాళ్ళు ఇద్దరూ. 'భార్యమీద చెయ్యి చేసుకునేటంత కుసంస్కారం తనకు లేదు. కానీ బాబు పరిస్థితి తలుచుకుంటేనే భయంవేసింది. ఆ రోజు బాబుని చైల్డ్ సైక్రియాటిస్ట్ దగ్గర చూపించినప్పుడు బాబుకి ఆటిజం అనే జబ్బు వచ్చిందని, దానివల్లే మాట్లాడలేకపోతున్నాడని చెప్పారు. ఇది అమెరికాలో పిల్లలకు ఎక్కువ వస్తుందట! ఎందుచేతనంటే అక్కడ నాన్నమ్మ, తాతయ్యలు, అమ్మమ్మలు పిల్లలతో టైం స్పెండ్ చేయరు, ఆఖరికి తల్లిదండ్రులు కూడా సరిగా చూడరు అందుచేత వారికి ఎక్కువ వస్తుంది. ఇండియాలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. రాను రాను ఇక్కడ కూడా నేర్చుకున్నారందరూ... స్వేచ్ఛగా, ఒంటరిగా ఉండటం. భార్య, భర్త, ఓ పిల్లాడు లేక పిల్ల... అందుకే వాళ్లకు ఒంటరితనం. వాళ్ళు బయటికి చెప్పుకోలేక పోతున్నారు... దీన్ని మొదట్లోనే గుర్తించకపోతే చాలా ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పారు. అందుచేత పిల్లలకు ఈ పరిస్థితి రానివ్వకూడదని, దీనికి ట్రీట్మెంట్ కన్నా పిల్లలతో ఎక్కువ శాతం, పెద్ద వాళ్లు గడపడమే మార్గమని, పెద్దవాళ్లు లేనివారు కనీసం తల్లి, తండ్రి అయినా పిల్లలతో టైం స్పెండ్ చేయాలని లేకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్ గారు చెప్పారు. తల్లిదండ్రుల్ని దూరంగా పెట్టిన తమ లాంటివాళ్ళు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రుల విలువ తెలుసుకోలేక పోతున్నారు.' అనుకున్నాడు వాసు స్వగతంగా. * * *